-
నేడు కళ్యాణదుర్గానికి జననేత జగన్
సాక్షి, అనంతపురం: గత ఐదేళ్లూ సంక్షేమాభివృద్ధిని పరుగులు పెట్టించి, అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ పొందిన జననేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కళ్యాణదుర్గం రానున్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. సభాస్థలికి 1.30 గంటలకు చేరుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్యను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించనున్నారు. పోలింగ్కు నాలుగు రోజులు గడువు ఉండటం, కళ్యాణదుర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తలారి రంగయ్యను ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాభివృద్ధి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమాభివృద్ధి జరిగింది. కళ్యాణదుర్గంలో అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. మరోవైపు అభివృద్ధి పనులు అంతే స్థాయిలో జరిగాయి. రైతు భరోసా, అమ్మ ఒడి, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఆరోగ్య శ్రీ, రైతులకు సున్నావడ్డీ తదితర పథకాల ద్వారా ఐదేళ్లలో రూ. నాలుగు వేల కోట్లకు పైగా లబ్ధి చేకూర్చి ‘దుర్గం’ ప్రజల హృదయాల్లో సీఎం జగన్ చెరగని ముద్ర వేసుకున్నారు. తరలిరానున్న శ్రేణులు పథకాలతో తమను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ఇప్పటికే కళ్యాణదుర్గం ప్రజలు సిద్ధమైపోయారు. సీఎం ప్రసంగాన్ని వినేందుకు నియోజకవర్గంలోని కంబదూరు, బ్రహ్మసముద్రం,కుందుర్పి,కళ్యాణదుర్గం, శెట్టూరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలిరానున్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. తరలి రండి..సీఎం బహిరంగ సభ కోసం వైఎస్సార్ సీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, పార్టీ పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, పార్టీ నేతలు ఉమా మహేశ్వర నాయుడు, కలేకుర్తి జయరామిరెడ్డి, రామకృష్ణ బహిరంగ సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్ను పరిశీలించారు. అనంతరం తలారి రంగయ్య మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు, ప్రజలు తరలివచ్చి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
27 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: వరుణుడు కరుణించడంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 27 మండలాల పరిధిలో 14.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మండే ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న జిల్లా వాసులు వాన చినుకుల మధ్య సేద తీరారు. గుత్తి 47.2 మి.మీ, బ్రహ్మసముద్రం 42.2 మి.మీ, యాడికి 40 మి.మీ, ఆత్మకూరు 30 మి.మీ, శెట్టూరు 28.4 మి.మీ, వజ్రకరూరు 24.2 మి.మీ, పామిడి 22.2 మి.మీ మేర పదును వర్షం కురిసింది. రాప్తాడు 18.2 మి.మీ, కూడేరు 17.2 మి.మీ, అనంతపురం 16.8 మి.మీ, తాడిపత్రి 16.4 మి.మీ, శింగనమల 16.2 మి.మీ, నార్పల 14.2 మి.మీ, బుక్కరాయసముద్రం 14.2 మి.మీ, పెద్దపప్పూరు 13.8 మి.మీ, గుమ్మఘట్ట 12.4 మి.మీ, గార్లదిన్నె 11.2 మి.మీ మేర మోస్తరుగా వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. కణేకల్లు, బొమ్మనహాళ్, విడపనకల్లు, కుందుర్పి మండ లాల్లో వర్షపాతం నమోదు కాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో 29 మండలాల పరిధిలో 9.4 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమందేపల్లి 36 మి.మీ, లేపాక్షి 24.6 మి.మీ, పరిగి 24.2 మి.మీ, తనకల్లు 24 మి.మీ, అమరాపురం 19.4 మి.మీ, అమడ గూరు 18.4 మి.మీ, చిలమత్తూరు 15.8 మి.మీ, గుడిబండ 12.4 మి.మీ, రామగిరి 12.2 మి.మీ, బత్తలపల్లి 11.8 మి.మీ, పెనుకొండ 10.8 మి.మీ మేర వర్షం కురిసింది. మిగతా మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షపాతం నమోదైంది. తొలకరికి ముందే జల్లులు పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, వేసవితాపం నుంచి జనానికి కాస్తంత ఉపశమనం లభించింది. వ్యయ పర్యవేక్షణ పక్కాగా చేయాలి అనంతపురం అర్బన్: ‘ఎన్నికల వ్యయ పర్యవేక్షణ పక్కాగా చేపట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలి. సుహృద్భావ వాతావరణంలో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో సమాచారాన్ని ఆలస్యం చేయకుండా చేరవేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీకులు నీనా నిగమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్, ఎన్నికల వ్యయ పరిశీలకులతో కలిసి నోడల్ అధికారులు, ఎంసీఎంసీ నోడల్ అధికారులు తదితరులలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్టాటిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై నిఘా ఉంచాలన్నారు. రిజిస్టర్లలో ప్రతి ఖర్చు నమోదు చేయాలని చెప్పారు. మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగదు బదిలీపై దృష్టి పెట్టండి యూపీఐ ద్వారా చిన్నస్థాయిలో నగదు బదిలీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ మందికి నగదు బదిలీ జరుగుతునట్లు గుర్తిస్తే తక్షణం అప్రమత్తం కావాలన్నారు. ఆ ఖాతా ఎవరిది..? ఎక్కువ మందికి ఎందుకు నగదు బదిలీ చేస్తున్నారు..? తదితర అంశాలపై విచారణ చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రత్యేక వ్యయ పరిశీకులు తనిఖీ చేశారు. సమావేశంలో పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే, అమిత్ కుమార్, బి.వినాయక్, రిథమ్ బడ్జ, జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుందా బాబూ
అన్నదాత.. ఆత్మ ఘోష జగన్ రైతు పక్షపాతి పంటలు చేతికిరాక రూ.10 లక్షల దాకా అప్పులు మిగిలిపోయాయి. ఎలా తీర్చేది అంటూ మదనపడుతూ నా భార్య బి.ఉమాదేవి 2014 ఆగస్టు 13న తోటలోనే పురుగులు మందు తాగి చనిపోయింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులు వచ్చి అన్ని పరిశీలించుకుని పరిహారం వస్తుందని చెప్పి వెళ్లారు. సంవత్సరాలు గడిచినా పరిహారం గురించి అతీగతి లేదు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. ఇక పరిహారంపై ఆశలు పూర్తీగా వదిలేసుకున్నాం. కానీ... 2020లో నా బ్యాంకు ఖాతాలోకి రూ.5 లక్షల పరిహారం జమ అయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరించి న్యాయం చేశారు. – బి.వెంకటరాముడు, రైతు, మన్నీల, అనంతపురం రూరల్ మండలం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అన్యాయం ● కేవలం 105 కుటుంబాలకు రూ.5.25 కోట్లు ఇచ్చి నిలుపుదల ● అర్హత కలిగిన 110 కుటుంబాలకు పైసా ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు ● బాధితులు ఐదేళ్లూ తిరిగినా పట్టించుకోని వైనం ● పరిహారం కోసమే ఆత్మహత్య చేసుకుంటారని వ్యాఖ్యలు ● 2019లో వైఎస్ జగన్ సీఎం కాగానే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పంపిణీ అనంతపురం అగ్రికల్చర్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏ మాత్రమూ మానవత్వం లేదని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 2014–2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు హయాంలో వర్షాలు లేక, పంటలు పండక కరువు విలయతాండవం చేసింది. అప్పులు పెరగడం, పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ పోషణ భారమై వందలాది మంది రైతులు పురుగు మందు తాగి, తోటల్లో చెట్లకు ఉరితాడు బిగించుకుని బలవన్మ రణం పొందిన విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన చంద్రబాబునాయుడు రైతులను చాలా చిన్నచూపు చూశారు. పరిహారం కోసమైనా ఆత్మహత్యలు చేసుకుంటారని మానవత్వం మరచి రైతులను హేళన చేసి మాట్లాడారు. వ్యవసాయం దండగ అంటూ సంక్షోభంలోకి నెట్టారు. ఏదో కంటి తుడుపు చర్యగా....గోరంత పరిహారం ఇచ్చి కొండంత ప్రచారం చేసుకున్నారు. 382 మంది రైతులు ఆత్మహత్య ఐదేళ్ల చంద్రబాబు హయాంలో 382 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏటా అంటే 2014లో 39 మంది, 2015లో 130 మంది, 2016లో 64 మంది, 2017లో 47 మంది, 2018లో 80 మంది, 2019లో 22 మంది...ఇలా అప్పుల బాధతో రైతులు పిట్లల్లా రాలిపోయారు. పరిహారం ఇవ్వడానికి ఇష్టం లేని అప్పటి చంద్రబాబు సర్కారు సవాలక్ష నిబంధనలు పెట్టి 167 మందిని జాబితా నుంచి తొలగించింది. అర్హత జాబితాలో చేర్చిన 215 మందిలో కూడా ఐదేళ్లలో విడతల వారీగా 105 మంది బాధితులకు రూ.5 లక్షలు చొప్పున కేవలం రూ.5.25 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో అర్హత కలిగిన 110 మంది రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టి దగా చేయడంతో వారు ఆశలు వదిలేసుకున్నారు. రైతు ఇంట పెద్ద కొడుకులా వైఎస్ జగన్: ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలను చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తానని ప్రకటించినట్లుగానే 2019 మేలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నట్లుగానే అపన్నహస్తం అందించారు. చంద్రబాబు హయాంలో పరిహారానికి నోచుకోని 110 మంది రైతు ఆత్మహత్య బాధితులకు మొదటి ప్రాధాన్యతగా పరిహారం అందించి శభాష్ అనిపించుకున్నారు. జాబితాలు ఆధారంగా క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి 110 మంది బాధితుల ఖాతాల్లోకి రూ.5 లక్షలు చొప్పున రూ.5.50 కోట్లు నేరుగా జమ చేశారు. ఇందులో ఎక్కడా ప్రచార ఆర్భాటానికి వెళ్లలేదు. సత్వరమే పరిహారం అందేలా గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు వేసి గ్రీన్ఛానల్, కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేసి సకాలంలో బాధిత రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. అలాగే, 2019 తర్వాత జరిగిన రైతు ఆత్మహత్యలకు రూ.7 లక్షలకు పరిహారం పెంచి ఈ ఐదేళ్లలో ఉమ్మడి జిల్లా పరిధిలో 170 మంది బాధిత కుటుంబాలకు రూ.11.90 కోట్లు జమ చేశారు. మొత్తమ్మీద అటు చంద్రబాబు 110 మంది బాధితులతో పాటు ఈ ప్రభుత్వంలో జరిగిన 170 మందికి రూ.17.40 కోట్లు ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో వారి కుటుంబాలు కష్టాల నుంచి గట్టెక్కాయి. -
పేదలందరికీ ఇళ్లు
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద మొత్తం 70,860 ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు గాను ఏకంగా రూ.650 కోట్లు ఖర్చు చేశారు. అనంతపురం నగరంలో ఉన్న పేదలకు ప్రత్యేకంగా లేఔట్లు వేసి ప్లాట్లు కేటాయించారు. ఒక్కొక్కరికి కనీసం రూ.5 లక్షలు విలువ చేసే ప్లాట్లు ఇచ్చారు. ఇంటి నిర్మాణాల్లో తాత్కాలిక నీటి వసతికి రూ.18.82 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు ప్రాధాన్యత క్రమంలో శాశ్వత తాగునీటి వసతికి రూ.110.94 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.13.23 కోట్ల అంచనాతో 441 పనులకు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లో మంజూరయ్యాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కింద రూ.13.23 కోట్లతో 594 పనులు, తాగునీటి అవసరాలు, సీసీ డ్రైనేజీ పనులకు మంజూరయ్యాయి. -
వైఎస్సార్సీపీ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం
బ్రహ్మసముద్రం : పరిమితికి మించి నగదు తీసుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. ఈ నగదు వైఎస్సార్సీపీ అభ్యర్థికి చెందినదంటూ ఎల్లోమీడియా, దాని అనుబంధ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విమర్శలకు తావిచ్చింది. బుధవారం ఉదయం పోలేపల్లి సమీపంలోని చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.19,72,500 నగదు లభించడంతో బ్రహ్మసముద్రం పోలీసులు, సెబ్ పోలీసులు, చెక్పోస్టు సిబ్బంది పట్టుకున్నారు. ఆ నగదు ఎవరిదో పూర్తిగా తెలుసుకోకుండానే కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్యకు చెందినదంటూ ఎల్లో మీడియా – సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ నగదు అనంతపురంలోని ఓ కంపెనీకి చెందిన నగదుగా పోలీసులు ధ్రువీకరించారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
అనంతపురం: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని శ్రీశ్రీనగర్లో నివాసం ఉంటున్న ఎస్.వై.లక్ష్మిదేవి, నాగసాయి దంపతుల కుమారుడు శ్రీవైష్ణవ దేవానంద (23). ఇతడు చిన్మయనగర్లోని అవ్వాతాతల వద్ద ఉండి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాడు. అక్క చదువుకునే సమయంలో ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు 4 నెలల కిందట అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి అమ్మాయి గురించి తలచుకుని బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. త్రీటౌన్ సీఐ ధరణీకిషోర్ కేసు నమోదు చేశారు. -
ఇరువురిపై కేసు నమోదు
గుంతకల్లు: పోస్టల్ బ్యాలెట్ ఓటును బహిర్గతం చేసిన ఇద్దరు ఉద్యోగులపై కసాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్ఓ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలో పోలీసు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఉద్యోగి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ను (పింక్ పేపర్) తమ సెల్ఫోన్లో ఫొటో తీశాడు. తాము ఓటు హక్కు వినియోగించుకున్నామని, మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ స్నేహితులకు షేర్ చేశాడు. దీనిని మరో ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి తీవ్రంగా పరిగణిస్తూ సమగ్ర విచారణకు ఆర్ఓను ఆదేశించారు. విచారణ అనంతరం ఇద్దరు ఉద్యోగులపై పోలీసులకు ఆర్ఓ శ్రీనివాసులురెడ్డి ఫిర్యాదు చేశారు. నలుగురి సస్పెన్షన్ అనంతపురం అర్బన్: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి వినోద్కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామ వలంటీరు వసుంధర, మండల కేంద్రం ఆత్మకూరు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్.వెంకటరామిరెడ్డితో పాటు అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు బి.లక్ష్మీదేవి, బి.విజయలక్ష్మి ఉన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీకి చంద్రబాబు అడ్డంకి
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) కింద బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన రూ.356 కోట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్నికల వేళ ఇన్పుట్ సబ్సిడీ అందితే తమకు ఓట్లు అనుకూలంగా పడవేమోనన్న భయంతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి, అలాగే పచ్చమీడియా కుయుక్తలు పన్నింది. ఈ నేపథ్యంలోనే ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు ఎన్నికల కమిషన్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అనంతపురం జిల్లాలో 28, శ్రీసత్యసాయి జిల్లాలో 19 మండలాలను కరువు జాబితాలో ప్రకటించారు. ప్రకృతి విపత్తుల విభాగం నిబంధనల మేరకు మొత్తం 49 మండలాల్లో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. ఆ మేరకు అనంతపురం జిల్లాలో 1,69,970 మంది రైతులకు రూ.251.20 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలోని 1,17,005 మంది రైతులకు రూ.105.03 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతో రైతులకు ఇబ్బంది కలగకుండా కోడ్ వెలువడక మునుపే ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కే కార్యక్రమాన్ని లాంఛనంగా పూర్తి చేశారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టి ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము రైతుల ఖాతాల్లోకి పడకుండా అడ్డుకుంటోంది. ఎన్నికల కమిషన్ కూడా అనుమతి ఇవ్వకపోవడంతో అన్నదాతకు అన్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. దీంతో ఇన్పుట్సబ్సిడీ ఎన్నికల తర్వాతనే రైతులకు అందే పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా రూ.13,500 ప్రకారం ఐదేళ్లలో ప్రతి రైతుకూ రూ.67,500 ఇచ్చారు. అలాగే ఇన్పుట్ సబిడ్సీ, ఉచిత పంటల బీమా పరిహారం, పంట రుణాల సున్నావడ్డీ తదితర పథకాల కింద నేరుగా రైతుల ఖాతాల్లోకి పరిహారం విజయవంతంగా జమ చేశారు. కేవలం 2023– ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు మాత్రమే సమస్య ఎదురవుతుండటం రైతులకు ఇబ్బందిగా మారింది. సాఫీగా సాగిపోయే ఇఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.356 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాకుండా కుట్రలు ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత కుయుక్తులపై అన్నదాతల ఆగ్రహం -
అనంత జల సిరి
గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసింది. రిజర్వాయర్ కింద నిర్వాసితులకు రూ.240.53 కోట్ల పరిహారం అందజేశారు. తుంగభద్ర ఎడుమ కాలువ పనులకు రూ.458.42 కోట్లు, యాడికి కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కాలువ, మిడ్ పెన్నార్ దక్షిణ కాలువ, ధర్మవరం బ్రాంచ్ కాలువ తదితర పనులకు రూ.1.357 కోట్లు ఖర్చు పెట్టారు. జపాన్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు నిధులు రూ.23.75 కోట్లు వెచ్చించి చిన్న నీటి చెరువుల అభివృద్ధి చేపట్టారు. ● 2024 నాటికి గ్రామీణ ప్రాంత కుటుంబాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన, నిర్దేశిత పరిమాణంతో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతి మనిషికీ రోజుకు 5.5 లీటర్ల చొప్పున గ్రామీణ కుటుంబాలకు సరఫరా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది. అందుకు 1,633 పనులకు గాను రూ.508.82 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో మొత్తం కుటుంబాల సంఖ్య 4,26,438. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల కింద జిల్లాకు తొలిసారి రూ.60 కోట్లు, రెండో విడత రూ.32 కోట్లు మంజూరయ్యాయి. జాతీయ గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టుల్లో భాగంగా రూ.224.57 కోట్లు ఖర్చు చేశారు. తాడిపత్రికి రూ.184.57 కోట్లు, శింగనమలకు రూ.40 కోట్లు కేటాయించారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో బహుళార్ధక రక్షిత తాగునీటి పథకాల కింద జిల్లాకు రూ.115 కోట్లు ఖర్చు పెట్టారు. -
అభివృద్ధి అనంతం .. సంక్షేమం సుస్థిరం
అనంతపురం / అనంతపురం సిటీ : సంక్షేమానికి అభివృద్ధి సమ్మిళితం చేసి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది. ఐదేళ్లలోనే మాట తప్పని.. మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. ప్రజలు ఐదేళ్లకు కదా ఓటు వేసింది. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళికను అమలు చేయడం ఎందుకునే గత పాలకుల ఆలోచన విధానం తప్పంటూ అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే హామీల అమలు దిశగా వేసిన అడుగులు ప్రతి ఇంటికీ పెద్ద కొడుకును చేసింది. ముంగిటకే ప్రభుత్వ సేవలు గ్రామస్వరాజ్యం సాధన దిశగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి 35 ప్రభుత్వ శాఖలకు చెందిన నాణ్యమైన సేవలు ప్రజలకు చేరువ చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది. వలంటీర్లే నేరుగా ఇంటింటికీ తిరిగి అర్హులను గుర్తించి సంక్షేమ ఫలాలను వారి గడప వద్దకే అందజేస్తున్నారు. జిల్లాలోని 483 గ్రామ, 180 వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు 11,673 మంది, ఉద్యోగులు 5,582 పనిచేస్తున్నారు. కోవిడ్ నియంత్రణలోనూ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది విశేషమైన సేవలు అందించారు. పండుగలా వ్యవసాయం 2019 నుంచి 2024 మధ్య వ్యవసాయం పండుగలా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 75,188 క్వింటాళ్ల విత్తన వేరుశనగకు గాను రూ.27.91 కోట్ల సబ్సిడీ, ప్రత్యామ్నాయ విత్తనాలు 2,143 క్వింటాళ్లకు రూ.1.95 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఆత్మహత్య చేసుకున్న 23 మంది రైతు కుటుంబాలకు రూ.1.61 కోట్ల ఎగ్స్గ్రేషియా అందించింది. పీఎం కిసాన్ – రైతు భరోసా కింద 2,89,116 కుటుంబాలకు రూ.216.8 కోట్ల లబ్ధి చేకూర్చింది. 451 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.98.31 కోట్లు ఖర్చు చేసింది. ఆర్బీకేల ద్వారా 45 వేల మెట్రిక్ టన్నులను సబ్సిడీ కింద రూ.18.98 కోట్లు ఎరువులు అందించింది. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 1,40,267 మంది రైతులకు రూ.211.80 కోట్ల పరిహారం పంపిణీ చేసింది. 6433 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.7.61 కోట్లు మంజూరు చేసింది. సున్నా వడ్డీ పంట రుణాల కింద 62,393 మంది రైతులకు రూ.13.14 కోట్లు అందించింది. వైఎస్సార్ పశునష్ట పరిహారం కింద 6326 మంది పశు పోషకులకు రూ.16.02 కోట్లు అందించింది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద 1,532 మంది లబ్ధిదారులకు రూ.96.40 కోట్లతో పండ్ల తోటల విస్తరణ, ఫారంపాండ్స్ ఏర్పాటు, ప్యాక్ హౌస్ల నిర్మాణం చేపట్టింది. ఏపీఎంఐపీ సూక్ష్మసాగునీటి పథకం కింద 11,079 మంది రైతులకు గాను 11 వేల హెక్టార్లలో రూ.67.68 కోట్ల విలువ చేసే సూక్ష్మ సేద్య పరికరాలు అందించింది. మాతా శిశు సంరక్షణకు పెద్దపీట జిల్లాలో మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 7 నెలల నుంచి మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు 83,123 మంది, 3–6 ఏళ్లలోపు చిన్నారులు 49,129 మంది ఉన్నారు. గర్భిణులు 18,670 మంది, బాలింతలు 16,545 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరందరూ లబ్ధి పొందుతున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 13228 లబ్ధిదారులకు రూ.2.56 కోట్లతో బాలామృతం అందించారు. ● వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 2019 నుంచి ఇప్పటి వరకు అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు, చేనేతకార్మికులు, కళాకారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు రూ.3652.58 కోట్లు అందించారు. ● జాబ్కార్డు కలిగిన 2,58,681 మంది కూలీలకు ఉపాధి హామీ పథకం కింద 75,02,471 పని దినాలు కల్పించారు. ● వైఎస్సార్ జలకళ కింద 30,638 మంది రైతుల పొలాల్లో రూ.15.97 కోట్లతో బోర్లు వేశారు. ● మైక్రో వాటర్షెడ్ల కింద రూ.16.11 కోట్లతో 23,303 హెక్టార్లలో మైక్రో వాటర్షెడ్లు నిర్మించారు. పరిశ్రమల ప్రగతి జిల్లాలో రూ.32.26 కోట్ల పెట్టుబడితో 4,225 చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి 13,206 మందికి ఉపాధి కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, పవర్ వినియోగం రాయితీ, అమ్మకపు పన్ను రాయితీ వంటివి ఇచ్చి 676 చిన్న పరిశ్రమలకు గాను రూ.62.19 కోట్లు ఖర్చు చేశారు. ఇండస్ట్రియల్ పాలసీ కింద 1,520, వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ఇప్పటి వరకు 49 చిన్న పరిశ్రమలకు రూ.6.44 కోట్లు మంజూరు చేశారు. ● జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. 2020–21లో 11,414 మందికి రూ.11.41 కోట్లు, 2021–22లో 10,050 మందికి రూ.10.05 కోట్లు, 2022–23లో 23,097 మందికి రూ.23.10 కోట్లు, 2023–24లో 15,555 మంది వ్యాపారులకు రూ.16.75 కోట్ల చొప్పున వడ్డీలేని రుణం పంపిణీ చేసింది. ●వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.515.03 కోట్ల అందించారు. డ్వాక్రా సభ్యులు తీసుకున్న అప్పు మీద సున్నా వడ్డీ కింద మొత్తం రూ.202.99 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. జీవనోపాధుల కింద డ్వాక్రా సభ్యులకు రూ.3,758.71 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. ● వైఎస్సార్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.18,750 చొప్పున రూ.75 వేలు అందజేశారు. ● కుటుంబ పెద్ద దిక్కు ప్రమాదవశాత్తు కోల్పోతే వైఎస్సార్ బీమా కింద 5,346 కుటుంబాలకు రూ.87.91 కోట్ల పరిహారం అందించారు. హామీలు మేఘాలై వర్షిస్తుంటే ప్రజల మది పులకించిపోయింది. సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం అంటూ అన్నదాతలు హర్షిస్తున్నారు. అజ్ఞాన చీకట్లను చీల్చేందుకు ఎక్కుపెట్టిన విద్య అనే ఆయుధం లక్ష్యం దిశగా పయనించింది. మహిళాభ్యుదయానికి అగ్రతాంబూలం వేశారు. పండుటాకుల బోసినవ్వులలో చెప్పలేనంత ఆనందం కనిపిస్తోంది. పల్లె సీమలు రూపురేఖలు మారిపోయి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి మించిన ప్రగతి సాక్షాత్కరించింది. సంచలనాత్మక నిర్ణయాలు, చట్టాలతో వైఎస్సార్సీపీ పాలన కొత్త పుంతలు తొక్కింది. ఐదేళ్లలో సాగిన అభివృద్ధి.. సంక్షేమం భావి తరాలకు భరోసానిచ్చింది. యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ బాటలో అడుగులు వేస్తున్నాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పాలన మాట తప్పలే.. మడమ తిప్పలే అర్హులందరికీ సంక్షేమ ఫలాలు పారదర్శకతకు పెద్దపీట సచివాలయాలతో ముంగిటకే సేవలు ఐదేళ్లలో ఇంటింటా చిరునవ్వులే నేతన్నలకు అండగా.. సొంత మగ్గం కలిగి ఉండి, చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కుటుంబాలకు చేనేత పరికరాల ఆధునికీకరణకు, మరమగ్గాల ద్వారా ఉత్పత్తి అయిన వస్త్రాల పోటీని ఎదుర్కోవడానికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా అర్హులైన చేనేత కుటుంబానికి ప్రతి ఏడాది రూ.24 వేల ఆర్థిక సాయం వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో 2019–20లో 10,525 మంది చేనేత కార్మికులకు రూ.25.26 కోట్లు అందించారు. 2020–21లో 8,821 మందికి రూ.21.17 కోట్ల లబ్ధి చేకూరింది. 2021–22లో 7,360 మందికి రూ.17.66 కోట్లు, 2022–23లో 8,286 మందికి రూ.19.88 కోట్ల సాయమందించారు. ముద్ర పథకం కింద చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1,903 మందికి రూ.18.93 కోట్ల చేనేత ముద్ర రుణాలు అందాయి. -
రహదారుల అభివృద్ధి
ఏపీఆర్ఆర్డబ్ల్యూ కింద 138 పనులకు రూ.268 కోట్లు కేటాయించారు. పీఎంజీఎస్వై–3 కింద 14 పనులకు గాను రూ.64.83 కోట్లు కేటాయించారు. పీఎంజీఎస్వై ఇన్సెంటివ్ రహదారుల కింద 8 పనులకు రూ.5.78 కోట్లు మంజూరు చేశారు. నాబార్డు కింద 33 అంగన్వాడీ భవనాలకు రూ.3.94 కోట్లు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.36.11 కోట్లు, 432 గ్రామ సచివాలయాలకు రూ.187.52 కోట్లు, 361 రైతు భరోసా కేంద్రాలకు రూ.85.50 కోట్లు వెచ్చించారు. 270 వైఎస్సార్ హెల్త్క్లినిక్ భవనాలకు రూ.56.57 కోట్లు, 125 బల్క్మిల్క్ కలెక్షన్ యూనిట్లకు రూ.16.07 కోట్లు, 186 డిజిటల్ లైబ్రరీలకు రూ.29.76 కోట్లు, 57 బీటీ రహదారులకు రూ.54.77 కోట్లు, 1827 సిమెంట్ రోడ్లు రూ.99.61 కోట్లు, 100 అంగన్వాడీ కేంద్రాలకు రూ.7.04 కోట్లు కేటాయించారు. -
ఓటరు వయసుపై సందేహం వస్తే..
అనంతపురం అర్బన్: ఎన్నికల్లో ఓటమి భయంతో ఉన్న అభ్యర్థులు తాము ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాలను అనుసరిస్తారు. అలాంటి వారు దొంగ ఓట్లు చేర్పించి ఉంటారు. ముఖ్యంగా చిన్నవయస్సున వారిని అంటే 18 ఏళ్లు నిండకపోయినా ఓటరుగా చేరుస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యక్తి 18 ఏళ్లు నిండినట్లు కనిపించకపోతే అతని నుంచి ప్రిసైడింగ్ అధికారి ‘డిక్లరేషన్ ఆఫ్ ఎలక్టోర్ అబౌట్ హిజ్ ఏజ్’ తీసుకుంటారు. వయస్సు గురించి డిక్లరేషన్.. ● ఓటు వేయడానికి ఓటరు వచ్చినప్పుడు... ఆ వ్యక్తి రూపం చూస్తే 18 ఏళ్లు నిండినట్లు కనిపించదు. ● అలాంటి సందర్భంలో అలా వచ్చిన ఓటరును ఓటు వేసేందుకు అనుమతించాలి. అయితే... అతని వద్ద అనెక్జర్–7లో చూపిన విధంగా డిక్లరేషన్ తీసుకుంటారు. ప్రధాన జాబితా అయితే 2024, జనవరి 1వ తేదీ నాటికి, అనుబంధ జాబితాలో ఓటరుగా ఉంటే 2024, ఏప్రిల్ 14వ తేదీ నాటికి తనకు 18 ఏళ్లు నిండినదని డిక్లరేషన్ తీసుకోవాలి. అతను ఇచ్చిన డిక్లరేషన్ తప్పు అని తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తారు. ● ఓటు వేసిన వివరాలను ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్బుక్లో కనబరిచి అనెక్జర్–9లో పొందపరుస్తారు. ఓటేయాలని బలవంతం చేయరాదు.. ● ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఫారం–17ఏలో సంతకం చేసిన తరువాత, తాను ఓటు వేయనని నిరాకరిస్తే... ఓటు వేయాలని బలవంతం చేయకూడదు. ● 17ఏలోని రిమార్క్ కాలమ్లో ఓటరు ఓటు వేయడానికి నిరాకరించాడని రాయాలి. ఓటరుతోనూ సంతకం చేయించాలి. ఓటరు చేసినా చేయకపోయినా ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి. ● అప్పటికే కంట్రోల్ యూనిట్లో ఓటు రిలీజ్ అయి ఉంటే తరువాత ఓటరుకు ఆ ఓటు వేసుకునేందుకు అనుమతిస్తారు. -
పార్థ.. అవినీతి మేత
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం..అంతా అక్రమాల కలబోతే.అవినీతి మేతే. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. రూ.కోట్లు మేసేశారు. ‘కియా’ ఏర్పాటు సమయంలో రైతులను నిండా ముంచేశారు. మైనింగ్, ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరి పోయారు. ఎమ్మెల్యేగా వెలగబెట్టినప్పుడే జనాన్ని నిండాముంచిన ఆ టీడీపీ నేత ఇప్పుడు ఏకంగా పార్లమెంట్కే పోటీ చేస్తున్నారు.సాక్షి, పుట్టపర్తి: బీకే పార్థసారథి.. టీడీపీలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. అవినీతి, అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. రౌడీలు, మద్యం అక్రమ రవాణా దారులు, మైనింగ్ మాఫియా వ్యక్తులను అనుచరులుగా చేర్చుకుని అడ్డదిడ్డంగా సంపాదించాడు. ‘కియా’ కార్ల పరిశ్రమ రాకతో ఎంతోమంది రైతులను మోసం చేశాడు. తక్కువ ధరలకే భూములు కాజేశాడు. కొందరికి పరిహారం ఇవ్వకుండా బెదిరించి లాక్కున్నాడు. గత టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ దోపిడీ చేశాడు. అల్లుడిని రంగంలోకి దింపి రూ.కోట్లు వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో పెనుకొండ ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.కమీషన్ల కక్కుర్తి..‘కియా కార్ల పరిశ్రమ కోసం భూ సేకరణ, చదును పనుల్లో పార్థసారథి బాగా నొక్కేశాడు. ఎకరా భూమికి రైతుకు రూ.10.5 లక్షలు ఇస్తే.. భూమిని చదును చేయడానికి ఎకరాకు రూ.25 లక్షలు ఖర్చు ెచూపి.. కమీషన్లు తీసుకుని చంద్రబాబు.. లోకేశ్కు వాటా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇక సోమందేపల్లి సమీపంలోని పెద్దకొండ చాలా మహిమాన్వితమైందని స్థానికులు భావిస్తారు. అందుకే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరు. కానీ ఆ కొండకు అవతలి వైపు ఉన్న క్వారీలకు వెళ్లేందుకు బీకే పార్థసారథి పెద్దకొండపైనే రోడ్డు వేయించాడు. ఇందుకు గానూ క్వారీ నిర్వాహకులతో.. రూ.కోట్లు దండుకున్నాడనే ఆరోపణలున్నాయి.రైతుల పాలిట యముడిలా..‘కియా’ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇప్పించకుండా.. బీకే సైంధవుడిలా అడ్డుపడ్డారు. గుట్టూరుకు చెందిన రైతు వడ్డే సుబ్బరాయుడు మరణానికి కారణమయ్యాడు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ‘కియా’ సమీపంలో రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా కొనుగోలు చేశారని, ఎందరో రైతులను మోసం చేశాడని వెంకటగిరిపాళ్యంకు చెందిన రైతులు పార్థసారథిపై పలుమార్లు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.తప్పులెన్ని చేసినా..సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద పార్థసారథి అల్లుడు శశిభూషణ్.. తన క్వారీలో ఓ కూలీపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అయితే టీడీపీ పెద్దల సహకారంలో కేసు లేకుండా తప్పించుకున్నాడనే ఆరోపణలున్నాయి. బీకే పార్థసారథి అనుచరుడిగా ఎదిగిన సిద్ధయ్య చీప్ లిక్కర్ వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా నిత్యం సిద్ధయ్యను వెంట పెట్టుకుని పార్థసారథి పర్యటిస్తుంటారు. అలాగే బీకే వెంట నడిచే మరో మహిళ నేత కూడా నాటుసారా వ్యాపారం చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.ఎస్సీల భూముల్లో క్వారీటీడీపీ హయాంలో రొద్దం మండలం కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల శివార్లలో బీకే క్వారీ నడిపేవాడు. ఇందుకు కొండ సమీపంలోని 16 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన 40 ఎకరాల భూములను కాజేశాడు. ఏడాదికి ఎకరాకు రూ.4 వేలు ఇస్తానని నమ్మబలికాడు. లీజుకు ఇవ్వకుంటే లాగేసుకుంటామని బెదిరించాడు. చివరకు ఆ రైతుల భూములు సొంతం చేసుకున్నాడు.అల్లుడికి ఆరు శాతం కమీషన్లు..బీకే చేసే అక్రమార్జనలో ఆరు శాతం తన అల్లుడు శశిభూషణ్కు ఇస్తారు. గత టీడీపీ హయాంలో నుంచి ఈ దందా కొనసాగుతోంది. అందుకే అప్పట్లో నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా ముందు కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ దందా తట్టుకోలేక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. దీంతో పెనుకొండ అభివృద్ధి కుంటుపడింది.ప్రజాధనం లూఠీ..టీడీపీ హయాంలో ‘స్వచ్ఛభారత్’ పథకం కింద పెనుకొండకు భారీగా మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే మరుగుదొడ్లు నిర్మించకుండానే బీకే పార్థసారథి బిల్లులు స్వాహా చేశాడు. అర్హులకు పథకం అందకుండా.. స్వచ్ఛభారత్ పథకానికి అప్పట్లోనే స్వస్తి పలికాడు. ‘నీరు–చెట్టు’ పథకంలో రూ.కోట్లు కొల్లగొట్టాడు. దీంతో ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు బీకేను ఘోరంగా ఓడించారు.రూ.వందల కోట్ల ఇసుక మేత..టీడీపీ హయాంలో పెనుకొండ పరిధిలోని పెన్నా, జయమంగళి, చిత్రావతి నది పరీవాహక ప్రాంతాలను బీకే పార్థసారథి చెర బట్టారు. రోజూ వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తోడేశాడు. ఐదేళ్లలో ఇసుక అక్రమ రవాణా ద్వారానే రూ.500 కోట్లపైనే సంపాదించాడని టీడీపీ నేతలే చెబుతున్నారు. -
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల మే 9 వ తేదీ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం విడుదల చేశారు.సీఎం జగన్.. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వై ఎస్సార్ సర్కిల్లోని ఎస్వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. -
బాగా పనిచేస్తున్నారు.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి
అనంతపురం అర్బన్: కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్కుమార్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని,ఇదే స్ఫూర్తిని పోలింగ్ ముగిసే వరకూ కొనసాగించాలని ప్రత్యేక సాధారణ పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఎన్నికల సంసిద్ధతపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, పరిశీలకులతో కలిసి నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయడం ఒక ప్రత్యేక అవకాశంగా భావించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పకడ్బందీ చర్యలు: కలెక్టర్ వినోద్కుమార్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని ప్రత్యేక పరిశీలకునికి కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,236 పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామన్నారు. దివ్యాంగుల కోసం ర్యాంప్ లు నిర్మించామని, 576 వీల్ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఓటరు స్లిప్ల పంపిణీ త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు. 544 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను కచ్చితత్వంతో నిర్వహిస్తున్నామని వివరించారు. పటిష్ట పోలీసు బందోబస్తు: ఎస్పీ అమిత్ బర్దర్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రత్యేక పరిశీకులకునికి ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పారు. జిల్లాకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర, సమీకృత చెక్పోస్టులు ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. పోలింగ్, కౌంటింగ్ కోసం భద్రత, బందోబస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో పరిశీలకులు మనీష్ సింగ్, అజయ్నాథ్ ఝ, రవికుమార్, విలాస్ వి. షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే, జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి,ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, పార్లమెంట్ ఏఆర్ఓ రమేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులకు ప్రత్యేక సాధారణ పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా సూచన -
పలకరించిన వరుణుడు
చీనీ టన్ను రూ.32 వేలు అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.32 వేలు పలికాయి. అనంతపురం అగ్రికల్చర్: వరుణదేవుడు పలకరించాడు. భానుడి దెబ్బకు అల్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించాడు.మంగళవారం సాయంత్రం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. శెట్టూరు, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, డీ హీరేహాళ్, కళ్యాణదుర్గం, అనంతపురం, కూడేరు, రాయదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, పామిడి, బీకేఎస్, పెనుకొండ, హిందూపురం, మడకశిర, పరిగి, గుడిబండ, బత్తలపల్లి, అమరాపురం, సోమందేపల్లి, నల్లచెరువు, రొద్దం తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని మీ కేశవ్ మెచ్చుకోలేదా బాబూ?
ఉరవకొండ: ప్రజలను ఏమార్చి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు... గతంలో ఆయన పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ శాసనసభ వేదికగా ఆ చట్టాన్ని మెచ్చుకున్న విషయాన్ని మరిచిపోయారా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. చట్టం ఎంతో బాగుందని, భూములపై రైతులకు సర్వ హక్కులూ లభిస్తాయని గతంలో కేశవ్ మాట్లాడిన మాటలను మరిచి పోయారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నేడు ఎల్లో మీడియాతో కలిసి అబద్దాలు వల్లెవేస్తుండడం దుర్మార్గమన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. కేశవ్ను సాగనంపడానికి ప్రజలు సిద్ధం... ఉరవకొండ నియోజకవర్గ పార్ట్టైం ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన కేశవ్కు ఈ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్వ తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రజలకు కన్పించకుండా పోయిన ఆయన... ఎన్నికల సందర్భంగా నేడు ప్రజల వద్దకు వచ్చి ప్రలోభాలకు గురిచేయడం, మాట వినని వారిపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉరవకొండ నియోజకవర్గంలో సంక్షేమాభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2,500 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. దీనికితోడు రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు ఎన్నికల కమిషన్ సహకరించాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. ఈ విషయంలో తెలంగాణలో ఈసీ అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
‘బాబు కుయుక్తుల్లో చిక్కుకున్న ఎన్నికల కమిషన్’
తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబు పన్నుతున్న కుయుక్తుల్లో ఎన్నికల కమిషన్ చిక్కుకున్నట్లుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. మంగళవారం తాడిపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు కమిషన్లా మారిపోయిందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు ఆడుతూ, గంగిరెద్దులా తల ఊపుతోందన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి నిరాటంకంగా అమలవుతున్న సంక్షేమ పథకాలకు.. టీడీపీ నేతల ఫిర్యాదుతో బ్రేక్ వేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తూ వస్తోందని, అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్ను సాకుగా చూపి 6,95,857 మంది రైతులకు రూ. 847 కోట్లు అందకుండా చేయడం దారుణమన్నారు. అలాగే, విద్యార్థుల విద్యాదీవెన నిధులు రూ. 611 కోట్ల విడుదలను కూడా అడ్డుకోవడంతో పాటు ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పథకాల అమలును నిలిపివేయడం దుర్మార్గమన్నారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల జీవితాలతో కూడా టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఈసీ తీరు బాధ కలిగిస్తోందన్నారు. ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీని అడ్డుకుని ఇప్పటికే లక్షలాది మంది వృద్ధులకు అవస్థలు కలిగించారన్నారు. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మాత్రం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు అనుమతిచ్చిన ఎన్నికల కమిషన్.. మన రాష్ట్రంలో మాత్రం పథకాలు పాతవే, లబ్ధిదారులు కూడా పాతవారే అయినపుడు ఎవరికి మేలు చేసేందుకు అడ్డుకుందో ఇట్టే అర్థమైపోతోందన్నారు. కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ చర్యలు తీసుకుంటుండడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని, ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తన నిర్ణయాలపై ఈసీ పునఃసమీక్షించుకుని, ప్రజలకు మేలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, రైతులు, మహిళలు అధైర్యపడరాదని, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, రెండో సారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. -
ఉన్న పెన్షన్లు తీసేస్తారు
చంద్రబాబు ఏవి చెప్పినా నమ్మడం సాధ్యం కాదు. అధికారంలోకి వస్తే సామాజిక పింఛన్ రూ.4 వేలు అంటున్నాడు. దాని అమలు కోసం అనేక నిబంధనలు పెట్టి ఉన్న పెన్షన్లు ఎన్ని ఊడిస్తాడో తెలియదు. సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నా క్రమం తప్పకుండా ఠంచనుగా ఒకటో తేదీనే వలంటీర్ గడప తట్టి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరో రూ.500 పెంచుతానని చెప్పాడు. జగన్ చెప్పాడంటే.. చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. – మాలన్బీ, రాయదుర్గం పట్టణం ఆ పాలన వద్దే వద్దు టీడీపీకి పొరపాటున ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు కొని తెచ్చుకున్నట్టే. అప్పట్లో ఏ పథకం కావాలన్నా ఆ కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ సమయాన వారు ప్రవర్తించిన తీరు తలిస్తేనే భయమేస్తోంది. చంద్రబాబు మానస పుత్రికగా ఏర్పాటైన ఈ కమిటీలు పేదల రక్తాన్ని పీల్చాయి. ఆ పాలన కావాలని మళ్లీ కోరుకోవడం లేదు. – నాగరాజు యాదవ్, తాళ్లకెర, గుమ్మఘట్ట మండలం బాబుకు బుద్ధి చెప్పాలి నాకు ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి రూ.3 వేలు పింఛను ఇచ్చేవాళ్లు. బాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడంట. దీంతో రెండు నెలలుగా నాకు పింఛను సరిగా అందలేదు. పేదలను ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఆయన మాటలను నమ్మితే ప్రజలు మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. – దురగమ్మ, పింఛనుదారు, కంబదూరు -
మళ్లీ మోసపోమప్పో..!
👉కొత్త సంక్షేమ పథకాలుఅటుంచితే బాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలు ఎక్కడ నిలిపివేస్తారోఅన్న భయం పట్టుకుంది. ప్రజలను నమ్మించి దగా చేయడం బాబుకు అలవాటేగా!– గార్లదిన్నె మండలకేంద్రానికి చెందిన ఓ మహిళ నిట్టూర్పు👉2014 ఎన్నికల్లో 600 పైగా హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను వంచించారు. అలాంటి వ్యక్తి నేడు మళ్లీ సిగ్గులేకుండా హామీలిస్తున్నారు.బాబును నమ్మలేం.– కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆగ్రహం👉పేదల బాగు కోసం సీఎం జగన్ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక కాబోతోందని విమర్శించిన వ్యక్తి.. అధికారంలోకి వస్తే అవే పథకాలు కొనసాగిస్తూ మరింత ఎక్కువ చేస్తామనడాన్ని ఎలా చూడాలి?– రాయదుర్గం పట్టణానికి చెందిన ఓ అధ్యాపకుడి విశ్లేషణసాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇష్టారాజ్యంగా హామీలిచ్చేసి, గద్దెనెక్కిన తర్వాత నమ్మి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను నిలువునా ముంచేయడం ఎలా అనే విషయం ఆయన గత చరిత్ర చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. పొరపాటున అధికారంలోకి వస్తే, ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచేసి, అన్నీ అమలు చేశానని బుకాయించడం చంద్రబాబుకు తప్ప మరెవరికీ తెలియదేమో! అందుకే బాబు నోటి నుంచి ఏది వస్తుందో అది చేయరు అన్న విషయం ప్రజల్లో నాటుకుపోయింది.నమ్మం బాబూ..!ఇప్పటికే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్, సతీమణి భువనేశ్వరి కూడా ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల సభలు నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలు అంటూ ప్రకటించారు. అయితే, వారి మాటలు ఎవరూ నమ్మడం లేదనేది అక్షర సత్యం. ప్రస్తుతం పెన్షన్ రూ.3 వేలు ఇస్తున్నారు. తాను నాలుగు వేలు ఇస్తానన్నా కనీసం దానిపై చర్చ జరగడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలతో టీడీపీ అభ్యర్థులు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇల్లిల్లూ తిరుగుతున్నా, ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలింగ్కు మరో ఐదు రోజులే గడువుండటం, బాబు హామీలను కనీసం ప్రజలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఓటమి భయం ఎక్కువైనట్లు తెలిసింది.గుణపాఠం చెప్పినా మారని తీరు..2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి తదితర హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వాటిల్లో ఒక్క దాన్ని కూడా సరిగ్గా నెరవేర్చిన పాపాన లేదు. దీంతోనే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టి ‘నిన్ను నమ్మం బాబు’ అని స్పష్టం చేశారు. అయినా, గతం మరిచి నేడు మళ్లీ కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూసి జనం నవ్వుకుంటున్న పరిస్థితి.బాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు!2014–19 మధ్య కాలంలో జన్మభూమి కమిటీలను తెచ్చి పల్లెల్లో నిప్పులు పోశారని, ఏ ఒక్కరికీ లబ్ధి కలగకుండా చేశారని గ్రామీణులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాబు వచ్చి జన్మభూమి కమిటీలు ప్రవేశపెడితే తమ బతుకులు ఎంత దుర్భరంగా మారతాయోనని పేద ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేకుండా నేరుగా వలంటీర్లే ఇంటికొచ్చి పథకాల గురించి చెప్పి, అర్హులైన వారికి లబ్ధి చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉన్న ఊరిలోకే పాలన వచ్చింది. కానీ, బాబు వస్తే ఇవన్నీ అమలు చేయరేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఉన్నవే రాకుండా చేశారు.. కొత్తగా ఏమిస్తారు?ఉమ్మడి అనంతపురం జిల్లాలో రమారమి 5 లక్షల మంది వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటి వద్దకే వెళ్లి వలంటీర్లు డబ్బు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు, ఆయన అనుంగు శిష్యులు ఎన్నికల కమిషన్ మాటున పెన్షన్లు ఇంటికి రానివ్వకుండా చేశారు. ఈ విషయంపై ఇప్పటికే వృద్ధులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. పెన్షనర్లకు ఎంతో సాంత్వన చేకూరుస్తున్న వ్యవస్థనే ఆపేయించిన బాబు.. కొత్తగా రూ.4 వేలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ పెంచుతానన్న హామీతో కరపత్రాలు ఇస్తుంటే వాటిని వెంటనే చెత్తబుట్టలో వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో బాబుపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలను భయాందోళనకు గురి చేసైనా ఎన్నికల్లో గట్టెక్కాలనే దురుద్దేశంతో, బాబు ఇచ్చిన ఆదేశాలతో పచ్చ మూకలు దాడులకు దిగుతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే, టీడీపీ కుయుక్తులను గమనిస్తున్న ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లోనూ దిమ్మతిరిగే సమాధానం చెబుతారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. -
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స శిబిరాలు
అనంతపురం మెడికల్: ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 13న ప్రథమ చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రథమ చికిత్స శిబిరాల వద్ద ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. అవసరమైన వారికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందించడంతో పాటు కోవిడ్ సంబంధిత జాగ్రత్తలు తెలియ జేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ యుగంధర్, డాక్టర్ అనుపమజేమ్స్, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ రవిశంకర్, ఓబులు, ఎస్ఓ మహమ్మద్ రఫి, ఫార్మసిస్టు రమాశంకర్, తదితరులు పాల్గొన్నారు. ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తులు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్కు అర్హత కల్గిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏ ఐటీఐలో చేరాలకున్నారో ఆన్లైన్లోనే ఎంచుకోవచ్చని వెల్లడించారు. జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఈ కింది ట్రేడ్లలో అడ్మిషన్లు చేపడతారు. కోపా (ఏడాది కోర్సు), డి/మాన్ సివిల్ (రెండేళ్లు), ఎలక్ట్రీషియన్ (రెండేళ్లు), ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (రెండేళ్లు), ఫిట్టర్ (రెండేళ్లు), మెషినిస్ట్ గ్రైండర్ (రెండేళ్లు), మెకానిక్ మోటార్ వెహికల్ (రెండేళ్లు), మెకానిక్ డీజిల్ (ఏడాది), టర్నర్ (రెండేళ్లు), వైర్మెన్ (రెండేళ్లు), వెల్డర్ (ఏడాది), రిప్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ టెక్నీషియన్ (రెండేళ్లు), డ్రెస్ మేకింగ్ (ఏడాది),ఫ్లంబర్ (ఏడాది), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (రెండేళ్లు), ఐసీటీఎస్ఎం (రెండేళ్లు), మెషినిస్ట్ (రెండేళ్లు). జిల్లాకు ప్రత్యేక వ్యయ పరిశీలకుల రాక అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ ఐఏఎస్ (రిటైర్డ్) మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. నగరంలో ఓ హోటల్కు చేరుకున్న ఆమెకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, తదితరులు పాల్గొన్నారు. -
జేసీకి భంగపాటు తప్పదు
● యాడికి బహిరంగసభలో ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి: ఈ ఎన్నికల్లో జేసీ ప్రభాకరెడ్డికి భంగపాటు తప్పదని, ఆయన తనయుడు అస్మిత్రెడ్డి ఓటమి ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎం.శంకరనారాయణ, కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం యాడికిలో భారీ రోడ్డు షో నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వారు ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి ఓడిపోతే తాను ఊరు విడిచి వెళ్లిపోతానంటూ అనుచరులతో ప్రభాకరరెడ్డి చెప్పుకున్నారని, కనీసం ఈ ఒక్క మాటపైనన్న నిలబడి ఎన్నికల ఫలితాలు వెలువడగానే మూటముల్లె సర్దుకుని ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 35 ఏళ్లుగా తాడిపత్రి నియోజకవర్గంలో నియంతలా రాజకీయం చేసిన జేసీ సోదరులు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. జేసీ సోదరుల హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా రక్తపుటేరులు పారించారన్నారు. హత్యా రాజకీయాలు, వర్గ కక్షలు ప్రేరేపించారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. పార్టీలకతీతంగా ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్దన్నారు. సంక్షేమ సారథి వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే యాడికి మండలంలోని పిన్నేపల్లె చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. మండలంలో చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే అనుమతులు వచ్చాయని మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, జెడ్పీ మాజీ సభ్యుడు వెంకటరామిరెడ్డి, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, సీనియర్ నాయకులు బాలా రమేష్బాబు, భోగతి బ్రహ్మానందరెడ్డి, సీజేఎస్ ఇన్చార్జ్ శివప్రసాద్ పాల్గొన్నారు. -
No Headline
ఫ్యాన్ గుర్తు మరవొద్దు ఎన్నికల పోలింగ్ దగ్గర పడడంతో ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు చుట్టి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు ఎండలు మండుతున్నా... అదే స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించారు. అవ్వా మన గుర్తు ఫ్యాన్... తాతా మన గుర్తు ఫ్యాన్. అక్కా ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి. అన్నా ఫ్యాన్ గుర్తు మరవొద్దు అంటూ ఓటు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. – సాక్షి బృందం: -
నయ వంచకుడు చంద్రబాబు
రాయదుర్గం: పేదలను అణచివేయడమే టీడీపీ అధినేత చంద్రబాబు ధ్యేయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, పార్టీ పరిశీలకుడు ఎంఆర్సీ రెడ్డి మండిపడ్డారు. స్థానిక మెట్టు నివాసంలో మంగళవారం వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రారెడ్డితో కలసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలను ఆపేలా ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నాడన్నారు. 58 నెలలుగా అమలులో ఉన్న వివిధ పథకాలను కేవలం ఎన్నికల దృష్ట్యా ఆపితే పేదలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఈసీ ఆంక్షలు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లో రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ అయి ఉండేదన్నారు. తొలకరి వర్షాలు కురిసే సమయాన రాయితీ విత్తనాన్ని సైతం అడ్డుకునే దుర్మార్గమైన ఆలోచన ఎంత నీచమైందో ఇప్పటికై నా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చెందిన విద్యాదీవెన నిధులు రూ.610.79 కోట్లు జమ కాకుండా అడ్డుకున్న నారాసూరుడికి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వైఖరి కారణంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులయ్యే పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ ఫిర్యాదులపై ఈసీ పునరాలోలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడే చంద్రబాబు తీరు ఇలా ఉంటే రేపొద్దున అధికారంలోకి వస్తే ఈ పథకాలను శాశ్వతంగా రద్దు చేయడని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉంటూ ఐదేళ్లూ రాయదుర్గం అభివృద్ధిని పట్టించుకోని కాలవ శ్రీనివాసులు ఓటమి ఖాయమైందన్నారు. ఈ నెల 9న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్యాణదుర్గం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ఆపేయాలని ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గం ఇన్పుట్ సబ్సిడీ, రాయితీ విత్తనాన్ని అడ్డుకున్న ద్రోహి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు -
గుత్తి కోటను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు
గుత్తి: గుత్తి కోట చాలా అద్భుతంగా ఉందని అనంతపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు విలాస్ షిండే అన్నారు. కళ్యాణదుర్గం డివిజన్ అధికారి శంకర్, గుత్తి తహసీల్దార్ భారతి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్తో కలసి మంగళవారం ఆయన గుత్తి కోటను సందర్శించారు. గుర్రపు శాలలు, ఏనుగు శాలలు, చీకటి గది, రంగ మంటపం, బావులు, ముఖ ద్వారాలు, దేవాలయాలు వీక్షించారు. కోట చరిత్రను, కోటను పాలించిన రాజుల చరిత్రను గైడ్ రమేష్ వివరించారు. నిందితుడికి రిమాండ్ గార్లదిన్నె: మండల కేంద్రం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన యువకుడు అనిల్ని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. మంగళవారం ఉదయం కల్లూరు – తరిమెల క్రాస్లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు. బైకుల చోరీ – ఐదుగురికి జైలు అనంతపురం: ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఐదుగురు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ అనంతపురం ఏజేఎఫ్సీ న్యాయమూర్తి ప్రతిభ తీర్పు వెలువరించారు. అనంతపురం రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు అపహరించిన కేసులో జి.అశోక్ (అనంతపురం), ఎస్.అస్లాంబాషా (నారాయణపురం పంచాయతీ), జయరాములు , తలారి బాబు (కళ్యాణదుర్గం), కె.సురేష్ (గరుడాపురం) నిందితులు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ సుచరిత వాదనలు వినిపించారు. 26న బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అనంతపురం ఎడ్యుకేషన్: గత విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 550కు పైగా మార్కులు సాధించిన ఉమ్మడి జిల్లాలోని బలిజ విద్యార్థులకు ఈ నెల 26న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు టి.శంకరయ్య, కార్యవర్గ సభ్యులు మంగళవారం వెల్లడించారు. పూర్తి వివరాలకు 98664 19693, 92477 92567, 94901 80177లో సంప్రదించవచ్చు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement