
పారిస్ ఒలింపిక్స్లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది.
‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు.