● కాణిపాకంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ● నేడు పరిసమాప్తం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సాలను భక్తిశ్రద్ధలతో జరిపిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు పలు సేవల్లో భక్తులకు అభయమిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం పూలంగిసేవలో కనువిందు చేశారు. ఉదయం విఘ్నేశ్వరునికి అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలు, గరిక మాలలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం కనుల పండువగా పూలంగి సేవను నిర్వహించారు. కర్పూర హారతులు పట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం భక్తిప్రపత్తులతో ఊంజల్సేవను జరిపించారు. ప్రాకారోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు తెప్పోత్సవం
బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో గురుప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం అభిషేకం ఉంటుందన్నారు. రాత్రి తెప్పోత్సవం జరుగుతుందన్నారు. దీంతో బ్రహ్మోత్సవం ముగుస్తుందని భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు.
నృత్య సమ్మోహనం
ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో గురువారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను సమ్మోహితుల్ని చేశాయి. కూచిపూడి, భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే హరికథా కాలక్షేపం, భక్తి గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. కళాకారులను అధికారులు సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment