ఇబ్రహీంపట్నం రూరల్: ఈ–ఆఫీస్ విధానంలో వచ్చిన ఫైల్స్కు మాత్రమే స్పందిస్తామని కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. ఫైళ్ల విషయంలో చివరి నిమిషం వరకు ఆలస్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, సెక్షన్ అధికారులు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిపాలన విషయంలో వ్యవహరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ–ఫైల్ విధానంలో ట్రైనింగ్ తీసుకోకుండా.. టోకెన్లు అందుకోని అధికారులు త్వరితగతిన ఈ–ఆఫీస్ టోకెన్లు కొనుగోలు చేయాలన్నారు. ప్రతీ శాఖ మెయిలింగ్ నిర్వహణలోనూ అధికారిక ఇ–మెయిల్నే వాడాలని సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు, శాఖల సిబ్బందికి ఇప్పటికే ప్రాథమికంగా రెండు దఫాలుగా శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఎన్ఐసీ అధికారి స్వర్ణలత పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ పనుల వేగం పెంచండి
ప్రభుత్వం మంజూరు చేసిన మహేశ్వరం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి సమీపంలో ఉన్న భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న మహేశ్వరం మెడికల్ కాలేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో జరగాల్సిన పనులు, అందుబాటులోకి తీసుకురావాల్సిన పరికరాలు, కళాశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది నియామకం, ల్యాబ్స్, హాస్టల్ వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
కలెక్టర్ శశాంక
Comments
Please login to add a commentAdd a comment