జగ్గయ్యపేట: మచిలీపట్నం – హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గం కావడంతో ఈ హైవే 24 గంటలూ రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలోని పాలేటి బ్రిడ్జిపై పడిన గండికి చేపట్టిన మరమ్మతుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. మరమ్మతులను పర్యవేక్షించాల్సిన హైవే అథారిటీ అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
15 మీటర్ల మేర కోత
భారీ వర్షాలకు పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో రామాపురం క్రాస్రోడ్డుకు సమీపంలో ఉన్న పాలేరు బ్రిడ్జికి ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో గండి పడింది. బ్రిడ్జి మీదుగా వరద పోటెత్తడంతో రహదారి 15 మీటర్ల మేర కోతకు గురైంది. నాటి నుంచి నేటి వరకు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో రామాపురం క్రాస్ రోడ్డు వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గరికపాడు వరకు వన్ వే ద్వారానే రాకపోకలు కొనసాగుతున్నాయి.
పట్టించుకోని హైవే అధికారులు
పాలేరు బ్రిడ్జి కోతకు గురై 42 రోజులు గడిచినా నేషనల్ హైవే అథారిటీ అధికారులు మరమ్మతులపై దృష్టి సారించడంలేదు. బ్రిడ్జి కోతకు గురైన సమయంలో మొక్కుబడిగా పనులు చేస్తున్నామంటూ ఆ ప్రాంతంలో రాళ్ల కుప్పలు పేర్చి రాకపోకలను నిషేధించి చేతులు దులుపుకొన్నారు. రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఉన్నప్పటికీ సక్రమంగా పనిచేయడంలేదు.
నిత్యం వేల సంఖ్యలో వాహనాలు
హైదరాబాద్ – విజయవాడ మధ్య నిత్యం 22 వేల వరకు పలు రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జి మరమ్మతుల్లో జాప్యం కారణంగా రామాపురం క్రాస్రోడ్డు నుంచి గరికపాడు చెక్పోస్ట్ వరకు వన్వేలోనే వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ను నియంత్రించడానికి ఏ ఒక్కరూ లేకపోవడంతో రెండు కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. దసరా పండుగకు తెలంగాణ నుంచి ఏపీకి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో ఐదు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
హైదరాబాద్–విజయవాడ రోడ్డులో పాలేరు బ్రిడ్జి మరమ్మతుల్లో జాప్యం మొద్దు నిద్ర వీడని నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఏపీ తెలంగాణ బోర్డర్ల వద్ద నిత్యం ప్రమాదాలు 42 రోజులుగా 2 కి.మీ. మేర వన్వేలో వాహనాల రాకపోకలు
నిత్యం ప్రమాదాలు
వాహనాలు వన్వేలో ప్రయాణించడంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇటీవల బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. కారు, లారీ ఢీకొన్న మరో ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పలు ద్విచక్ర వాహనాలు డివైడర్లను ఢీకొట్టాయి. తెలంగాణకు చెందిన యలమర్తి అశోక్ (30) ఈ నెల 17 రాత్రి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా వన్వేలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాజాగా శనివారం రాత్రి ద్విచక్రవాహనం, లారీ ఢీకొనడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వన్వే వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, మరమ్మతులను త్వరితగతిన చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇటీవల చిల్లకల్లు పోలీసులు హైవే అథారిటీకి నోటీసులు కూడా జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment