మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.
● బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు.
చతుర్ముఖ పోటీ..
మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఎస్పీలో చేరడం.. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనుండడంతో పరిణామాలు రసవత్తరంగా మారాయి. మందా జగన్నాథం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరగా.. తాజాగా హస్తం వదిలి బీఎస్పీలోకి చేరారు. దీంతో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దించగా.. చత్రుముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి ఎంపీ రాముడు కుమారుడు భరత్ప్రసాద్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, తాజాగా బీఎస్పీ నుంచి మందా జగన్నాథం పోటీ పడనున్నారు. నలుగురు అభ్యర్థుల్లో ఇద్దరు అలంపూర్ నియోజకవర్గానికి చెందినవారు కాగా మరో ఇద్దరు పార్లమెంట్ సెగ్మెంట్కు చెందినవారు కావడం విశేషం.