ఎస్‌సీఎస్‌ఎల్‌ ఎండీ ఆర్యపై సెబీ చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌సీఎస్‌ఎల్‌ ఎండీ ఆర్యపై సెబీ చర్యలు

Published Fri, Oct 4 2024 1:20 AM | Last Updated on Fri, Oct 4 2024 1:20 AM

ఎస్‌సీఎస్‌ఎల్‌ ఎండీ ఆర్యపై సెబీ చర్యలు

ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెల్లడి

సీతమ్మధార: విశాఖకు చెందిన స్టీల్‌ సిటీ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌(ఎస్‌సీఎస్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ఆర్యను నెలరోజుల పాటు విధుల నుంచి సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) సస్పెండ్‌ చేసిందని ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. డైమండ్‌ పార్కులోని ఓ హోటల్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెబీకి ఆర్య సమర్పించిన విద్యార్హతల సర్టిఫికెట్లన్నీ నకిలీవని స్పష్టంగా తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినందుకుగానూ గతంలో ఎస్‌సీఎస్‌ఎల్‌, ఆర్యకి సెబీ రూ.5.25 లక్షల జరిమానా వడ్డించిందని గుర్తు చేశారు. తాజాగా కంపెనీ ఎండీ ఆర్యను నెల రోజుల పాటు విధుల నుంచి తొలగించిందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పొందిన సర్టిఫికెట్‌ నకిలీదని రిజిస్ట్రార్‌ ధ్రువీకరించి ఆర్యపై మూడో పట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. పాస్‌పోర్టు కోసం ఈ నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించారని ఆరోపించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో పాస్‌పోర్టు అధికారులు చేసిన దర్యాప్తులో కూడా ఆయన సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు. ఎస్‌సీఎస్‌ఎల్‌లో కొన్ని లక్షల మంది ప్రజలు రూ.కోట్లలో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టారని, ఈ వ్యవహారం కారణంగా పెట్టుబడిదారులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement