పెనమలూరు: మండలంలోని తాడిగడప మునిసిపాలిటీలో చెత్త తరలించే వ్యాన్ డ్రైవర్లు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని తాడిగడప సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తి మాట్లాడుతూ.. చెత్త తరలించే వ్యాన్ డ్రైవర్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదన్నారు. న్యాయం చేయాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తాడిగడప మునిసిపల్ కమిషనర్ భవానీప్రసాద్కు వినతిపత్రం ఇచ్చినా ఫలితంలేదని ఆరోపించారు. మంత్రి నారాయణతో మాట్లాడి జీతాలు ఇప్పిస్తామన్న హామీ అమలుకు నోచలేదన్నారు. డ్రైవర్లకు న్యాయం చేయకపోతే సమ్మెను ఉధృతం చేసి మునిసిపాలిటీని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతలు షేక్ మస్తాన్వలి, సత్యనారాయణ, శ్రీహరి, కిషోర్ పాల్గొన్నారు.
స్వర్ణభారత్లో ఫార్మా నైపుణ్యాభివృద్ధి శిక్షణ
ఉంగుటూరు: స్వర్ణభారత్ ట్రస్ట్లో ఫార్మా, వ్యాక్సిన్, వైద్య ఉపకరణాల తయారీ శిక్షణ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో సువేన్ ఫార్మా, ఎల్ఎస్ఎస్ఎస్డీసీ మధ్య మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో శనివారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో స్వర్ణభారత్ సీఈఓ శరత్ బాబు, ఈడీ పరదేశి, ఎల్ఎస్ఎస్ఎస్డీసీ సీఈఓ గౌతమ్ భట్టాచార్య, సువేన్ ఫార్మా కంపెనీ కార్యదర్శి కుందన్కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సువేన్ ఫార్మా నిధులతో లైఫ్ సైన్సెస్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమ పూర్తి అమలును ఎల్ఎస్ఎస్ఎస్డీసీ చేపడుతుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ యువతకు ఫార్మా రంగంలో నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపాధి కల్పించే దిశగా శిక్షణా కార్యక్ర మాన్ని రూపొందించినందుకు స్వర్ణ భారత్ ట్రస్ట్, ఎల్ఎస్ఎస్ఎస్డీసీ, సువెన్ ఫార్మా సంస్థను వెంకయ్యనాయుడు అభినందించారు.
21 నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ క్రీడా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయాలు, అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల బాస్కెట్బాల్ (పురుషులు), తైక్వాండో (మహిళలు), బ్యాడ్మింటన్ (పురుషులు) పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జట్లను ఎంపిక చేస్తున్నట్లు వర్సిటీ క్రీడా విభాగం కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఈ నెల 21వ తేదీన బాస్కెట్బాల్ పురుషుల జట్టును ఏలూరులోని ఏఎస్ఆర్ఏఎం మెడికల్ కాలేజీ ప్రాంగణంలో, తైక్వాండో మహిళల జట్టును విశాఖపట్నంలోని ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో, 22వ తేదీన బ్యాడ్మింటన్ పురుషుల జట్టును రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అంతర కళాశాలల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
రెండు గ్రామాల్లో కేంద్ర బృందం పరిశీలన
జగ్గయ్యపేట: మండలంలోని తక్కెళ్లపాడు, గండ్రాయి గ్రామాల్లో కేంద్ర కమిటీ బృంద సభ్యులు (మహారాష్ట్ర) అశోక్, సూర్య శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అమలవుతున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గ్రామ సచివాలయాల్లో అడిగి తెలుసు కున్నారు. పింఛన్లు, హౌసింగ్, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వివరాలతో పాటు గ్రామ పంచాయతీల ద్వారా జరుగుతున్న అభివృద్ధి వివరాలను సచివాలయ కార్యదర్శులు వివరించారు. తక్కెళ్లపాడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి సీ్త్రనిధి చెల్లింపుల్లో అవినీతి జరిగినట్లు పలువురు కేంద్ర బృంద సభ్యులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ కిరణ్కుమార్, సర్పంచ్లు కస్కుర్తి శ్రీనివాసరావు, కొత్తపల్లి లూర్దుమేరి, ఎన్ఆర్ ఈజీఎస్ ఈసీ సంతోష్, పంచాయతీ రాజ్ జేఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment