-
కౌంటింగ్ను ప్రశాంతంగా ముగిద్దాం
అనంతపురం అర్బన్:‘ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ క్రమంలో అందరరూ సహకరిస్తారని ఆశిస్తున్నా’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ సందేశాత్మక ప్రకటనను గురువారం విడుదల చేశారు. ‘ఎన్నికల ప్రక్రియను నమ్ముదాం, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నిర్ణయాన్ని గౌరవిద్దాం. జిల్లాకు చెందిన వివిధ రంగాల మేధావులు, వృత్తి నిపుణులు, వృద్ధులు, మహిళలు, యువతీయువకులు, ఉద్యోగులు, సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇప్పటి వరకు మనమందరం కలిసి పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం. తదుపరి జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సహకరిస్తారని ఆశిస్తున్నా’ అంటూ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి -
అప్రమత్తంగా ఉండండి
తాడిపత్రి అర్బన్: కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వర్తించాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. గురువారం తాడిపత్రి పోలీసు స్టేషన్ను ఆమె తనిఖీ చేశారు. బందోబస్తు వివరాలను డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను, పికెటింగ్లను తనిఖీ చేశారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలీస్ టెంట్ హౌస్ వద్ద ఏఆర్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు బలగాలకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ సందర్భంగా సిబ్బంది అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి సంఘటనలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అల్లర్లను ముందే పసిగట్టి నియంత్రించాలన్నారు. అల్లర్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించరాదన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టణంలో డీఎస్పీలు శ్రీనివాసులు, శివభాస్కర్రెడ్డి, శ్రీహరిరాజు, శివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కవాతును నిర్వహించారు. -
డ్రై ఫ్రూట్స్ అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు: హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి డ్రై ఫ్రూట్స్ అలంకరణలో దర్శనమిచ్చాడు. వేకువ జామునే సుప్రభాత సేవలో భాగంగా మూలవిరాట్కు అభిషేకం గావించారు. అనంతరం వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ (గోడంబి, ఎండు ద్రాక్ష, బాదామి, డ్రై అంజూరు)తో అలంకరించారు. మధ్యాహ్నం మహా మంగళ హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వేదపండితులు, అర్చకుల నేతృత్వంతో లక్ష సింధూర అర్చన చేశారు. వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భద్రాది, ఏఈఓ మల్లికార్జున, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కే.సుగణమ్మ, ఆలయ ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు తదితరులు పాల్గొన్నారు. నాలుగైదు రోజుల్లో నైరుతి! అనంతపురం అగ్రికల్చర్: రైతన్నలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. గురువారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం వాతావరణ బులెటిన్ విడుదల చేశారు. మరోవైపు రాగల రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు. అయితే అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. జిల్లాకు 734 మెట్రిక్ టన్నుల ఎరువులు అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ కోటాలో భాగంగా గురువారం జిల్లాకు 734 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయినట్లు ఏడీఏ ఎం.రవి తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే రేక్ పాయింట్లో వ్యాగన్ల ద్వారా జిల్లాకు చేరిన ఎరువులను ఆయన పరిశీలించారు. పారాదీప్ పాస్ఫేట్స్ లిమిటెడ్ (పీపీఎల్) కంపెనీకి చెందిన 220 మెట్రిక్ టన్నులు యూరియా, 245 మెట్రిక్ టన్నుల 19–19–19 రకం, 269 మెట్రిక్ టన్నుల 14–35–14 రకం కాంప్లెక్స్ ఎరువులు వచ్చాయన్నారు. ఇండెంట్ మేరకు ఆర్బీకేలు, సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేసి మిగతావి కంపెనీ, మార్క్ఫెడ్ గోదాముల్లో నిల్వ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తాడిపత్రి ఆర్ఓగా శిరీష అనంతపురం అర్బన్: తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ)గా డిప్యూటీ కలెక్టర్ శిరీషను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఆర్ఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్రెడ్డి ఆరోగ్యసమస్యల కారణంగా ఎన్నికల విధులు నిర్వర్తించలేనని చేసుకున్న అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదిస్తూ రెవెన్యూశాఖ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించింది. ఆ స్థానంలో ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గ ఏఆర్ఓగా ఉన్న శిరీషను నియమించారు. శిరీష కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, రాంభూపాల్రెడ్డి పీఏబీఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. ఈ క్రమంలో శిరీషను పీఏబీఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేస్తూ తాడిపత్రి ఆర్ఓగా నియమించారు. -
‘ఆముదం’... లాభదాయకం
బుక్కరాయసముద్రం: ఆముదం పంట సాగు లాభదాయకంగా ఉంటుందని రైతులకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి సూచించారు. బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం, అఖిల భారత నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ సంయుక్తంగా గురువారం ఆముదం మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆముదం పంట సాగుపై రైతులకు శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో ఆముదం పంట సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. ఆముదం పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఐసీహెచ్–5 ఐసీహెచ్–66 ఆముద విత్తనాలను రేకులకుంట పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంచామన్నారు. రెండు కిలోల విత్తనం రూ.850 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆముదం పంట సాగులో తెగుళ్లు, యాజమాన్య పద్దతులను వివరించారు. కార్యక్రమంలో భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ లావణ్య, డాక్టర్ సురేష్, డాక్టర్ సతీష్కుమార్, డాక్టర్ మంజునాథ్, డాక్టర్ జవహర్లాల్, రేకులకుంట శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి -
No Headline
ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం, ధ్వజ అవరోహణ కార్యక్రమాలను గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామికి సుప్రభాతం, మహాభిషేకం, అర్చన, ఉత్సవ నిత్యహోమం, బలిహరణ, మంగళ హారతి తదితర పూజలు చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలకు వసంతోత్సవం కార్యక్రమాన్ని ఆలయ ఈఓ విజయ్కుమార్, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ధ్వజ అవరోహణం గావించి శ్రీవారి ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు. -
పామిడి సీహెచ్సీలో అరుదైన ఆపరేషన్
పామిడి: అరుదైన ఓంఫాలిటిస్ అనే జబ్బుతో బాధపడుతున్న ఓ రోగికి పామిడి సీహెచ్సీ వైద్యాధికారులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. పామిడి కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ శివకార్తీక్రెడ్డి తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం ఎన్ఎన్పీ తండాకు చెందిన గోవిందనాయక్ కొంతకాలంగా ఇన్ఫెక్టెడ్ పేటెంట్ యురాకస్ ఓంపాలిటిస్ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ క్రమంలో జబ్బు మరింత ముదిరింది. సాధారణంగా ఓంఫాలిటిస్ అనేది నాభి, లేదా నాభి చుట్టుపక్కల ఉన్న కణజాలానికి సోకే ఇన్ఫెక్షన్ అని, దైహిక సంక్రమణమైన ఈ వ్యాధికి వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే శరవేగంగా విస్తరించి మరణానికి దారి తీస్తుందని డాక్టర్ శివకార్తీక్రెడ్డి వివరించారు. ఈ క్రమంలో చికిత్స కోసం సీహెచ్సీకి వచ్చిన గోవిందనాయక్ పరిస్థితిని గమనించి వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేశామన్నారు. అనస్తియా వైద్యుడు రాఘవేంద్రరెడ్డి పర్యవేక్షణలో జనరల్ సర్జన్ డాక్టర్ కమలాకర్ సహకారంతో బుధవారం రాత్రి 11.30 గంటలకు పామిడి సీహెచ్సీలోనే ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గురువారం ఉదయం రోగి పరిస్థితి కుదటపడి క్రమంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్సలో హెడ్ నర్సు శివకుమారి, నర్సు కవిత పాల్గొన్నారన్నారు. -
సమాజాన్ని ప్రభావితం చేయడం కొందరికే సాధ్యం
● సుందరరాజు జయంతి సభలో ఆచార్య బాలసుబ్రహ్మణ్యం అనంతపురం / కల్చరల్: సాహిత్యాన్ని, సమాజాన్ని తనదైన విలక్షణ వ్యక్తిత్వంతో ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి నాగప్పగారి సుందరరాజు అని ఆచార్య బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎస్కే యూనివర్సిటీలో సుందరరాజు 56వ జయంతిని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సమావేశానికి ఆచార్య బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ పతికి రమేష్ నారాయణ, డాక్టర్ జెన్నే ఆనంద్ తదితరులు ఆత్మీయ అతిథులుగా హాజరై, మాట్లాడారు. సుందర రాజు తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని కవిగా, కథకుడిగా, పరిశోధకుడిగా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విలక్షణ పాత్ర పోషించారని గుర్తు చేశారు. జీవించిన తక్కువ కాలంలోనే సమాజంలోని అనేక రుగ్మతలను, అణచివేత ధోరణులను తానెంచుకున్న సాహిత్యం ద్వారా నిరసిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసి యువకవిగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన, ఎస్సీఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్, రచయిత్రి అరుణ, రేపల్లె రాముడు, నాగేంద్ర, ఆనంద్, జిల్లా నాయకులు బాలకృష్ణ, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. గాలి వేగం పెరిగింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గంటకు 8 నుంచి 12 కి.మీ. వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
ఏపీ ఐసెట్లో సత్తా ● కడపన గణేష్ కుమార్ రెడ్డికి రాష్ట్ర స్థాయి నాలుగో ర్యాంకు ● దవనబోయన వెంకటేశ్కు 9వ ర్యాంకు అనంతపురం: ఏపీ ఐసెట్లో జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 2,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,224 మంది పరీక్షకు హాజరయ్యారు. 2,114 (95.05 శాతం) మంది ఉత్తీర్ణత మార్కులు సాధించారు. ● తాడిపత్రి మండలం కోనగుంట పల్లికి చెందిన కడపన గణేష్ కుమార్ రెడ్డి 165 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. జిల్లా స్థాయిలో గణేష్ కుమార్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచాడు. ● అనంతపురం నగరానికి చెందిన దవనబోయన వెంకటేశ్ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. వెంకటేశ్ 161 మార్కులతో ప్రతిభ చాటాడు. ● శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం 204 మంది దరఖాస్తు చేసుకోగా, 188 మంది పరీక్షకు హాజరయ్యారు. 179 (95.21 శాతం) మంది అర్హత సాధించారు. ఈసెట్లో 89 శాతం ఉత్తీర్ణత ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2024లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. 89 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 2,157 మంది దరఖాస్తు చేసుకోగా, 2,073 మంది పరీక్షకు హాజరయ్యారు. ●ఈఈఈ విభాగంలో శింగనమల మండలం కల్లుమడికి చెందిన కొత్తచెరువు వేణుగోపాల్ రెడ్డి 143 మార్కులతో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి శెభాష్ అనిపించాడు. -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు జరిగాయి. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్ విద్యార్థులు 7,150 మందికి గాను 6,743 మంది హాజరయ్యారు. 407 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 457 మందికి గాను 337 మంది హాజరయ్యారు. 120 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విద్యార్థులు 1,361 మందికి గాను 1,274 మంది హాజరయ్యారు. 87 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 124 మందికి గాను 102 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ జిల్లా కన్వీనర్, ఆర్ఐఓ ఎం.వెంకటరమణనాయక్ 5 కేంద్రాలు, డీఈసీ సభ్యులు 5 కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ 5 కేంద్రాలు, సిట్టింగ్ స్క్వాడ్ 4 కేంద్రాలను తనిఖీలు చేశారు. అదనపు ఏఆర్ఓలకు శిక్షణ ఇప్పించండి అనంతపురం అర్బన్: కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా అదనపు ఏఆర్ఓలను నియమించిందని, వారికి కౌంటింగ్ విధి విధానాలపై శిక్షణ అందించాలని జెడ్పీ సీఈఓ నిదియాదేవిని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
అనంతపురం అర్బన్: కౌంటింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ నడుస్తోంది. ఏ గ్రామంలో చూసినా ఎన్నికల ఫలితాలే చర్చనీ యాంశంగా మారాయి. ఏ ఇంట్లో చూసినా పలానా పార్టీ గెలుస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు. ఏర్పాట్లలో అధికారుల బిజీ.. మరోవైపు జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రక్రియ జరగనున్న జేఎన్టీయూలో ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. కౌంటింగ్ నిర్వహణకు 954 మంది సిబ్బందిని, ఇతర విధులకు 400 మందిని నియమించనున్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 112 టేబుళ్లు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉరవకొండ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 18 టేబుళ్లను, మిగిలిన ఏడు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున మొత్తం 116 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకుడు చొప్పున 228 టేబుళ్లకు 684 మందిని నియమించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం.. 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ (ఈటీపీబీ) ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఆ తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు లెక్కిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్లను లెక్కించి తుది ఫలితాలు వెల్లడిస్తారు. రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్ల వివరాలను సువిధ పోర్టల్లో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సాగనుందిలా.. ఈవీఎం కంట్రోల్ యూనిట్ను స్ట్రాంగ్ రూమ్ నుంచి టేబుల్ వద్దకు తీసుకొస్తారు. సీళ్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది కౌంటింగ్ సూపర్వైజర్ చెక్ చేసుకుంటారు. సక్రమంగా ఉంటే కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో రిజల్ట్ బటన్ నొక్కుతారు. ఆ వెంటనే డి స్ప్లే సెక్షన్లో వివరాలు కనిపిస్తాయి. అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతారు. డిస్ప్లే సెక్షన్లోని క్రమ సంఖ్య వారీగా ఓట్ల వివరాలను 17 సీ పార్ట్–2లో నమోదు చేస్తారు. రిజల్ట్ సెక్షన్ తెరవాల్సి వస్తే, దానిని తెరిచి లోపల స్పెషల్ అడ్రస్ ట్యాగ్ ఇన్టాక్ట్గా ఉందా లేదా చూస్తారు. రిజల్ట్ బటన్ నొక్కడానికి లేదా రిజల్ట్ సెక్షన్పై ఉన్న డోర్ తెరవడానికి ముందే సీళ్ల క్రమ సంఖ్య నంబర్లను 17సీ పార్ట్–1లోని 9వ భాగంలో చూపిన విధంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ యూనిట్ను కౌంటింగ్ ఏజెంట్ల చేతికి ఇవ్వరు. చేతిలో ఎత్తిపట్టుకుని చూపిస్తారు. తరువాత కంట్రోల్ యూనిట్లోని పవర్ బటన్ స్విచ్ ఆన్ చేస్తారు. ఆ తరువాత టోటల్ బటన్ నొక్కుతారు. డిస్ప్లే సెక్షన్లో చూపిన పోలైన మొత్తం ఓట్లతో 17సీ పార్ట్–1లో చూపిన మొత్తం ఓట్లను సరిచూసుకుంటారు. అంతా సవ్యంగా ఉందని నిర్ధారణ చేసుకున్న తరువాత రిజల్ట్ సెక్షన్లోకి వెళ్లి రిజల్ట్–1 బటన్ నొక్కుతారు. ఆ పోలింగ్ కేంద్రంలో పోలైన మొత్తం ఓట్ల సంఖ్య, ఆ తరువాత ఒక్కొక్క అభ్యర్థికి పోలైన ఓట్ల సమాచారం కనిపిస్తుంది. ఇదంతా కౌంటింగ్ ఏజెంట్లకు కనపడేలా చేస్తారు.17సీలోని పార్ట్–2లో అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల వివరాలను నమోదు చేస్తారు. 17సీ పార్ట్–2ను కార్బన్ పేపర్ ఉంచి రెండు డూప్లికేట్ రాస్తారు. అసలైన్ 17సీ పార్ట్–2ను ఆర్ఓకు పంపుతారు. కార్బన్ కాపీని సూపర్వైజర్ ఉంచుకుంటాడు. 17సీ పార్ట్–2లో వివరాల నమోదు అనంతరం కౌంటింగ్ ఏజెంట్లతో సంతకం చేయిస్తారు. అటు తరువాత రిజల్ట్ సెక్షన్లోని ఇన్నర్, ఔటర్ డోర్లను మూసేసి పవర్ బటన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. కంట్రోల్ యూనిట్లలో ఓట్ల లెక్కింపు పూర్తవగానే, క్వారింగ్ బాక్స్లో ఉంచి స్ట్రాంగ్ రూమ్కు పంపిస్తారు. జూన్ 4పై అందరి కళ్లు గడువు సమీపిస్తున్న కొద్దీ టెన్షన్ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం -
ఎవరి లెక్కలు వారివే!
● ఆత్మవిశ్వాసంతో అధికార పార్టీ ● కాకిలెక్కల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక ఎన్నికల గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు బాటలు వేశాయని అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ధీమాతో ఉండగా, మరోవైపు కాకిలెక్కలు వేసుకుంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు కాలక్షేపం చేస్తున్నారు. పందెంరాయుళ్ల జోరు.. గెలుపోటములపై తీవ్ర ఆసక్తి పెరగడంతో పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున పందేలు వేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే కోట్లాది రూపాయల బెట్టింగ్లు జరిగినట్లు తెలిసింది! పందెం డీల్ కుదుర్చుకున్న కొందరు దస్తావేజులు రాసుకోగా, మరికొందరు మధ్యవర్తుల వద్ద డబ్బులు కలిపినట్లు సమాచారం. ఇందుకోసం కొందరు దళారీ అవతారం ఎత్తి, మధ్యవర్తిత్వం చేసిన దానికి 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. కొత్త రకాల పందేలు.. ఈసారి కొత్తకొత్త కోణాల్లో పందేలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా ఫలానా అభ్యర్థి గెలుస్తాడు, మెజార్టీ, ఫలానా గ్రామంలోని బూత్లో మెజార్టీ తమకే వస్తుంది అంటూ రకరకాలుగా పందేలు కాశారు. జిల్లాలో అనంతపురం పార్లమెంట్తో పాటు రాప్తాడు, తాడిపత్రి, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాలపై ఎక్కువగా బెట్టింగ్లు జరిగినట్లు తెలిసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారిన హిందూపురం, కుప్పం, పిఠాపురం, మంగళగిరి స్థానాల గెలుపు, మెజార్టీపై కూడా జిల్లాలో పందేలు కాయడం విశేషం. ఆత్మవిశ్వాసంతో అధికార పార్టీ.. గెలుపుపై అధికార పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన సంక్షేమ విప్లవంతో ప్రతి నిరుపేద ఇంటికీ ఫలాలు అందాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారు. చాలామంది టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలకూ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండికూడా చేయలేని సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్ పాలనలో జరిగింది. అందుకే వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 160 సీట్లకు పైగా గెలుస్తామని, ఆ పార్టీ నాయకులు దీమాగా చెబుతున్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ నాయకులు కాకిలెక్కలు వేసుకుంటున్నారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ చంద్రబాబు అమలు చేయలేదు. పైగా ఈసారి అంతకుమించి పథకాల వరాల జల్లు కురిపించాడు. చంద్రబాబు హామీలను నమ్మిన మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు తమ పార్టీకే ఓట్లు వేసి ఉంటారని ఊహాజనిత లెక్కలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా నాలుగు రోజులు ఆగితే ఫలితాల్లో అంతా తేలనుంది. -
శాంతిభద్రతల సమస్య తలెత్తనీయొద్దు
అనంతపురం అర్బన్: ఓట్ల లెక్కింపు క్రమంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్, ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకటన క్రమంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని చెప్పారు. గొడవలు, ఇబ్బందులు సృష్టించే వారిపై నిఘాకు షాడో పార్టీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా వారి కదలికలు, నడవడికలను ముందుగానే గుర్తించాలని చెప్పారు. బైండోవర్లు, రౌడీషీటర్లపై దృష్టి పెట్టాలన్నారు. 144 సెక్షన్, 133 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బాణా సంచా అమ్మకాలు, కొనుగోలు, రవాణా, వినియోగంపై విధించిన నిషేధం పక్కాగా అమలు కావాలన్నారు. నియోజకవర్గాల స్థాయిలో శాంతిభద్రతల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బైండోవర్లపై రిటర్నింగ్ అధికారులు సమీక్షించాలన్నారు. పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ -
రైలు నుంచి జారి పడి కర్నూలు జిల్లా వాసి మృతి
అనంతపురం సిటీ: బతుకు తెరువు కోసం బెంగళూరుకు వెళ్లొస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతిచెందాడు. మృతుడిని కర్నూలు జిల్లా హోళగుంద మండలం నాగరకన్వి గ్రామానికి చెందిన హరిజన నాగప్ప కుమారుడు సురేష్ (20)గా గుర్తించినట్లు అనంతపురం జీఆర్పీ ఎస్ఐ విజయకుమార్ తెలిపారు. తండ్రి పదేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లి, ఇద్దరు తమ్ముళ్ల పోషణ భారం పెద్ద కుమారుడు సురేష్పై పడింది. ఇంటర్ వరకు చదువుకున్న సురేష్.. బెంగళూరుకు వెళ్లి ఏదైనా కంపెనీలో కార్మికుడిగా చేరాలనే ఆకాంక్షతో తన స్నేహితుడితో కలసి వెళ్లాడు. గురువారం ఉదయం హంపి ఎక్స్ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో తిరుగు ప్రయాణమయ్యాడు. రైలు అనంతపురం రామ్నగర్ వద్దకు చేరుకోగానే డోర్ వద్ద నిలబడిన సురేష్ అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కీమెన్ గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి సురేష్గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
పాము కాటుతో యువకుడి మృతి
బొమ్మనహాళ్: పాముకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లికి చెందిన ప్రభాకర్ (25)కు మూడేళ్ల క్రితం కర్ణాటకలోని కంప్లికి చెందిన కవితతో వివాహమైంది. సంతానం లేదు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న ప్రభాకర్ గురువారం ఉదయం తోటి కూలీలతో కలసి దేవగిరి క్రాస్ వద్ద జొన్న సొప్పను లారీలో లోడ్ చేసే పనికి వెళ్లాడు. అప్పటికే జొన్నసొప్పలో పొంచి ఉన్న పాము కాటు వేయడంతో ప్రభాకర్ను వెంటనే బళ్లారిలోని విమ్స్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. -
విశ్వాసంతో సమస్తమూ సాధ్యమే
గుత్తి: విశ్వాసంతో ప్రార్థిస్తే సర్వాధిపతియైన యేసు సమస్తమూ అందిస్తారని, నమ్మి ప్రార్థించే వారి వెంట క్రీస్తు తప్పక ఉంటారని బైబిల్ మిషన్ చర్చి(స్వస్థత శాల) పాస్టర్లు రెవరెండ్ అద్భుత కుమార్, మణికుమారి అన్నారు. గుత్తి బైబిల్ మిషన్ చర్చిలో జరుగుతున్న మహిమ సువార్త మహాసభలు రెండో రోజు గురువారమూ కొనసాగాయి. దేశవిదేశాలకు చెందిన ప్రముఖ పాస్టర్లు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్భుత కుమార్, మణికుమారి వాక్యోపదేశం చేశారు. ప్రతి ఒక్కరూ క్రీస్తుపై విశ్వాసం, నమ్మకం ఉంచాలన్నారు. క్రీస్తు బాటలో నడిచేవారికి అంతా మేలే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బైబిల్ మిషన్ చర్చి సభ్యులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బైబిల్ మిషన్ చర్చి పాస్టర్ రెవరెండ్ అద్భుత కుమార్ రెండో రోజు కొనసాగిన మహిమ సువార్త సభలు -
రైలు నుంచి జారి పడి కర్నూలు జిల్లా వాసి మృతి
అనంతపురం సిటీ: బతుకు తెరువు కోసం బెంగళూరుకు వెళ్లొస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతిచెందాడు. మృతుడిని కర్నూలు జిల్లా హోళగుంద మండలం నాగరకన్వి గ్రామానికి చెందిన హరిజన నాగప్ప కుమారుడు సురేష్ (20)గా గుర్తించినట్లు అనంతపురం జీఆర్పీ ఎస్ఐ విజయకుమార్ తెలిపారు. తండ్రి పదేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లి, ఇద్దరు తమ్ముళ్ల పోషణ భారం పెద్ద కుమారుడు సురేష్పై పడింది. ఇంటర్ వరకు చదువుకున్న సురేష్.. బెంగళూరుకు వెళ్లి ఏదైనా కంపెనీలో కార్మికుడిగా చేరాలనే ఆకాంక్షతో తన స్నేహితుడితో కలసి వెళ్లాడు. గురువారం ఉదయం హంపి ఎక్స్ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో తిరుగు ప్రయాణమయ్యాడు. రైలు అనంతపురం రామ్నగర్ వద్దకు చేరుకోగానే డోర్ వద్ద నిలబడిన సురేష్ అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కీమెన్ గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి సురేష్గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
అనాథ పిల్లలకు అండగా రంగయ్య
శెట్టూరు: తల్లి మృతితో అనాథలైన చిన్నారులకు ఎంపీ తలారి రంగయ్య అండగా నిలిచారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు ముగ్గురు పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. వివరాలు... శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన చంద్రకళ (36), తిమ్మరాజు దంపతులకు 11 ఏళ్ల వయసున్న ప్రభాని, ఏడేళ్ల వయసున్న అనుశ్రీ, ఆరు నెలల వయసున్న ఓ కుమారుడు ఉన్నారు. కారణమెదో తెలియదు కానీ తిమ్మరాజు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పిల్లలపోషణ భారం చంద్రకళపై పడింది. మూడు రోజుల క్రితం గుండెపోటుతో చంద్రకళ మృతి చెందింది. అయిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్నారులు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ తలారి రంగయ్య గురువారం ఐదుకల్లు గ్రామానికి చేరుకుని చిన్నారులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. వారికి విద్య, వైద్యం, పోషణ తదితర అంశాల్లో అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, నాయకులు గోళ్ల సూరి, దొణస్వామి, సోమనాథరెడ్డి, ఎంఎస్ రాయుడు, తిప్పేస్వామి, స్థానిక సర్పంచ్ విరుపాక్షి గౌడ్, ఎంపీటీసీ నాగమణి, సింగిల్ విండో అధ్యక్షుడు ఎర్రిస్వామి, మహిళ నాయకురాలు మంజులమ్మ తదితరులు పాల్గొన్నారు. కదిలిన అధికార యంత్రాంగం ఐదుకల్లు విషయం తెలుసుకున్న ఐసీపీఎస్ అధికారులు గురువారం ఆ గ్రామానికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, సీడీపీఓ వనజాక్కమ్మ, స్థానిక సూపర్వైజర్ రాధమ్మ, అంగన్వాడీ కార్యకర్త ఉన్నారు. ఆరునెలల బాలుడిని శిశుగృహలో, ఇద్దరు బాలికలను హోంలో చేర్పించి సంరక్షణ కల్పిస్తామన్నారు. విషయం తెలుసుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్... రూ.10 వేల విలువ చేసే దుస్తులు, రూ.5 వేల నగదును అందజేశారు. సర్పంచ్ విరుపాక్షి రూ.10 వేలను బాధిత కుటుంబానికి అందజేశారు. కానరానిలోకానికి తల్లి .. కన్పించని తండ్రి అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారులు -
కర్ణాటక మద్యం స్వాధీనం
బొమ్మనహాళ్: అక్రమంగా జిల్లాలోకి తీసుకువస్తున్న కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు... బళ్లారి జిల్లా రూపనగుడి పంచాయతీ రాయపుర గ్రామానికి చెందిన బోయ భీమన్న, బోయ ఆంజనేయ గురువారం ఉదయం కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనంపై మద్యం బాక్సులు తరలిస్తూ బొల్లనగుడ్డం చెక్పోస్టు వద్ద పట్టుబడ్డారు. విచారణలో గోవిందవాడ, కల్లుహోళ గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్నట్లుగా అంగీకరించారు. వీరి నుంచి 90 ఎంఎల్ సామర్థ్యమున్న 960 టెట్రా ప్యాకెట్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. విద్యార్థి దుర్మరణం పుట్లూరు: టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన వెంకటనారాయణాచారి, సుశీలమ్మ దంపతుల కుమారుడు వర్దనాచారి (19) తాడిపత్రిలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం ఉదయం తన స్నేహితుడు ప్రవీణ్తో కలసి ప్రాక్టికల్స్ పరీక్షకు హాజరయ్యాడు. తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా నాగిరెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే నల్లమట్టిని పొలాలకు తరలిస్తున్న టిప్పర్ ఢీ కొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వర్దనాచారి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హేమాద్రి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కణేకల్లు: చదువుకునే వయసులో ప్రేమ సరైంది కాదని తల్లిదండ్రులు మందలించడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కణేకల్లు మండలం బెణికల్లు గ్రామానికి చెందిన కె.వర్షిత (17) మండల కేంద్రంలోని ఓ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో తాను ఆశించిన మేర మార్కులు రాకపోవడంతో ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఫిజిక్స్ పరీక్ష రాసి ఇంటికెళ్లింది. అప్పటికే కొంత మంది ద్వారా కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. బుద్దిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కెమిస్ట్రీ పరీక్ష రాసేందుకు కుమార్తె సిద్ధమవుతుండగా గమనించిన తల్లిదండ్రులు ఏ పరీక్ష రాయొద్దని, కళాశాల తెరిచే వరకూ కణేకల్లుకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. దీంతో స్నానంచేసి వస్తానంటూ బాత్రూంకు వెళ్లిన వర్షిత.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ ఆమె బయటికు రాకపోవడంతో తల్లిదండ్రులు బాత్రూం తలుపు బద్దలుకొట్టి చూశారు. అప్పటికే విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను గమనించి, విషయం పోలీసులకు తెలిస్తే పరువు పోతుందని భావించి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికెళ్లి ఆరా తీయడంతో మొత్తం విషయం వెలుగు చూసింది. ఇన్చార్జ్ వీఆర్వో దామోదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, వర్షిత ఆత్మహత్య విషయం తెలియగానే కణేకల్లు కాలేజీలో ఫస్ట్ ఈయర్ చదువుతున్న ఓ విద్యార్థి సైతం యర్రగుంట వద్ద ఉదయం 11.50 గంటలకు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. రోడ్డు పక్కన అపస్మారకస్థితిలో పడి ఉన్న విద్యార్థిని స్థానికులు గుర్తించి కణేకల్లుక్రాస్లోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు సూచన మేరకు కుటుంబసభ్యులు బళ్లారికి తీసుకెళ్లారు. ప్రేమ వ్యవహారమే కారణం విషయం తెలిసి మందలించిన తల్లిదండ్రులు ప్రియురాలి మృతితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం -
ప్రాణం పోసిన వైద్యులు
అనంతపురం ఎడ్యుకేషన్: తీవ్ర కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్సతో అనంతపురం సర్వజన ఆస్పత్రి వైద్యులు ప్రాణం పోశారు. వివరాలు.. గుంతకల్లు ప్రాంతానికి చెందిన అబ్దుల్లాపై కత్తి దాడి జరిగింది. విషమ పరిస్థితిలో ఉన్న అతడిని ఈ నెల 18న అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు... పేగు మూడు చోట్ల తెగినట్లు, మూడు ఎముకలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనికితోడు అధిక రక్తస్రావంతో రోగి పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో వెంటనే ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. జనరల్ సర్జరీ హెడ్ డాక్టర్ రామస్వామినాయక్ ఆధ్వర్యంలో డాక్టర్ ఉజ్జనేశ్వరి, డాక్టర్ రష్మీ, డాక్టర్ రమణనాయక్, పీజీలు డాక్టర్ రమ్య, డాక్టర్ విశాల్, డాక్టర్ అభిలాష్, సీటీవీఎస్ సర్జన్ డాక్టర్ సునీల్కళ్యాణ్దేవ్, అనస్తీసియా వైద్యులు నవీన్, జ్యోత్స్న శస్త్రచికిత్స చేపట్టారు. ఆపరేషన్ అనంతరం 11 బాటిళ్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. 12 రోజుల పాటు వారి పర్యవేక్షణలోనే ఉంచుకున్న అనంతరం రోగి కోలుకున్నట్లుగా నిర్ధారించుకుని గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులకు రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తి బలవన్మరణం ● మృతుడు 104 వాహన డ్రైవర్ ఆత్మకూరు: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరానికి చెందిన ముస్తఫా (55) పదేళ్లుగా ఆత్మకూరులో 104 వాహన డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా దాదాపు నెల రోజులకు పైగా సెలవు తీసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం విధులకు హాజరయ్యాడు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం వైద్య సిబ్బందితో కలసి 104 వాహనంలో ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చేరుకున్నాడు. గ్రామస్తులకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిమగ్నమైన సమయంలో ఆ పక్కనే ఉన్న ఆర్డీటీ పాఠశాల ఆవరణలోకి చేరుకున్న ముస్తఫా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ముస్తఫా కోసం సిబ్బంది గాలించారు. ఆ సమయంలో ఉరికి విగతజీవిగా వేలాడుతున్న ముస్తఫాను గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, ముస్తఫాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నేడు ఏపీ ఈసెట్, ఐసెట్ ఫలితాల విడుదల
అనంతపురం: ఏపీ ఈసెట్ –2024 పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. జేఎన్టీయూ అనంతపురంలో నిర్వహించే ఫలితాల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రా రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు ఏపీ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి తెలిపారు. ● శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏపీ ఐసెట్–2024 ఫలితాలు గురువారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు ఏపీ ఐసెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కే. హుస్సేన్ రెడ్డి పేర్కొన్నారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి అనంతపురం అర్బన్: కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అధికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో 225 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటిని జేఎన్టీయూలోని హంపి హాస్టల్, కలెక్టరేట్, పోలీసు కంట్రోల్ రూమ్లకు అనుసంధానించాలన్నారు. ఓట్ల లెక్కింపు విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో రాళ్లు, కర్రలు, వంటివి లేకుండా చూడాలన్నారు. కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 2న జిల్లాకు పరిశీలకులు వస్తారని, ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. కౌంటింగ్ సమయంలో డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.సమావేశంలో జేసీ కేతన్గార్గ్, జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ సంస్థ మేఘ స్వరూప్, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. లింగాకర్షక బుట్టలతో పురుగు నివారణ యాడికి: లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతిని నివారించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) ఉమామహేశ్వరమ్మ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఆర్బీకేలో ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు ఏడీఏ వెంకటరాముడు అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టిపై క్లోరైడ్ను పిచికారీ చేస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు. ముందుగా లోతు దుక్కులు చేసి ఒకేసారి పత్తి విత్తనాలు విత్తుకోవాలన్నారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట తొలగించే వరకు వ్యవసాయ సిబ్బంది అండగా ఉంటారన్నారు. ఆర్బీకేల్లో నమోదు చేసుకున్న ప్రతి రైతుకూ నాణ్యమైన విత్తనాన్ని అందిస్తామన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, భూసార పరీక్షలు, మేలైన విత్తన ఎంపిక తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో ఆత్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మద్దిలేటి, కృషి విజ్ఞాన కేంద్రం పశు సంవర్ధక శాఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. విత్తన, ఎరువుల దుకాణాల తనిఖీ.. యాడికి మండలంలోని మూడు విత్తన, ఎరువుల దుకాణాలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెంకట్ ఫర్టిలైజర్ దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకపోవడంతో పాటు విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో విత్తన విక్రయాలను నిలిపివేయాలని డీఏఓ ఆదేశాలు జారీ చేశారు. విత్తన డీలర్లు ముందుగా యాడికి మండలంలోని రైతులకు విత్తనాలు సరఫరా చేసిన తర్వాతనే ఇతరత్రా రైతులకు అమ్ముకోవాలని స్పష్టం చేశారు.బిల్లులు కచ్చితంగా ఇవ్వాలన్నారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ మహబూబ్ భాష, సిబ్బంది పాల్గొన్నారు. -
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు నాసిరకం, కల్తీ విత్తనాలు అంటగడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనంతపురం సబ్ డివిజన్ ఏడీఏ ఎం.రవి హెచ్చరించారు. బుధవారం ఆయన గార్లదిన్నె ఏఓ పి.సోమశేఖర్, ఏఈఓ మురళికృష్ణతో కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో శ్రావణి సీడ్స్, సుధాకర్, శ్రీలేఖ, మనగ్రోమోర్ తదితర విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా శ్రావణి సీడ్స్ గోదాములో నిల్వ ఉంచిన రూ.42 లక్షల విలువ చేసే కర్భూజా, కళింగర, మిరప విత్తనాల అమ్మకాలు నిలిపివేస్తూ (స్టాప్ సేల్స్) ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో వాటికి సంబంధించి రికార్డులు సమర్పించకుంటే సీజ్ చేయడంతో పాటు 6–ఏ కేసు నమోదు చేస్తామన్నారు. దుకాణాల్లో రైతులకు పూర్తి వివరాలతో కూడిన ఒరిజినల్ బిల్లులు ఇవ్వాలని, ధరల పట్టిక ఉండాలని, ఎంఆర్పీకి మించి అధికంగా విక్రయాలు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ, నాసిరకం, నిషేధిత ఉత్పత్తుల అమ్మకాలు సాగించినా క్రిమినల్ కేసులతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా పురుగు మందులు అంటగట్టడం, డిమాండ్ సృష్టించి అధిక ధరలు, బిల్లులు లేకుండా అమ్మడం లాంటివి చేస్తే కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తన దుకాణాల్లో రెండో రోజూ అధికారుల ఆకస్మిక తనిఖీలు రూ.42 లక్షల విలువైన విత్తన అమ్మకాల నిలిపివేత -
విహార యాత్రలో విషాదం
అనంతపురం: విహార యాత్రలో విషాదం నెలకొంది. చార్ధామ్ యాత్రకు వెళ్లిన నగరవాసి ఒకరు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి వద్ద కన్నుమూశారు. వివరాలు.. నగరంలోని చంద్ర హాస్పిటల్ వద్ద హనుమంతకారి సురేష్ రావు (64) తన భార్య సుమిత్రభాయ్, కుమారుడు సోను, కుమార్తె సునామాతో కలిసి నివాసం ఉంటున్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ అయిన ఈయన వారం క్రితం కుటుంబంతో కలిసి ఓ టూరిస్ట్ బస్సులో చార్ధామ్ యాత్రకు వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున గంగోత్రి సమీపంలో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఉత్తర కాశీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పలువురు ఆరెకటిక సామాజికవర్గానికి చెందిన నాయకులు నగరంలో ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎస్కేయూ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ చౌడోజీరావు, లక్ష్మీనారాయణ, మల్లిఖార్జున, సాయినాథ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త వంగడాలపై దృష్టి సారించండి
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగలో కొత్త వంగడాలను సృష్టించి జిల్లా రైతులకు పరిచయం చేయడంపై దృష్టి సారించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానికంగా ఉన్న విజయ ఆగ్రోసీడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఆయన సందర్శించారు. విత్తన శుద్ధి, నాణ్యత, మొలకశాతం, తేమశాతం, అవుటన్ తదితర ప్రమాణాలను పరిశీలించారు. 30 కిలోల బస్తా తూకాలు, నాణ్యతా ప్రమాణాల గురించి ఏడీఏ ఎం.రవి కలెక్టర్కు వివరించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా రైతులకు మంచి విత్తనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే నెలలో కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం, అలాగే కర్ణాటకలో ఉన్న పరిశోధనా కేంద్రాలను సందర్శించి కొత్త వంగడాల పరిశోధనలు, వాటి ఫలితాల ఆధారంగా ముందడుగు వేయాలన్నారు. వేరుశనగ రకాలకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రం జునాఘడ్కు జిల్లా నుంచి ఒక బృందం పంపడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక ఏడీఏ, ఇద్దరు ఏఓలు, ఒక శాస్త్రవేత్తతో కూడిన బృందాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓలు పి.సోమశేఖర్, సాయిలక్ష్మి తదితరులున్నారు. -
జిల్లా అంతటా బుధవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
సమస్యాత్మక గ్రామాలను సందర్శించాలి ఆత్మకూరు: సమస్యాత్మక గ్రామాలను తరచూ సందర్శించాలని ఎస్పీ గౌతమిశాలి అన్నారు. బుధవారం స్థానిక పోలీసుస్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలో సమస్యాత్మక గ్రామాలు, తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారిని త్వరితగతిన బైండోవర్ చేయాలన్నారు. గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ పెట్రోలింగ్లు, కార్డెన్ సెర్చ్లు విస్తృతం చేయాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజు, ఆ తర్వాత గ్రామాల్లో హింసకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ మునీర్ అహమ్మద్ పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా అనంతపురం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డ్రోన్ ఆపరేటింగ్పై సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదునిచ్చినట్లు పేర్కొన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ముందస్తుగా పసిగట్టేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తాడిపత్రి, అనంత పురం రూరల్ సబ్ డివిజన్లలో డ్రోన్ కెమెరాల పెట్రోలింగ్ ప్రారంభించామన్నారు. ఘర్షణల కోసమని ఎక్కడైనా మిద్దెలపై రాళ్లు, కట్టెలు సమీకరించుకున్నారా అనే విషయం పసిగడుతున్నామన్నారు. గ్రామాల్లో అనుమానితుల సంచరింపు, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బెదిరింపులు, కవ్వింపు చర్యలు, వైరి వర్గాలు తలపడటం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అణచి వేస్తామన్నారు. 144 సెక్షన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ నేతల ధర్నా
తెలంగాణ ఇరిగేషన్శాఖ ఈఈ బన్సీలాల్ అరెస్ట్
చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు, కుట్రలు,కుతంత్రాలే బాబు ను ఏకిపారేసిన సీఎం జగన్
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
ఇళయరాజా కూతురి చివరి సాంగ్ విడుదల
"మిస్ యూ నాన్న.."
దర్శకుడు బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం
వారెవ్వా జోసెఫ్.. దెబ్బకు వార్నర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
రేపే చివరి విడత పోలింగ్
స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి: ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
Advertisement