ఆ క్షేత్రం మాడవీధులన్నీ భక్తిభావంతో భజనలు చేస్తున్న భక్తులతో నిండిపోయాయి. ఒకవైపు మంగళ వాయిద్యాల హోరు...మరోవైపు కళాకారుల కోలాటాలు...ప్రతిధ్వనించిన గోవిందనామ స్మరణలు....దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల శోభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం స్వామి ముత్యపు పందిరివాహనంలో మాడవీధుల్లో విహరించారు. శ్వేతపందిరి నీడన రాజగోపాలుడిగా గంభీరంగా ఆశీనులైన స్వామి వారిని భక్తులు దర్శించుకుని పూజాద్రవ్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం తన దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులను కరుణించేందుకు ఘనశ్యాముడు విష్ణుమూర్తి గరుడునిపై కొలువుదీరాడు. సకల ఆయుధాలను ధరించి ఇలకు దిగి ముల్లోకాలను కటాక్షిస్తూ ఆ మాడవీధుల్లో సాగాడు. విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్న ఆ దివ్య తేజోరూపుడిని దర్శించుకున్న భక్తులు తన్మయులై అడుగడుగునా గోవిందనామ స్మరణలతో తరించారు.
నేడు కల్యాణోత్సవం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. –కడప కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment