● సాగరగిరి కనక దుర్గమ్మను చూసొద్దామా.. ● నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
అల్లిపురం: యారాడ కొండ(డాల్ఫిన్ నోస్)పై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాగర గిరి కనక దుర్గమ్మ ఆలయంలో గురువారం ఉదయం 9 గంటలకు కలశ ప్రతిష్ట జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. 4న గాయత్రీ దేవిగా, 5న అన్నపూర్ణాదేవిగా, 6న భువనేశ్వరీ దేవిగా, 7న లలితాదేవిగా, 8న సరస్వతీ దేవిగా, 9న మహాకాళీదేవిగా, 10న శాకంబరీ దేవిగా, 11వ చండీదేవిగా, 12న సాగరగిరి కనక దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
భక్తుల దర్శనార్థం బోటు సౌకర్యం
సాగర గిరి కనకదుర్గ ఆలయానికి వెళ్లాలంటే సాగరాన్ని దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోర్టు అథారిటీ అనుమతితో బోటు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు బోటు యజమాని గుప్తా తెలిపారు. ప్రతి రోజూ పాతపోస్టాఫీసు దరి వెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద గల ఫెర్రీ నుంచి ఉదయం 7 గంటలకు బోటు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 టికెట్టుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫెర్రీ నుంచి ఆలయం వరకు, ఆలయం నుంచి ఉచిత ఆటో సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment