మొయినాబాద్: విద్యార్థులు చక్కగా చదవాలంటే ముందుగా పాఠశాల వాతావరణం బాగుండాలి. మౌలిక వసతులు ఉండాలి. చాలావరకు ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కానీ ఆ ప్రధానోపాధ్యాయుడు పనిచేసే చోట ముందుగా విద్యార్థులను పాఠశాల ఆకట్టుకునేలా ఉండాలని భావించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యాబోధనకు అవసరమైన అన్ని వసతులు కల్పించారు. ఆయనే మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య. వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా మల్లయ్య ఎనిమిదేళ్ల క్రితం వచ్చారు. ఆయన పాఠశాలకు వచ్చిన రోజు విద్యార్థులకు సరైన తరగతి గదులు లేవు. అప్పటికే ప్రభుత్వం కొత్త భవనం నిర్మించినా అసంపూర్తిగా ఉంది. టాయిలెట్స్ సరిగా లేవు. సైన్స్ ల్యాబ్ లేదు. విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు, టేబుళ్లు లేవు. పాఠశాల ఆవరణంతా గుంతలుగా ఉంది. పాఠశాలలో ఉన్న ఈ వాతావరణాన్ని పూర్తిగా మార్చి విద్యార్థులను ఆకట్టుకునేలా తయారు చేయాలని సంకల్పించారు మల్లయ్య.
దాతలు, స్వచ్ఛంద సంస్థలు,
గ్రామస్తుల సహకారంతో..
మొదట అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తి చేసేందుకు దాతల సహకారం తీసుకున్నారు. తరగతి గదులన్నీ బాగుచేయించి రంగులు వేయించారు. తరగతి గదుల్లో, గోడలపై సరస్వతీదేవి, భరతమాత, దేశ నాయకుల బొమ్మలు, సైన్స్, జీవ శాస్త్రం, గణిత శాస్త్రానికి సంబంధించిన బొమ్మలు వేయించారు. గ్రామస్తుల సహకారంతో పాఠశాల ఆవరణలో మట్టి పోయించి చదును చేయించారు. మొక్కలు నాటి హరిత వనంలా తీర్చిదిద్దారు. ప్రాజెక్టు నిర్మాలయ సంస్థ సహకారంతో టాయిలెట్స్ ఏర్పాటు చేయించారు. ఆకృతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ట్యాబ్స్ ఇప్పించడంతోపాటు సైన్స్ల్యాబ్ ఏర్పాటు చేయించారు. ప్రైవేటు స్కూల్స్ సహకారంతో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు, టేబుళ్లు వేయించారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు చదువులోనూ విద్యార్థులు ప్రతిభ చాటేలా కృషి చేశారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు 9.3 జీపీఏ సాధించడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో వంద శాతం, తెలుగు మీడియంలో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment