‘రియల్’ దగా..!
● సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు
● బోర్డు తిప్పేసిన నిర్వాహకులు
● గగ్గోలు పెడుతున్న బాధితులు
వీరఘట్టం: పాలకొండ పరిసర ప్రాంతంలో అందమైన ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే మా వెంచర్లను సంప్రదించండి..సులభ వాయిదా పద్ధతిలో ప్రతి నెలా రూ.4000లు చొప్పున 50 వాయిదాలు చెల్లించి ఇంటి స్థలాన్ని మీ సొంతం చేసుకుని మీ కలలను సాకారం చేసుకోండని చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్ధ చేసిన ప్రచారంతో వందల మంది ఆకర్షితులై చివరికి మోస పోయారు. రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఏజెంట్ల ద్వారా సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పాలకొండకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు వారాడ రాజేంద్రనాయుడు, రేజేటి శేఖర్, అలజంగి శంకరరావులు తనను ఏజెంట్గా పెట్టుకుని సుమారు రూ.60 లక్షలు కాజేశారని వీరఘట్టానికి చెందిన పిన్నింటి వెంకటరమణ శనివారం ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి రియల్ ఎస్టేట్ నిర్వాహకులపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.కళాధర్ తెలిపారు. స్థానికులైన 41 మంది బాధితులు ప్రతి నెలా వాయిదాలు కట్టగా ఆ డబ్బులను నిర్వాహకులకు అందజేసినట్లు వెంకటరమణ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాయిదా కాలపరిమితి ముగిసినప్పటికీ ఇంటి స్థలాలు కేటాయించకుండా సదరు నిర్వాహకులు తప్పించుకు తిరుగుతున్నారని, వాయిదాలు కట్టిన వారు తనను నిలదీస్తున్నారని ఫిర్యాదులో ఏజెంట్ వెంకటరమణ వాపోయినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళాధర్ చెప్పారు.
చాలా రోజులుగా ఫిర్యాదులు
పాలకొండకు చెందిన ఓ రియల్ ఎస్టేట్లో డబ్బులు కట్టి, వాయిదాలు ముగిసినా సదరు నిర్వాహకులు ఇంటి స్థలం అప్పగించడం లేదని చాలా మంది బాదితులు చాలా రోజులుగా వీరఘట్టం, పాలకొండ పోలీస్స్టేషన్లలో మౌఖికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే రాత పూర్వకంగా ఇంత వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. చివరకు వీరఘట్టానికి చెందిన ఏజెంట్ వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాధితులు మాత్రం ఏ ఏజెంట్ల వద్ద డబ్బులు కట్టారో వారిని నిలదీస్తున్నారు. ఆ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఎవరో మాకు తెలీదు. మీకే డబ్బులు కట్టాం కాబట్టి మీరే బాధ్యత వహించి మా డబ్బులు తిరిగి ఇప్పించాలని ఏజెంట్లపై ఒత్తిడి తేవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో పోలీసులు తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
కేసు నమోదు చేశాం..
వీరఘట్టానికి చెందిన పిన్నింటి వెంకటరమణ ఇచ్చి న ఫిర్యాదుపై రియల్ ఎస్టేట్ నిర్వాహకులపై శని వారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.కళాధర్ తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment