యాచారం: రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా ముదిరెడ్డి కోదండరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. తనకు కేటాయించిన ప్రభుత్వ భవనంలో మరమ్మతులు కొనసాగుతున్నందున దసరా పండుగ నేపథ్యంలో బుధవారం మంచిరోజు ఉండడంతో నగరంలోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రానికి చెందిన కోదండరెడ్డి గతంలో ముషీరాబాద్ నియోకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, హుడా చైర్మన్గా పనిచేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా, ప్రస్తుతం ఆయన ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు సంకల్పించగా.. దాన్ని రద్దు చేయించే విషయంలో కోదండరెడ్డి కీలకంగా వ్యవహరించాడు. రేవంత్రెడ్డి సర్కార్ అదే భూముల్లో ఫ్యూచర్సిటీని ఏర్పాటుకు సంకల్పించింది. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి, సీనియర్ నాయకుడు అంగోత్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మామూళ్లు అడిగిన
ఐదుగురిపై కేసు
శంకర్పల్లి: దసరా మామూళ్లు ఇవ్వాలంటూ ఓ ఆస్పత్రి యాజమాన్యంతో గొడవపడిన ఐదుగురు డిజిటల్ మీడియా రిపోర్టర్లపై కేసు నమోదైనట్లు సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దసరా మామూళ్ల కోసం మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఓ నర్సింగ్ హోమ్కు వెళ్లిన డిజిటల్ మీడియా రిపోర్టర్లు రూ.10 వేలు ఇవ్వాలని ఆస్పత్రి నిర్వాహకుడిని డిమాండ్ చేశారు. ఇందుకు ఆయన నిరాకరించడంతో యాజమాన్యం గుర్తింపు రద్దు చేయిస్తామని, అవకతవలు బయట పెడుతామని బెదిరించారు. దీంతో సదరు డాక్టర్ సీసీటీవీ పుటేజీలతో వెళ్లి శంకర్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
20న కేబీఆర్పార్కులో ‘ప్రజా సంబరాలు’
లక్డీకాపూల్: తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద తెలిసేలా ప్రజా సంబరాలు నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20న కేబీఆర్ పార్కులో ప్రజా సంబరాలు పేరిట సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన పోస్టర్ను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా మన సంస్కృతి, వారసత్వ సంపద తెలిసేలా ప్రజా సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారన్నారు. నగర సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, గ్రీనరీ వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. నగర సుందరీకరణలో భాగంగా పార్కుల అభివృద్ధి, సెంట్రల్ మీడియన్, గ్రీనరీ పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల 20న కేబీఆర్ పార్కులో పోటీలు ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కమిషనర్లు నళినీ పద్మావతి, పంకజ, వేణుగోపాల్ రెడ్డి, చీఫ్ ఆర్టికల్చర్ ఆఫీసర్ సునంద, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment