అధ్వానంగా దౌల్తాబాద్–బిచ్చాల రహదారి
● కొట్టుకుపోయిన కల్వర్టు, కోతకు గురైన దారి
● వాహనదారులకు తప్పని తిప్పలు
దౌల్తాబాద్: అడుగడుగునా ఏర్పడిన గుంతలతో దౌల్తాబాద్–బిచ్చాల రోడ్డు అధ్వానంగా మారింది. అందులో వర్షం నీరు నిలిచి మరింత దారుణంగా దాపురించింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మార్గంపై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దౌల్తాబాద్, గుముడాల, తిమ్మాయిపల్లి గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ద్విచక్రవాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాకపోకలు సాగిస్తున్న కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
మూడేళ్ల నుంచి వెతలు
పదేళ్ల క్రితం దౌల్తాబాద్ నుంచి బిచ్చాల వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించారు. మూడేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు గుముడాల–తిమ్మాయిపల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టులు కొట్టుకుపోయి రోడ్డు కోతకు గురైంది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సదరు మట్టి కొట్టుకుపోవడంతో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
నిలిచిన ఆర్టీసీ సేవలు
దౌల్తాబాద్ నుంచి బిచ్చాల వరకు ఆర్టీసీ బస్సు నడిచేది. అయితే వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడడం, కోతకు గురికావడంతో ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలన్నా ఇబ్బందులుపడుతున్నామని వాపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేక విద్యార్థులకు బడికి పంపలేకపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు తక్షణం స్పందించి రోడ్డు, కల్వర్టులకు మరమ్మతులు చేయించాలని స్థానికులు వేడుకుంటున్నారు.
పట్టించుకోవడం లేదు
మా పిల్లలు నిత్యం చదువుకోసం దౌల్తాబాద్ వెళ్తారు. అయితే నెల రోజులుగా బస్సు బంద్ అయింది. దీంతో ఆటోలు, బండ్లపై వెళ్తున్నారు. రోడ్డు పాడైతే ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా అత్యవసరమైతే చాలా ఇబ్బంది ఎదురవుతోంది.
– నర్సమ్మ, స్థానికురాలు
నిత్యం ప్రమాదాలు
గుముడాల, తిమ్మాయిపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు అధ్వానంగా తయారైంది. కల్వర్టు కొట్టుకుపోయి కోతకు గురైంది. దీన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రమాదవశాత్తు వాహనదారులు అదుపు తప్పి పడిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించాలి. – వీరారెడ్డి, స్థానికుడు
Comments
Please login to add a commentAdd a comment