షాద్నగర్: షాద్నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్న భాగ్యమ్మ పేద విద్యార్థులకు ఆపద వచ్చిందంటే చాలు ఆదుకునేందుకు ముందు వరుసలో ఉంటారు. ఇటీవల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ప్రణీత్కుమార్ అనే విద్యార్థికి కడుపునొప్పి వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా అపెండిక్స్ ఉందని ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న భాగ్యమ్మ వెంటనే స్పందించి రూ.18,500 ఆర్థిక సాయం చేశారు. గత ఏడాది కొత్తూరులో హెచ్ఎంగా పని చేస్తున్న సమయంలో పాఠశాలలో విద్యార్థులకు భోజనం తయారు చేసే వంట ఏజెన్సీ కింద పని చేసే చంద్రమ్మ భర్త అకాల మరణం చెందారు. నిరుపేద అయిన చంద్రమ్మకు హెచ్ఎం ఆర్థిక సాయం చేశారు. కొత్తూరు పాఠశాలలో చదువుతున్న శిరీష తండ్రి మృతి చెందగా రూ.18వేలు ఆర్థిక సహాయం అందించారు.
పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర
ఫరూఖ్నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద హెచ్ఎంగా పని చేసిన భాగ్యమ్మ గ్రామశివారులో ఉన్న ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడి పాఠశాల నిర్మాణానికి కృషి చేశారు. కొత్తూరులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పని చేసిన సమయంలో శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మరమ్మతులు చేయాలని న్యాట్కో పరిశ్రమను కోరగా వారు రూ.3కోట్లతో తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించారు. దిశ ఉదంతం వెలుగులోకి వచ్చాక కొత్తూరు పాఠశాలలో స్టూడెంట్ పోలీస్ కాడెట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. యూత్ ఫర్ సేవా సంస్థ సహకారంతో పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ తరగతిని ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం షాద్నగర్లోని బాలుర ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇలా కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుడా పాఠశాలల అభివృద్ధిలో, విద్యార్థుల సంక్షేమంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తన బాటలోనే సహ ఉపాధ్యాయులను నడిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment