● వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి
యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గత ఐదేళ్ల పాలనలో ప్రజలు గుర్తించారని ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో వైజాగ్లో స్వదేశీ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలను రప్పించి సెమినార్లు నిర్వహించారని, అనేక మంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివలన వేలాదిమంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు. నవరత్నాల పథకాలు అమలు పరచి పేద ప్రజలకు ఎంతో మేలు చేశారని, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పథకం వారికి దక్కేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డితో కలిసి నడిచే అవకాశం తమకు దక్కిందని, ఆయన ఆదేశాల మేరకే తాను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసేలా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని ఆయన కోరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వచ్చేలా కష్టపడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్, ఎన్నికల అబ్జర్వర్ వెన్నా హనుమారెడ్డి, ఇరిగేషన్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, పెద్దారవీడు మండల జెడ్పీటీసీ యేర్వ చలమారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment