dutee chand
-
ద్యుతీ చంద్కు భారీ షాక్.. నాలుగేళ్ల నిషేధం! కావాలని చేయలేదు..
4 Years Ban On Dutee Chand: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్కు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. గతేడాది డిసెంబరు 5, 26 తేదీల్లో భువనేశ్వర్లో నాడాకు చెందిన అధికారులు ద్యుతీ నుంచి రెండుసార్లు శాంపిళ్లు సేకరించారు. ఈ క్రమంలో ఆమె శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకాల(SARMS) ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో జనవరి 3, 2023 నుంచే ద్యుతీపై నిషేధం అమల్లోకి వస్తుందని నాడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ద్యుతీ చంద్ గెలిచిన పతకాలన్నీ వెనక్కి తీసుకోనున్నారు. క్లీన్చిట్ వస్తుంది ఈ విషయంపై స్పందించిన ద్యుతీ తరఫు న్యాయవాది శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ద్యుతీ చంద్ ఈ మందులు వాడలేదని తెలిపారు. ఆమె తీసుకున్న ఏజెంట్లు స్పోర్టింగ్ అడ్వాంటేజ్ ఇవ్వవని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల నిషేధంపై తాము అప్పీలుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని.. భారత్కు గర్వకారణమైన ద్యుతీకి క్లీన్చిట్ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కడిగిన ఆణిముత్యంలా ‘దశాబ్దకాలంగా ద్యుతీ కెరీర్ దేదీప్యమానంగా కొనసాగుతోంది. తన సుదీర్ఘ కెరీర్లో.. క్లీన్ అథ్లెట్ ద్యుతీ.. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వందలసార్లు డోపింగ్ టెస్టులు ఎదుర్కొని కడిగిన ఆణిముత్యంలా తిరిగి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది’’అని సదరు న్యాయవాది ద్యుతిపై నమ్మకం ఉంచారు. కాగా SARMS(సెలక్టివ్ ఆండ్రోజెన్ రెసిప్టార్ మ్యాడ్యులేటర్స్) అనేవి నాన్- స్టెరాయిడల్ సబ్స్టాన్సెన్స్. వీటిని సాధారణంగా ఆస్టియోపొరోసిస్(కీళ్లు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు), ఎనీమియా(రక్తహీనత) ఉన్న పేషెంట్ల చికిత్సలో వినియోగిస్తారని తెలుస్తోంది. కాగా 27 ఏళ్ల ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండుసార్లు రజతాలు గెలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికీ నేషనల్ రికార్డు తన పేరిటే ఉంది. 2011లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్లో 11.17 సెకన్లలో పరుగు పూర్తి చేసింది ద్యుతీ. చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
'ఆమె'నే పెళ్లి చేసుకుంటా.. మహిళా అథ్లెట్ సంచలన వ్యాఖ్యలు
భారత స్టార్ మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రిలేషన్షిప్లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది. తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వాపోయింది. తన లాంటి వాళ్లు ట్రాక్తో పాటు సమాజంతో కూడా పోరాడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్ట వ్యతిరేకమన్న ప్రశ్నపై సమాధానం దాటవేసింది. కాగా, మరో మహిళతో (మోనాలిసా) సహజీవనం చేస్తున్న విషయాన్ని ద్యుతీ గతంలోనే ప్రకటించింది. ద్యుతీ శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు అధికంగా ఉన్నాయన్న కారణంగా ఆమెపై 2014 కామన్వెల్త్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. ఐదేళ్ల న్యాయపోరాటం అనంతరం ఈనెల (జులై) 28 నుంచి బర్మింగ్హామ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మెగా ఈవెంట్లో ద్యుతీ 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది. చదవండి: భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం -
మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన మహిళా అథ్లెట్
భువనేశ్వర్లోని (ఒడిశా) స్పోర్ట్స్ హాస్టల్లో సీనియర్ల వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని రుచిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత స్టార్ మహిళా స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్, స్పోర్ట్స్ హాస్టల్ మాజీ విద్యార్ధిని ద్యుతీ చంద్ స్పందించింది. స్పోర్ట్స్ హాస్టల్లో తాను ర్యాగింగ్ బాధితురాలినే సంచలన విషయాలను వెల్లడించింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, బాడీ మసాజ్ చేయమని బెదిరించేవారని ఆరోపించింది. వారు చెప్పిన విధంగా చేయకపోతే టార్చర్ పెట్టేవారని వాపోయింది. రుచిక లాగే తాను కూడా హాస్టల్లో దుర్భర అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది. స్పోర్ట్స్ హాస్టల్లో గడిపిన రెండేళ్లు నిద్రలేని రాత్రులు గడిపానని, తన బాధను హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయేదని, సీనియర్లపై కంప్లైంట్ చేసినందుకు అధికారులు తననే రివర్స్లో తిట్టేవాళ్లని గత అనుభవాలను గుర్తు చేసుకుంది. హాస్టల్ అధికారులు తన పేదరికాన్ని చూసి హేళన చేసే వారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అవమానించేవారని సోషల్మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. క్రీడాకారులు ఇలాంటి ఘటనల వల్ల చాలా డిస్టర్బ్ అవుతారని, తాను కూడా హాస్టల్లో గడిపిన రోజుల్లో మానసికంగా కృంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్లోనే ద్యుతీ 2006 నుంచి 2008 వరకు గడిపింది. చదవండి: గీతిక, అల్ఫియా ‘పసిడి’ పంచ్ -
అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు
భువనేశ్వర్: ఫోకస్ ప్లస్ వెబ్ చానల్ ఎడిటర్ సుధాంశుశేఖర్ రౌత్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ స్ప్రింటరు ద్యుతి చంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. సదరు మీడియా ప్రతినిధి తనకు వ్యతిరేకంగా అవమానకరమైన ప్రసారాలు చేసి, మానసిక వేదనకు గురిచేసినట్లు నగరంలోని మహిళా పోలీస్టేషన్లో ద్యుతి చంద్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరువునష్టం దావా దాఖలు చేయగా, విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాదాస్పద చానల్ కార్యాలయం నుంచి కంప్యూటర్ ఇతర సామాగ్రిని జప్తు చేశారు. చదవండి: Tokyo Paralympics: చెలరేగుతున్న భారత షట్లర్లు.. వరుసగా రెండో స్వర్ణం సొంతం టోక్యో ఒలింపిక్స్లో ఆడుతుండగా, ద్యుతి చంద్ కుటుంబ వ్యవహారాలపై అసభ్యకర ప్రసారాలు చేస్తానని, ఎడిటర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పాలని, లేకపోతే వీటిని ప్రసారం చేస్తానని పదేపదే బెదిరించడంతో మానసిక స్థైర్యం కోల్పోయి ఒలింపిక్స్లో తాను ఓడిపోయానని ద్యుతి చాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చర్యలకు వ్యతిరేకంగా దాదాపు రూ.5 కోట్ల వరకు పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు సమాచారం. బెయిలు నిరాకరణ.. స్ప్రింటరు ద్యుతి చంద్ని బెదిరించిన కేసులో అరెస్టయిన ఎడిటర్ సుధాంశు శేఖర్ రౌత్కి స్థానిక సబ్–డివిజినల్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ (ఎస్డీజేఎమ్) కోర్టు బెయిలు నిరాకరించింది. ప్రస్తుతం సుధాంశుతో పాటు ఆయన అనుచరుడు స్మృతి రంజన్ బెహరాకి కూడా న్యాయ స్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుధాంశు విచారణకు 7 రోజుల రిమాండ్కు పోలీస్ వర్గాలు అభ్యర్థించగా, కోర్టు ఒక్కరోజు రిమాండ్కు మాత్రమే అనుమతించడం విశేషం. చదవండి: Jeanette Zacarias Zapata: బాక్సింగ్ రింగ్లో విషాదం.. 18 ఏళ్ల టీనేజ్ బాక్సర్ మృతి -
ఈ స్ఫూర్తితో టోక్యో బెర్త్ పట్టేస్తా: ద్యుతీ చంద్
న్యూఢిల్లీ: ‘అర్జున అవార్డు’ తనకు సరైన సమయంలో లభించిందని... ఈ పురస్కారం స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ను పట్టేస్తానని భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆశాభావం వ్యక్తం చేసింది. గత శుక్రవారం కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ద్యుతీ చంద్ ‘అర్జున అవార్డు’కు ఎంపికైంది. ఒడిషాకు చెందిన 24 ఏళ్ల ద్యుతీ చంద్ ఇప్పటి వరకు మహిళల 100 మీటర్ల ఒలింపిక్ అర్హత మార్కును (11.15 సెకన్లు) అందుకోలేకపోవడంతో... ఆమె టోక్యో ఒలింపిక్స్ ఎంట్రీ అనుమానంగానే ఉంది. (చదవండి: ఇంగ్లండ్తో సిరీస్పై క్లారిటీ ఇచ్చిన దాదా) ‘అర్జున అవార్డు నాకు సరైన సమయంలో లభించింది. ప్రభుత్వం నుంచి లభించే ఏ గుర్తింపు అయినా సరే అథ్లెట్లోని అత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉంటుంది. ప్రస్తుతం నా విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వం నన్ను గుర్తించిందనే భావన నాలో కొత్త శక్తినిచ్చింది. ఒలింపిక్ అర్హత మార్కు కష్టంగా ఉన్నా సరే... నేను సాధించి తీరుతా’ అని ద్యుతీ పేర్కొంది. 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రజత పతకాన్ని సాధించిన ఆమె... 2016 రియో ఒలింపిక్స్కు అర్హత సాధించినా హీట్స్ను దాటి ముందుకెళ్లలేకపోయింది. (చదవండి: బ్యాలెన్స్ నిల్) -
బ్యాలెన్స్ నిల్
గోల్డ్ మెడల్కు రెండే సెకన్ల దూరం. ద్యుతీ చంద్ రీచ్ అవుతుందా? ఇరవై ఐదు లక్షలుంటే అవుతుంది. ఒలింపిక్స్శిక్షణకు ఆ డబ్బు. రెండేళ్ల క్రితమే కదా మూడు కోట్లు వచ్చింది! కోట్లు చూసుకొనుంటే బాగానే ఉండేది. లాక్డౌన్లో పస్తుల్ని చూసింది. కాలే కడుపుల్ని... తన బ్యాంక్ బ్యాలెన్స్తో నింపింది. రెండేళ్ల క్రితం ఇరవై రెండేళ్ల వయసులో ద్యుతీ చంద్ కోటీశ్వరురాలు. రెండేళ్ల తర్వాత ఇరవై నాలుగేళ్ల వయసులో ఇప్పుడు ఆమె నిరుపేద! నిరుపేద అంటే తిండికి లేకపోవడం కాదు. ఒలింపిక్స్కు శిక్షణ తీసుకోడానికి 25 లక్షల రూపాయలు లేకపోవడం. నాలుగేళ్ల క్రితం రియోలో ఆమె పరుగు మొదటి రౌండ్తోనే ఆగిపోయింది. అప్పట్నుంచీ పంతం ఆమెను దహించి వేస్తోంది. అయితే కరోనా లాక్డౌన్లో పూట గడవని వాళ్ల ఆకలితో పోలిస్తే, తన పతకం పెద్దపులేం కాదని ద్యుతీ అనుకున్నట్లుంది. వారి కోసం తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్నీ ఖర్చుపెట్టేసింది. కరోనా రాకుండా ఉంటే, ఈ ఏడాది జరగవలసిన టోక్యో ఒలింపిక్స్ జరిగి ఉంటే ఆమె పంతం నెగ్గి, పతకం సాధించుకుని వచ్చేది కావచ్చు. టోక్యోలో ఈ ఏడాది వాయిదా పడిన ఒలింపిక్స్ వచ్చే ఏడాది జూలైలో జరుగుతున్నాయి. ద్యుతీ స్టార్ స్ప్రింటర్. వంద మీటర్లు, రెండొందల మీటర్ల పరుగు పందెంలో బరిలోకి దిగేందుకు ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రమైన ఒడిశాలోని భువనేశ్వర్లో కఠినమైన సాధనే చేస్తోంది. ఆమె కోచ్ రమేశ్ హైదరాబాద్ నుంచి ఆమె సాధనలోని పురోగతిని ఆన్లైన్లోనే పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు ఇస్తున్నారు. వంద మీటర్ల పరుగులో ఇప్పటి వరకు ద్యుతీ రికార్డు 11.22 సెకన్లు, 200 మీ.లో 23.17 సెకన్లు. ఫేస్బుక్లో ద్యుతీ అమ్మకానికి పెట్టిన కారు. తర్వాత ఆ పోస్టును ద్యుతీ తొలగించింది వచ్చే టోక్యో ఒలింపిక్స్లో ఆమె స్వర్ణ పతకం సాధించాలంటే.. 2016 రియోలో ఈ రెండు ఈవెంట్లలో గోల్డ్ మెడల్ గెలుచుకున్న జమైకా ఉమన్ స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్ను దాటిపోయేలా అయినా టైమ్ని గ్రిప్లోకి తీసుకోవాలి. ఎలైన్ 10.71, 21.78 సెకన్లలో రెండు బంగారు పతకాలు సాధించింది. ఎలైన్ గోల్డ్కి, ద్యుతీ గోల్డ్ లక్ష్యానికి మధ్య వ్యత్యాసం కేవలం 0.51, 1.39 సెకన్లు మాత్రమే. ఆ సమయాన్ని తగ్గించడానికే ఇప్పుడు ద్యుతీకి 25 లక్షల రూపాయలు కావాలి. జర్మనీలో శిక్షణ తీసుకోవాలని అనుకుంటోంది ద్యుతీ. పంజాబ్లోని పాటియాలాలో ఈ ఏడాది ఏప్రిల్లో జరగవలసిన ఫెడరేషన్ కప్ అథ్లెట్ మీట్ కరోనా వల్ల రద్దయిన తర్వాత ప్రాక్టీస్ కోసం ద్యుతీ భువనేశ్వర్లోనే ఉండిపోయింది. లాక్డౌన్లో ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకుని రోజంతా కళింగ స్టేడియంలోనే గడుపుతోంది. అయితే ఈ దేశీయ సాధన అంతర్జాతీయ పోటీలకు సరిపోదు. అందుకే విదేశాలకు వెళ్లడం కోసం తన లగ్జరీ సెడాన్ బి.ఎం.డబ్లు్య. కారుని ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టింది. అందుకు తనేమీ సంశయించలేదు. స్పాన్సరర్లు ఎవరూ ముందుకు రావడంలేదు మరి. శిక్షణ కోసం తను ఏ దేశానికి వెళ్లవలసిందీ సూచించేది చివరికి ‘అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’నే అయినప్పటికీ ద్యుతీ మాత్రం జర్మనీని ఒక ఎంపికగా పెట్టుకుంది. అయితే ఫేస్బుక్లో కారును అమ్ముతున్నట్లు పోస్టు పెట్టగానే ‘ఆ అమ్మాయికి సహాయం చేయండి’ అని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కామెంట్లు మొదలవడంతో ద్యుతీ ఆ పోస్టును తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఒకటొకటిగా ఆటలు మొదలవుతున్నాయి. యూరప్లో ఫుట్బాల్, క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఇండియాలో కూడా సెప్టెంబరు నాటికి క్రీడా కార్యకలాపాలు ప్రారంభం కావచ్చనీ, అప్పటికి స్పాన్సరర్లు కూడా దొరికితే దొరకొచ్చనీ ద్యుతీ ఆశిస్తోంది. యవ్వనంలోనే కోట్ల డబ్బును చూసిన ఈ అమ్మాయి.. యవ్వనంలోనే మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం చూస్తోంది. ఏమైంది అంత డబ్బు?! 2018లో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిశా ప్రభుత్వం ద్యుతీకి 3 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబంలోని అమ్మాయి ద్యుతీ. ఆ డబ్బుతో ఆమె సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. తల్లిదండ్రుల అప్పులు తీర్చింది. కారు కొనుక్కుంది. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంది. జాగ్రత్త పడలేదని మనం అనొచ్చు. ఎదురుగా పస్తులు ఉంటున్న వారిని చూస్తున్న కళ్లకు.. బ్యాంకులోని బ్యాలెన్స్ని భద్రంగా చూసుకోడానికి మనసొప్పుతుందా? ఏషియన్స్ గేమ్స్లో ద్యుతీ సిల్వర్ మెడల్ సాధించినప్పటి చిత్రం -
లాక్డౌన్: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్
భువనేశ్వర్ : భారత అగ్రశేణి స్పింటర్ ద్యుతీ చంద్ విలువైన బీఎండబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్ధపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా శిక్షణ ఖర్చులు తీర్చేందుకు బీఎండబ్ల్యూ కారును సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతీనే ఫేస్బుక్లో వెల్లడించారు. ‘నా లగ్జరీ బీఎండబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నాను. ఎవరైనా కొనాలి అనుకుంటే నాకు మెసేంజర్లో సంప్రదించండి’ అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్టులో పెట్టారు. అయితే ఫేసుబుక్లో పోస్ట్ పెట్టిన తర్వాత ఆమెకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తరువాత ఆ పోస్టును స్పింటర్ రాణి డిలీట్ చేశారు. కాగా ద్యుతీ 2015 బీఎండబ్ల్యూ3- సిరీస్ మోడల్ను కలిగి ఉన్నారు. ఆమె దానిని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. (‘నన్ను రావద్దనే సందేశం వచ్చింది’) ఈ విషయంపై ఓ జాతీయ మీడియా ముందు ద్యుతీ మాట్లాడుతూ.. ‘టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది. కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్తోపాటు ఇతర ఖర్చులు కలిపి నాకు నెలకు అయిదు లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇప్పడు నా డబ్బులన్నీ అయిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. కానీ నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నాను. నా ఫిట్నెస్, జర్మనీలో శిక్షణ కోసం నాకు డబ్బు కావాలి. నా శిక్షణ, డైట్ ఖర్చులను తీర్చడానికి దీనిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో మూడు కార్లు ఉన్నాయి. కావున ఒక కారు అమ్మాలనుకుంటున్నాను’ అని తెలిపారు. అయితే ఆ కారు తనకు బహుమతిగా లభించిందా అని ప్రశ్నించగా. తను స్వయంగా కొనుగోలు చేసినట్లు ద్యుతీ వెల్లడించారు. (ఫుట్బాల్ లెజెండ్ కన్నుమూత) -
‘నన్ను రావద్దనే సందేశం వచ్చింది’
భువనేశ్వర్: కరోనా వైరస్ ప్రభావంతో జర్మనీలో జరగాల్సిన పలు అథ్లెటిక్స్ పోటీలు రద్దవడంతో భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆందోళనలో పడ్డారు. విశ్వక్రీడలకు అర్హత సాధించాలన్న ఆమె లక్ష్యం ఇప్పటికైతే తాత్కాలికంగా నిలిచిపోయింది. జర్మనీ వెళ్లేందుకు గతంలోనే వీసా మంజూరైనా కరోనా వైరస్ ప్రభావంతో అక్కడికి వెళ్లేందుకు ద్యుతీకి అనుమతి లభించలేదు. ఒకవైపు ఒలింపిక్స్ షెడ్యూల్ను నిర్వహిస్తామని ఐఓసీ పెద్దలు చెబుతుండగా, మరొకవైపు అథ్లెట్లు క్వాలిఫయింట్ టోర్నీల్లో పాల్గొనాల్సింది. ఈ క్రమంలోనే మార్చి 2వ తేదీ నుంచి ఆరంభమైన ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లలో భారత స్ప్రింటర్ ద్యుతీ పాల్గొనాల్సి ఉంది. ఇక్కడ ముందుగానే వీసా అందుకున్న చివరి నిమిషంలో ఆంక్షలు విధించారు. ఫలితంగా ద్యుతీ తన జర్మనీ పర్యటనను విధిలేని పరిస్థితుల్లో వదులు కోవాల్సి వచ్చింది. . ‘వీసాతో పాటు జర్మనీకి వెళ్లేందుకు కావాల్సిన పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే వైరస్ కారణంగా ఇక్కడికి వచ్చేందుకు వీల్లేదంటూ ఆ దేశంలోని ట్రైనింగ్ క్యాంప్ నుంచి సందేశం వచ్చింది. నేను చాలా నిరాశచెందా. 100మీటర్ల పోటీలో ఒలింపిక్స్ అర్హత 11.15సెకన్లు. యూరప్లో మంచి నైపుణ్యం అథ్లెట్లు ఉన్నారు. పోటీ అయితే ఎక్కువ లేదు. నేను క్వాలిఫయింగ్ టోర్నీల్లో భాగంగా పలు మెరుగైన కాంపిటీషన్లలో పాల్గొనడానికి ఎప్పట్నుంచో సిద్ధమయ్యా. నా ప్రణాళికలన్నీ ఆవిరైపోయాయి’ ద్యుతీ నిరాశ వ్యక్తం చేశారు. -
‘టైమ్–100 నెక్ట్స్’ జాబితాలో ద్యుతీ
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ అథ్లెట్, ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు నెగ్గిన ద్యుతీచంద్కు ‘టైమ్–100 నెక్ట్స్’ జాబితాలో చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ప్రభావం చూపగల వ్యక్తుల జాబితాలో ఆమెకు క్రీడల కేటగిరీలో చోటు లభించింది. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ రంగాల్లో అత్యంత ప్రభావశీలురను గుర్తించి టైమ్ మేగజైన్ ప్రతీయేటా ఈ జాబితాను తయారు చేస్తుంది. ఈ జాబితాలో స్థానం దక్కడంపై ద్యుతీచంద్ సంతోషం వ్యక్తం చేసింది. -
‘ట్రాక్’ మార్చిన ద్యుతీచంద్
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు, జాతీయ స్థాయిలో మరెన్నో రికార్డులు భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ సొంతం. కానీ ఒలింపిక్స్లో పతకం మాత్రం ఆమెను ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈసారి ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా ద్యుతీచంద్ సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 100 మీటర్ల రేసులో 11.22 సెక్లనలో లక్ష్యాన్ని పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన ద్యుతీచంద్ తన ప్రాక్టీస్ను ముమ్మరం చేశారు. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కు వన్నె తెచ్చిన ద్యుతీచంద్.. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో పతకాన్ని గెలిచి తీరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ట్రాక్’ మార్చిన ద్యుతీచంద్ దాదాపు ఐదేళ్లుగా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రాక్టీస్ చేస్తున్న ద్యుతీచంద్ చాలాకాలం తర్వాత తన ప్రాక్టీస్ను భువనేశ్వర్కు మార్చారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని సింథటిక్ ట్రాక్ ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడంతో భువనేశ్వర్లో ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించారు. గచ్చిబౌలి గట్టిగా మారిపోవడంతో ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది. ప్రాక్టీస్ చేసే సమయంలో కాళ్లకు అసౌకర్యంగా మారడంతో పాటు గాయం అయ్యే అవకాశాలు కూడా ఉండటంతో తన ప్రాక్టీస్ను కొన్ని రోజుల పాటు భువనేశ్వర్లో కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రతీక్షణం ముఖ్యమేనని భావిస్తున్న ద్యుతీచంద్.. తాత్కాలికంగా తన సొంత రాష్టంలో ప్రాక్టీస్ కొనసాగించనున్నారు. హైదరాబాద్లో ప్రాక్టీస్ తర్వాతే ఆమె కెరీర్ ఉన్నత స్థాయికి వెళ్లడంతో ఇక్కడే ప్రాక్టీస్కు తొలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కాగా, ప్రస్తుతం గచ్చిబౌలి సింథటిక్ ట్రాక్ పేలవంగా మారిపోవడంతో ఇక్కడ ఆమె ప్రాక్టీస్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక్కడ పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ గచ్చిబౌలిలోనే ఆమె తిరిగి ప్రాక్టీస్ చేయనున్నారు. ఎంతోమందికి ద్యుతినే స్ఫూర్తి భారత అథ్లెట్లలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ద్యుతీచంద్ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారత్లో అథ్లెట్లకు తగినంత ప్రాచుర్యం లభిస్తుందంటే అందుకు ద్యుతీచంద్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తన ప్రాక్టీస్ను ద్యుతీచంద్ ఆకస్మికంగా భువనేశ్వర్కు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ ఆమె కోచ్ నాగపురి రమేశ్ను ఫోన్లో సంప్రదిస్తే.. ఇక్కడ ప్రాక్టీస్కు తాత్కాలికంగా విరామం మాత్రమే ఇచ్చారన్నారు. ట్రాక్ ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్కు సన్నద్ధమయ్యే క్రమంలో ట్రాక్ కారణంగా ఏమైనా గాయాలైతే తేరుకోవడం కష్టమని భావించడంతోనే గచ్చిబౌలిలో ప్రాక్టీస్కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారన్నారు. పరిస్థితులు మెరుగైన తర్వాత ద్యుతీచంద్ యథావిధిగా ఇక్కడ ప్రాక్టీస్ కొనసాగిస్తారని పేర్కొన్నారు. ద్యుతీచంద్ను చూసి చాలామంది అథ్లెట్లుగా రాణిస్తున్నారన్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి పలువురు అథ్లెటిక్స్ను ఎంచుకోవడానికి ద్యుతీనే ప్రధాన కారణమన్నారు. ఓవరాల్గా భారత్లో అథ్లెటిక్స్కు మరింత గుర్తింపు రావడానికి ద్యుతీచంద్ కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. 40 మంది అథ్లెట్లకు శిక్షణ హైదరాబాద్లో ఏర్పాటైన భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్)- గోపీచంద్-మైత్ర ఫౌండేషన్ ఎంతోమంది ప్రతిభావంతులకు అండగా నిలుస్తుందని నాగపూరి రమేశ్ అన్నారు. తెలంగాణ అథ్లెట్లు దీప్తి, శ్రీనివాస్లు అంతర్జాతీయ-జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంలో ఈ ఫౌండేషన్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన యూత్ ఆసియా చాంపియన్షిప్లో దీప్తి, శ్రీనివాస్లు రెండేసి పతకాలు సాధించిన విషయాన్ని రమేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 200 మీటర్ల పరుగులో దీప్తి కాంస్యం సాధించగా, మెడ్లే రిలేలో రజతం సాధించిందన్నారు. ఇక శ్రీనివాస్ కూడా ఇదే ఈవెంట్లో రజతం, స్వర్ణాలు గెలుచుకున్నారన్నారు. ప్రస్తుతం గోపీచంద్-మైత్ర ఫౌండేషన్లో దాదాపు 40 మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారని తెలంగాణ నుంచి తొలి ద్రోణాచార్య అవార్డు అందుకున్న నాగపూరి రమేశ్ తెలిపారు. -
ద్యుతీచంద్కు స్వర్ణం
లక్నో: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒడిశా అథ్లెట్ ద్యుతీచంద్ ఆకట్టుకుంది. శుక్రవారం జరిగిన 100మీ. పరుగులో ద్యుతీచంద్ విజేతగా నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పరుగును అందరికన్నా వేగంగా 11.38 సెకన్లలో పూర్తిచేసి ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 100మీ. హర్డిల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి విజేతగా నిలిచింది. ఆమె 13.91సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. హెప్టాథ్లాన్ ఈవెంట్లోనూ ఆంధ్రప్రదేశ్కు చెందిన సౌమ్య మురుగన్ 5321 పాయింట్లతో పసిడి పతకాన్ని అందుకుంది. అనస్ తప్పిదం... జట్టుపై అనర్హత వేటు పురుషుల 4–400మీ. రిలేలో భారత అథ్లెట్ మొహమ్మద్ అనస్ తప్పిదంతో ఏఎఫ్ఐ ‘బి’ జట్టుపై అనర్హత వేటు పడింది. ఏఎఫ్ఐ ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అనస్... 400మీ. రిలే ఫైనల్లో ‘బి’ జట్టు ఆటగాడి వద్ద నుంచి బ్యాటన్ అందుకొని పరుగెత్తాడు. దీంతో ‘బి’ జట్టు అనర్హత పాలైంది. నిజానికి అనస్కు బ్యాటన్ అందించాల్సిన అతని ‘ఎ’ జట్టు సహచరుడు అలెక్స్ ఆంథోని థర్డ్ లెగ్ రేసు మధ్యలో కండరాల గాయంతో వైదొలిగాడు. ఫైనల్ లెగ్లో బ్యాటన్ కోసం వేచిచూస్తోన్న అనస్ అదే సమయానికి థర్డ్ లెగ్ను పూర్తిచేసిన ‘బి’ జట్టు ఆటగాడు సాజన్ నుంచి బ్యాటన్ తీసుకొని పరుగు పెట్టాడు. దీంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. -
హర్భజన్, ద్యుతీ చంద్ నామినేషన్లు తిరస్కరణ!
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలకు భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్, టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్సింగ్ నామినేషన్లను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించింది. అర్జున అవార్డుకు ద్యుతీచంద్, ఖేల్రత్న అవార్డుకు హర్భజన్సింగ్ నామినేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. ‘ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తరువాత నామినేషన్లు దాఖలు చేయడంతో వారి పేర్లను తిరస్కరించారు. ముఖ్యంగా ద్యుతీ చంద్ విషయంలో గడువు ముగియడమే కాకుండా, ఆమె పతకాలు కూడా ర్యాంకింగ్ క్రమంలో లేవు. దీంతో మంత్రిత్వ శాఖ పతకాల ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వాలని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ)ను కోరింది. అయితే వచ్చిన నామినేషన్స్లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పేరును తిరస్కరించారు’ అని ఆ అధికారి చెప్పుకొచ్చారు. హర్భజన్ సింగ్ విషయానికి వస్తే దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 30 ఆఖరి తేదీ కాగా, పంజాబ్ ప్రభుత్వం రెండు నెలలు ఆలస్యంగా పంపించింది. ఇదిలా ఉంటే, తన నామినేషన్ తిరస్కరణకు గురవడంపై ద్యుతీ చంద్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిసింది. అనంతరం మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిశాను. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో నేను గెలిచిన స్వర్ణ పతాకాన్ని ఆయనకు చూపించాను. నా ఫైల్ను పంపించాలని కోరాను. దానికి ఆయన అర్జున అవార్డుకు నామినేషన్ను తిరిగి పంపిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే పోటీలకు సిద్ధమవ్వాలని సూచించారు. అర్జున అవార్డు అవకాశాన్ని ఇంకా కోల్పోలేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రాష్ట్రంలో ఎన్నికలు, తుఫాను వల్ల నా నామినేషన్ను ఆలస్యంగా పంపించినట్లు తెలుసు’’అని అన్నారు. -
ద్యుతీ యూఆర్ ట్రూ చాంపియన్: తెలుగు డైరెక్టర్
హైదరాబాద్ : అమ్మాయితో సహజీవనం చేస్తున్నాని ప్రకటించిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్పై టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రశంసలు కురిపించాడు. ద్యుతీ చంద్పై ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్.. ద్యుతీని కొనియాడాడు. అయితే మూడు రోజుల క్రితమే తన రిలేషన్ గురించి ద్యుతీ బాహటంగా ప్రకటించినప్పటికీ.. మూడేళ్ల క్రితమే ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు సదరు స్పోర్ట్స్ చానెల్ పేర్కొంది. ప్రేమకు జెండర్తో పనిలేదని, మనసులు కలిస్తే చాలని 2016లోనే ద్యుతీ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. అప్పటికి భారత్లో స్వలింగ సంపర్కం నేరమని, అయినా తన సహచర్యం గురించి తెలిపిందని ప్రస్తావించింది. ఆమె తన ఆట కోసం ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వివరించింది. ఈ కథనానికి ముగ్ధుడైన రాహుల్.. ట్విటర్ వేదికగా ద్యుతీని ఆకాశానికెత్తాడు. ఈ కథనం చాలా స్పూర్తిదాయకంగా ఉందని, ఆమె తనకు ఎదురైన సమస్యలను అధిగమించి పోటీలో నిలవడం గొప్ప విషయమని, ‘ద్యుతీ యూ ఆర్ ట్రూ చాంపియన్’ అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రాహుల్.. కింగ్ నాగర్జున హీరోగా మన్మథుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ అని తెలిసిందే. ఇక ద్యుతీ సహజీవనాన్ని ఆమె కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ద్యుతీ తల్లి, సోదరి మీడియా వేదికగా ఆమెను తప్పుబడుతూ కెరీర్ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్యుతీ మాత్రం ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తన ప్రియురాలితో బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. If you’re reading something today.. let it be this. Very very inspiring. Imagine all that this girl has had to go through before the tender age of 23. And yet she found the resolve to step out and compete. Uncommon courage. You’re a true champion @DuteeChand 🙏🏽🙏🏽🙏🏽 https://t.co/xmZuICXzM1 — Rahul Ravindran (@23_rahulr) May 22, 2019 -
మా అక్కే బ్లాక్మెయిల్ చేసింది: ద్యుతీ చంద్
భువనేశ్వర్ : బంధువైన ఓ టీనేజర్తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, బిడ్డలాంటి అమ్మాయితో సహజీవనం ఏంటని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ ప్రశ్నించగా.. ద్యుతీని భయపెట్టి, బ్లాక్మెయిల్ చేయడం వల్లే అలా మాట్లాడుతుందని ఆమె సోదరి సరస్వతి చంద్ ఆరోపించారు. అయితే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయిన ఈ విషయంలో వెనక్కు తగ్గే ముచ్చటే లేదని ద్యుతిచంద్ మరోసారి స్పష్టం చేసింది. తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంగళవారం మీడియాతో మాట్లాడింది. తనను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదని, తన అక్కనే రూ.25లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిందని బాంబుపేల్చింది. ‘నా సొంత అక్కనే నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. రూ. 25 లక్షలు ఇవ్వాలని నన్ను అడిగింది. ఇవ్వకపోవడంతో కొట్టింది కూడా. ఈ విషయంపై నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ మా అక్క బెదిరిస్తూనే ఉంది. దీంతోనే నేను నా బంధాన్ని నలుగురికి చెప్పుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ బాహటంగా స్వలింగ సహజీవనంపై పెదవి విప్పింది. బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ ‘ద్యుతీ చంద్ ప్రమాదంలో ఉంది’ -
బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్
న్యూఢిల్లీ : బంధువైన ఓ టీనేజర్తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత రన్నర్ ద్యుతీ చంద్పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్యుతీని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి అలా చెప్పించారని ఆమె సోదరి ఆరోపించగా.. గే సెక్స్ను అంగీకరించేది లేదని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ కరాఖండిగా చెప్పారు. ద్యుతీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాకు మనవరాలు అవుతుంది. నా మేనకోడలు కూతురు ఆమె. ఆ అమ్మాయికి ద్యుతీ తల్లిలాంటిది. అలాంటి ఆమెతో పెళ్లి ఎలా సాధ్యమవుతోంది. ఇది ఒడిశా సమాజం ఎలా అంగీకరిస్తోంది. ఈ బంధాన్ని అంగీకరించనని ద్యుతీకి నేను గట్టిగా చెప్పాను. దీనికి ఆమె హైకోర్టు అనుమతిచ్చిందని తెలిపింది. నేను బతికుండాగానే నీవు కోర్టు ఆదేశాలు పాటిస్తున్నావా?అని అడిగాను. దీనికి అవును.. కోర్టు అనుమతి ఉంది. నీవు సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు.. నాకు సహాయక సిబ్బంది మద్దతు ఉందని పేర్కొంది. నేను ఏవరు సపోర్ట్ చేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె వారి మద్దుతుతో ఏమైనా చేస్తానని చెప్పింది. నేను వారితో ఒకసారి మాట్లాడుతానని చెప్పాను. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో నేను నా పెద్ద కూతురిని వారి దగ్గరకు తీసుకెళ్లమన్నాను. మేం వారి దగ్గరికి వెళ్లేసరికే వారు అక్కడ లేరు. ద్యుతీ ఆటపై దృష్టి పెట్టడమే నాకు ప్రభుత్వానికి కావాల్సింది. దేశం కోసం ఆడుతున్న ద్యుతీకి రాష్ట్ర ప్రభుత్వం చాలా డబ్బు ఇచ్చింది. ద్యుతీ వారి తల్లిదండ్రుల పేరు నిలబెట్టకపోయినా పర్లేదు.. కానీ తన ఆటద్వారా దేశ గౌరవాన్ని మాత్రం కాపాడాలి.’ అని అఖోజీ చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ తమ గ్రామం మాత్రం ఇలాంటి బంధాలను అంగీకరించదని ద్యుతీ బంధువు ఒకరు అభిప్రాయపడ్డారు. అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ -
‘ద్యుతీ చంద్ ప్రమాదంలో ఉంది’
న్యూఢిల్లీ: ఓ టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు భారత మహిళా రన్నర్ ద్యుతీ చంద్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సహజీవనంపై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్గా ద్యుతీ నిలిచింది. ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా ఆమె చెప్పింది. ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని బాహాటంగానే వెల్లడించింది. తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, తనను ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించిందని వెల్లడించింది. ఆమె అన్నట్లుగానే ద్యుతీ సోదరి సరస్వతీ చంద్ మీడియా వేదికగా ద్యుతీ సహజీవనాన్ని వ్యతిరేకించింది. ద్యుతీ చంద్ను ఆ అమ్మాయి, వారి కుటింబీకులు బెదిరించారని, పెళ్లిచేసుకోవాలని బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాకుండా ఆమె ఆస్తిపై కన్నేశారని, ద్యుతీని ఆట నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంతో ద్యుతీ జీవితం ప్రమాదంలో పడిందని అథ్లెట్ అయిన సరస్వతీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాదంలో ఉన్న తన సోదరికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరింది. ద్యుతీ బంధానికి మద్దతుగా నిలుస్తారా? అన్న ప్రశ్నకు .. ‘అమె అడల్ట్. ఏ నిర్ణయమైనే తీసుకునే హక్కు ద్యుతీకి ఉంది. అబ్బాయా? అమ్మాయా? ఎవరినైనా ఆమె ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకరు బలవంతం పెట్టడం వల్ల ద్యుతీ ఇదంతా మాట్లాడుతుంది. ద్యుతీ విజయం కోసం కృషి చేసిన వారంత ఆమెకు ఇప్పుడు ఆపరాధులుగా కనిపిస్తున్నారు. 2020 ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్లపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ద్యుతీ ఇరుక్కుంది. ఆమె విజయాలు సాధించినప్పుడు ద్యుతీతో పాటు కుటుంబసభ్యులు మన్ననలు పొందారు. పిల్లలు విజయాలు సాధిస్తే వారితో పాటు వారి తల్లిదండ్రులకు పేరు వస్తుంది. అదే తప్పుచేస్తే.. కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.’ అని సరస్వతి ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ -
ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నా : ద్యుతీచంద్
భువనేశ్వర్ : తన స్నేహితురాలితో రిలేషన్షిప్లో ఉన్నానంటూ భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన ప్రకటన చేశారు. తద్వారా స్వలింగ సంపర్కురాలిననే విషయాన్ని బయటపెట్టిన తొలి భారత అథ్లెట్గా నిలిచారు. ఒడిశాలోని తన సొంత గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో జీవితాన్ని పంచుకోబోతున్నట్టు పేర్కొన్న ద్యుతీ.. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేనన్నారు. ఈ విషయం గురించి ద్యుతి మాట్లాడుతూ.. ‘ నా సోల్మేట్ను కనుగొన్నాను. తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. ప్రేమను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది(సెక్షన్ 377ను ఉద్దేశించి). అథ్లెట్ను అయినంత మాత్రాన నా నిర్ణయాన్ని ఎవరూ జడ్జ్ చేయాల్సిన పనిలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా. గత పదేళ్లుగా స్ప్రింటర్గా భారత్కు ఎన్నో విజయాలు అందించాను. మరో ఐదేళ్ల దాకా రాణిస్తాననే నమ్మకం ఉంది. నా క్రీడా ప్రయాణానికి సహకరిస్తూ.. జీవితాంతం తోడుండే వ్యక్తిని ఎంచుకున్నా. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్షిప్, ఒలంపిక్ క్రీడలపైన దృష్టి సారించాను. ఆటల నుంచి విరామం తీసుకున్న తర్వాత పూర్తి సమయం తనకే కేటాయించి.. జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని పేర్కొంది. కాగా పేదరికాన్ని జయించి ‘ట్రాక్’ బాట పట్టిన ద్యుతిలో పురుషత్వ లక్షణాలున్నాయని నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా కలత చెందిన ఈ ఒడిషా అథ్లెట్ ఆర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది. ఇక గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజతాలు నెగ్గిన సంగతి తెలిసిందే. సెక్షన్ 377..సంచలన తీర్పు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. -
చిత్ర పసిడి పరుగు
దోహా (ఖతర్): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో చివరి రోజు కూడా భారత అథ్లెట్స్ పతకాల పంట పండించారు. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఆఖరి రోజు భారత అథ్లెట్స్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా భారత్కు ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు లభించాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 1500 మీటర్ల విభాగంలో చిత్ర ఉన్నికృష్ణన్ స్వర్ణం సాధించింది. ఈ పోటీల్లో భారత్కు లభించిన మూడో పసిడి పతకమిది. 1500 మీటర్ల రేసును చిత్ర 4 నిమిషాల 14.56 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫినిషింగ్ లైన్కు కొన్ని మీటర్ల దూరంలో చిత్ర బహ్రెయిన్ అథ్లెట్ గషా టైగెస్ట్ను దాటి ముందుకెళ్లింది. మహిళల 200 మీటర్ల విభాగంలో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ 23.24 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఎడిడియోంగ్ ఒడియోంగ్ (బహ్రెయిన్) కూడా 23.24 సెకన్లలోనే గమ్యానికి చేరినా ఫొటోఫినిష్లో ద్యుతీ చంద్కు కాంస్యం ఖాయమైంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రాచి, పూవమ్మ రాజు, సరితాబెన్ గైక్వాడ్, విస్మయలతో కూడిన భారత బృందం 3ని:32.21 సెకన్లలో రేసును ముగించి రజత పతకం గెల్చుకుంది. పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ 3ని:43.18 సెకన్లలో గమ్యానికి చేరి రజతం సాధించాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో కున్హు మొహమ్మద్, జీవన్, అనస్, అరోకియా రాజీవ్లతో కూడిన భారత బృందం 3ని:03.28 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతం కైవసం చేసుకుంది. అయితే రేసు సందర్భంగా మూడో ల్యాప్లో చైనా అథ్లెట్ను భారత అథ్లెట్ అనస్ నిబంధనలకు విరుద్ధంగా ఢీకొట్టడంతో నిర్వాహకులు భారత జట్టుపై అనర్హత వేటు వేసి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో నవజీత్ కౌర్ (57.47 మీటర్లు) నాలుగో స్థానంలో... కమల్ప్రీత్ కౌర్ (55.59 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు. పురుషుల 5000 మీటర్ల రేసులో మురళి ఐదో స్థానంలో, అభిషేక్ ఆరో స్థానంలో నిలిచారు. -
ద్యుతీ చంద్కు స్వర్ణం
పాటియాలా: ఫెడ రేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆసియా చాంపియన్షిప్కు అర్హత టోర్నమెంట్గా నిర్వహించిన ఈ టోర్నీ లో ద్యుతీ స్వర్ణాన్ని గెలుచుకుంది. సోమవారం జరిగిన 100మీ. పరుగును ద్యుతీ అందరికన్నా ముందుగా 11:45 సెకన్లలోనే ముగించి విజేతగా నిలిచింది. కానీ ఈ విభాగంలో ఆసియా చాంపియన్షిప్ అర్హత ప్రమాణాన్ని (11:40 సె.) ఆమె అందుకోలేకపోయింది. 100మీ. పరుగులో ఆమె విఫలమైనప్పటికీ... 200మీ. పరుగులో ద్యుతీ ఆసియా చాంపియన్షిప్ బెర్తును సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ దగ్గర ద్యుతీ శిక్షణ పొందుతోంది. -
ద్యుతీ... పరుగు, పయనంపై పుస్తకం
భారత స్ప్రింట్ స్టార్ ద్యుతీచంద్ పరుగు పోరాటం త్వరలో పుస్తక రూపంలో రానుంది. జర్నలిస్ట్ సందీప్ మిశ్రా ఆమె ఆత్మకథను రాస్తున్నట్లు వెల్లడించారు. పేదరికాన్ని జయించి ‘ట్రాక్’ బాట పట్టిన ఆమెలో పురుషత్వ లక్షణాలున్నాయని నిషేధం విధించడంతో ఈ ఒడిషా అథ్లెట్ ఆర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది. తర్వాత అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల కోసం పోరాడుతోంది. చెమట చిందించిన ఆమె పరుగు... పయనం... వచ్చే ఏడాది పుస్తకంగా రానుంది. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజతాలు నెగ్గింది. -
జీవితంలో కష్టాలు.. మైదానంలో బంగారాలు
నిన్నటితో ‘దంగల్’ ముగిసింది. దంగల్ అంటే.. తెలిసిందే, కుస్తీ! పతకం కోసం కుస్తీ.. పరువు కోసం కుస్తీ.ఊరికే కుస్తీ పడితే పతకం వస్తుందా? పరువు పతాకమై ఎగురుతుందా?! ప్రత్యర్థిని పడగొట్టాలి.. విజేతగా.. నిలబడాలి! ఈసారి ఏషియన్ గేమ్స్లో.. అమ్మాయిలదే దంగల్ అంతా! అది కాదు విషయం.. జీవితంతో కుస్తీ పడి వచ్చినవాళ్లే అంతా! లేమి లోంచి మెరిసిన ఈ మేలిమి బంగారాలు ఇప్పుడు మన దేశానికి.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్లను మించిన త్రివర్ణ ‘పతకాలు’!! 2018, జకార్తా ఏషియన్ గేమ్స్.. మన అమ్మాయిల దమ్ము చూపించింది. దుమ్ము రేపింది! ఈ ఆటల్లో మెడల్స్ సాధించిన చాలామంది అమ్మాయిలు కలిమిలోంచి వచ్చినవాళ్లు కాదు. మధ్యతరగతి, ఇంకా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. ఆర్థిక బాధ్యతలను పంచుకుంటూ ఇంటి పరువునే కాదు, దేశ కీర్తినీ మోస్తున్న క్రీడాబలులు. జీవితంలోని హార్డిల్స్నూ అదే స్పిరిట్తో దాటుతున్న ఆ చిరుతలు తమ గెలుపుతో ప్రభుత్వ కర్తవ్యాన్నీ గుర్తుచేస్తున్నారు. మైదానంలో మాణిక్యాలు వినేశ్ ఫోగత్, చిత్రా ఉన్నికృష్ణన్, స్వప్నా బర్మన్, ద్యుతి చంద్, మలప్రభ జాధవ్, దివ్యా కక్రన్, హిమాదాస్, సరితాబెన్ లక్ష్మణ్ గైక్వాడ్, హర్షితా తోమర్, పింకీ బల్హారా.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం! వినేశ్ ఫోగత్.. ఈ గేమ్స్లో మనదేశ మహిళా రెజ్లర్ల బలం చూపించింది.. 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించి! ఆమె మహావీర్ సింగ్ ఫోగత్కు స్వయానా తమ్ముడి బిడ్డ. మహావీర్ కూతుళ్లు గీత, బబితాలతో సమానమైన కుస్తీ మెళకువలున్నా గ్లాస్గో, స్కాట్లాండ్ కామన్వెల్త్ గేమ్స్లో విజయం సాధించినా పెద్దనాన్న పంచన నీడగానే ఉండిపోయింది. ఈసారే ఫోగత్ అనే ఇంటిపేరుతోనే కాక వినేశ్ అనే బంగారం కాంతితో మీడియాలో బ్యానర్ అయింది. వినేశ్ ఫోగత్కు అయిదేళ్లున్నప్పుడే తండ్రి రాజ్పాల్ ఫోగత్ చనిపోయాడు. ఫోగత్కు ఒక చెల్లి, తమ్ముడు. తల్లే ఆ ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. తర్వాత వినేశ్ను మహావీర్ ఫోగత్ దత్తత తీసుకున్నాడు. తన బిడ్డలతోపాటుగా వినేశ్కూ కుస్తీ నేర్పాడు. పెళ్లి చేసి పంపకుండా ఆడపిల్లలకు కుస్తీపట్టడం నేర్పిస్తున్నాడు అంటే అత్తింట్లో జుట్టుపట్టుకొని పోట్లాడమనా అంటూ ఊరి (భివాణి, హర్యానా) పెద్దలు, కులస్థులు హేళన చేశారు, వెలివేశారు. అయినా ఫోగత్ పట్టుబట్టి ఆడపిల్లలను కుస్తీ వీరులుగా తయారు చేశాడు. అలా బతుకు యుద్ధాన్నీ నేర్చుకుంది వినేశ్. వాటిన్నిటినీ రింగ్లో ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రయోగిస్తోంది వినేశ్! చిత్రా ఉన్నికృష్ణన్ స్టోరీ సింపులేం కాదు.. కేరళలోని పాలక్కాడ్ జిల్లా, మందూరు ఆమె స్వస్థలం. చిత్రకు ఊహ తెలిసేటప్పటికే ఆకలి కడుపుతోనే ఆడుకోవడం అలవాటైంది. ఆమె తల్లిదండ్రులు కూలీలు. ఇద్దరూ కష్టడితేనే ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబానికి రెండు పూటలా తిండి దొరికేది. అర్ధాకలితో నిద్ర పోయిన రోజులే ఎక్కువ. పొట్టలో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకొని రాత్రంతా కంటికి మీద కునుకుకు దూరం చేసినా పొద్దున్నే అయిదున్నరకల్లా తను చదువుకునే సర్కారు బడిలోని గ్రౌండ్కు పరుగెత్తేది. ఆ పట్టుదలే మొన్నటి ఏషియన్ గేమ్స్లో బ్రౌంజ్ మెడల్ వచ్చేలా చేసింది. ఆకలిని జయించింది. ఆత్మవిశ్వాసంతో విధిరాతను మార్చుకుంది. ఇప్పుడు ఒలింపిక్స్లో జయమే ధ్యేయంగా ప్రాక్టీస్ను ట్రాక్లో పెడుతోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన స్వప్న బర్మన్.. హెపథ్లాన్లో బంగారు పథకం సాధించింది. ఈ అమ్మాయి కూడా పేదరికం ఫ్రెండ్షిప్తోనే పెరిగింది. తండ్రి పంచన్ బర్మన్ ఆటోడ్రైవర్. తల్లి బసనా టీ జల్పాయ్గురిలోని టీ ఎస్టేట్లో కూలీ. స్వప్నకు గోల్డ్మెడల్ వచ్చిందని తెలియగానే ఒక విషయాన్ని తలుచుకొని ఆ అమ్మ కంటతడి పెట్టింది. ‘‘అథ్లెట్స్కి బలమైన తిండి పెట్టాలి. పౌష్టికాహారం కాదు కదా నా బిడ్డకు కడుపునిండా కూడా తిండిపెట్టలేదు నేను’’ అంటూ! అయినా ఆ అమ్మాయి అమ్మ మీద అలగలేదు. నాకీ పరిస్థితి ఏంటీ అని కాళ్లు నేలకేసి కొట్టలేదు. ఆకలితో పరుగుపందెం పెట్టుకుంది. దానికి ఎప్పటికీ దొరకనంత దూరానికి వచ్చేసింది. ఒడిషా అమ్మాయి ద్యుతి చంద్కు హండ్రెడ్ మీటర్స్ రేస్లో సిల్వర్ మెడల్ వచ్చింది. మెడల్స్కన్నా టఫ్గేమ్ అయిన ఆత్మబలాన్ని దెబ్బతీసే సమస్యతో పోరాడి గెలిచింది ఆమె ఆ సక్సెస్ ముందు ఈ పథకాలు చిన్నవే. కాని ఆడడానికే ఆ పోరు నెగ్గింది కాబట్టి ఈ విజయం ద్యుతికి అమూల్యమైనదే. చేనేత కార్మికుల ఇంట ఏడుగురు సంతానంలో మూడో అమ్మాయిగా పుట్టింది ద్యుతి. ఆమె బాల్యమూ గొప్పగా ఏమీ గడవలేదు. అక్క సరస్వతి.. నేషనల్ లెవెల్ అథ్లెట్. ఆమె స్ఫూర్తితోనే ద్యుతి కూడా అథ్లెట్ అయింది. పదిహేడేళ్లకే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. విజయపరంపరతో దూసుకెళ్తున్న ద్యుతి లండన్ ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉండింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్యుతి మీద వైద్య పరీక్షలు మొదలుపెట్టింది కారణం ఆమెకు చెప్పకుండానే. చివరకు ‘జెండర్ టెస్ట్’లో ఫెయిల్ అయినందుకు ఒలిపింక్స్లో పాల్గొనే చాన్స్ లేదని, నేషనల్ ఛాంపియన్షిప్ కూడా వదులుకోవాలని చెప్పారు ఆమెతో. ఆ మాట ఆమెను అచేతనం చేసింది. జెండర్టెస్ట్లో ఫెయిలవడానికి దారితీసిన ఆమె శారీరక పరిస్థితిని హైపర్ఆండ్రోనిజమ్ అంటారు. సాధారణ మహిళల్లో ఉండే కంటే ఎక్కువ పాళ్లలో ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హర్మోన్లు ఆమె శరీరంలో ఉన్నాయి. ఈ స్థితిలో ఆమె స్త్రీలకు సంబంధించిన అథ్లెట్స్లో పాల్గొనే అవకాశం లేదు. ఆమెకు రెండే దారులు. ఒకటి.. ఆటలకు శాశ్వతంగా దూరం కావడం, రెండు.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్లి ఆండ్రోజెన్ హర్మోన్ లెవెల్స్ను తగ్గించుకోవడం. అయితే ద్యుతి మూడో ఆప్షన్ను ఎన్నుకుంది. అలాంటి టెస్ట్కు వ్యతిరేకంగా పోరాడాలని. తనకు ఎదురైంది ఇంకే అమ్మాయికి ఎదురు కావద్దని. గెలిచింది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఆమెది గెలుపు దారే! మలప్రభా జాధవ్.. రైతు బిడ్డ. కర్ణాటకలోని తుర్మూరు ఆమె జన్మస్థలం. జూడో కేటగిరీ కురాష్లో కాంస్య పథకం సాధించింది. ‘‘కురాష్ అనే ఒక ఆట ఉంటుందని కూడా నాకు తెలియదు. అమ్మాయిలకు ఈ ఆట వస్తే చాలా మంచిది. మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉంది. నేర్పించండి అని కోచ్ చెబితే సర్లే స్కూల్లోనే కదా నేర్పిస్తున్నారు అని చేర్పించా’’ అన్నాడు మలప్రభ తండ్రి యెల్లప్ప జాధవ్. ఇప్పుడు కూతురు మెడల్ కొట్టిందని తెలియగానే ఆయన ఆనందానికి అంతులేదు. అన్నట్టు మలప్రభ తుర్మూరు పక్కనుంచే పారే ఒక నది. ఆ పేరే కూతురికి పెట్టుకున్నాడు యెల్లప్ప. తగ్గట్టుగానే ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది మలప్రభ. దివ్యాకక్రన్.. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల రెజ్లింగ్ పోటీల్లో బ్రౌంజ్ మెడల్ తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టిపెరిగిన దివ్యా దిగివ మధ్యతరగతి కుటుంబం. నాయి సామాజికవర్గం. తల్లి లంగోటాలు కుడితే.. తండ్రి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర వసతులతో అడ్జస్ట్ అవుతూ స్పోర్ట్స్లో సత్తా చూపుతోంది దివ్యా. స్పోర్ట్స్కోటాలోనే నోయిడా కాలేజ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచలర్స్ డిగ్రీ చేస్తోంది. హిమాదాస్.. జకార్తా ఏషియన్ గేమ్స్ కన్నా ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన అథ్లెట్. అస్సాంలోని నాగోన్ జిల్లా, కంధులిమరి అనే ఊళ్లో పుట్టింది. తండ్రి రొంజిత్ దాస్, జొనాలి దాస్ తల్లిదండ్రులు. రైతులు. అయిదుగురు పిల్లల్లో ఆఖరు సంతానం హిమాదాస్. ఈశాన్య రాష్ట్రాలంటే మిగతా దేశానికి ఉన్న చిన్నచూపు, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొంది హిమా. ముందు ఫుట్బాల్ అంటే ఆసక్తి చూపింది. బాగా ఆడేది కూడా. కాని మన దగ్గర ఫుట్బాల్ పట్ల అనాదరణ, అసలు మహిళా టీమ్ అన్న జాడే లేకపోవడంతో అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది. విజయాల ట్రాక్ మీద ఉరుకుతూ మొన్నటి ఏషియన్ గేమ్స్లో మహిళల 400 మీటర్స్ డెస్టినేషన్లో సిల్వర్ సాధించింది. సరితాబెన్ లక్ష్మణ్భాయి గాయక్వాడ్.. గుజరాత్కు చెందిన ట్రైబల్ గర్ల్. దుగా జిల్లాలోని ఖరాది అంబ స్వగ్రామం. పేదింటి పిల్ల. ఏషియన్గేమ్స్లో పాల్గొనేందుకు అరకొర డబ్బుల్తోనే జకార్తా వచ్చింది. డబ్బు సరిపోవట్లేదని గుజరాత్లో తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్లు డబ్బు పంపారు. ఈ గేమ్స్లో 4 ఇంటూ 400 రిలేలో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. పింకీ బల్హారా... ఢిల్లీ అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. జూడో అంటే ఇష్టం. ఈ ఏషియన్ గేమ్స్లో కురాష్లో రజత పథకం సాధించింది. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచీ హార్డిల్సే. ఉమ్మడి కుటుంబంలో కజిన్ చనిపోయాడు. ఆ తర్వాత హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. ఆ విషాదాన్ని పిడికిలిలో బిగించి రింగ్లోకి వచ్చింది. కొడుకు పోయాడన్న దిగులుతో పింకీ తాత (తండ్రి తండ్రి) చనిపోయాడు. ఈ విషయాన్ని పింకీకి చెప్పకుండా దాచారు ఇంట్లోవాళ్లు. ఆమె పోటీలో నెగ్గాక విషయం చెప్పారు. పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువన పెట్టి పథకం తెచ్చింది. కూతురికి తోడుగా జకార్తా వెళ్లాలనుకున్నాడు పింకీ వాళ్ల నాన్న. ఆమె గెలుపు చూడకుండానే వెళ్లిపోయాడు. కండబలంతో మైదానాన్ని ఓడిస్తూ .. గుండెబలంతో జీవితాన్ని విన్ అవుతున్నారు వీళ్లంతా! బతుకు పోడియం ఎక్కి సమాజం సృష్టించిన తారతమ్యాలు తలదించుకునేలా చేస్తున్నారు. ఈ సామర్థ్యాన్ని ఇంకా పరీక్షించొద్దు. ఈ ప్రతిభకు ఇంకా పోటీలు పెట్టొద్దు. ఎన్ని అడ్డంకులున్నా దీక్షకు అడ్డురావని చూపారు. ఆటలు అనగానే ఒక సానియా, ఒక సైనా.. ఒకే ఒక సింధు కాదు.. ఏషియన్ గేమ్స్లో ఇండియా జెండా ఎగరేసిన చాలామంది క్రీడాకారిణులున్నారు. స్పాన్సర్షిప్స్కు ఒక టెన్నిస్.. ఇక స్వా్కషే కాదు.. అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. ఆటలను గ్లామర్ హంగులతో కాదు... స్పోర్టివ్ స్పిరిట్తో చూద్దాం! వీళ్ల జీవితాలను ట్రాక్ మీదకు తెద్దాం! – సరస్వతి రమ -
ద్యుతీకి మరో రజతం
భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని సాధించింది. మహిళ 200 మీటర్ల పరుగులో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ రేసును ద్యుతీ 23.20 సెకన్లలో పూర్తి చేసింది. ఎడిడియాంగ్ ఒడియాంగ్ (బహ్రెయిన్– 22.96 సె.), వీ యోంగ్లీ (చైనా –23.27 సె.) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆదివారమే ద్యుతి 100 మీటర్ల స్ప్రింట్లో కూడా రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకే ఏషియాడ్లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు గెలిచిన నాలుగో అథ్లెట్గా చరిత్రకెక్కింది. అంతకుముందు పీటీ ఉష 1986 సియోల్ ఏషియాడ్లో 200 మీ., 400 మీ. పరుగులు, 400 మీ. హర్డిల్స్, 4గీ400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచింది. జ్మోతిర్మయి సిక్దర్ 1998లో 800 మీ., 1500 మీ. పరుగులో, సునీతా రాణి 2002లో 1500 మీ., 5 వేల మీ. పరుగులో పతకాలు గెల్చుకున్నారు. -
ద్యుతీచంద్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ శిష్యురాలు ద్యుతీచంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గువాహటిలో జరుగుతున్న జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆమె సెమీఫైనల్ రేసును 11.29 సెకన్లలో గమ్యానికి చేరింది. 11.30 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. ఫైనల్లో ద్యుతీచంద్ 11.32 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా క్రీడలకు కూడా అర్హత సాధించింది. -
ద్యుతీ చంద్కు స్వర్ణం
పాటియాలా: ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచింది. ఆమె 11.60 సెకన్లలో గమ్యానికి చేరింది. ద్యుతీకి తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అథ్లెట్ నిత్య (12.10 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 100 మీటర్లలో శివ కుమార్ (తమిళనాడు–10.43 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ వంశీ ప్రవీణ్ (10.71 సెకన్లు) ఏడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. -
మహిళల 100 మీటర్ల రేసులో ద్యుతీచంద్కు స్వర్ణం
స్వదేశీ అథ్లెట్ల మధ్య నిర్వహిస్తున్న ఇండియన్ గ్రాండ్ప్రి–1 అథ్లెటిక్స్ మీట్లో ఒడిశా స్టార్ క్రీడాకారిణి ద్యుతీచంద్ స్వర్ణ పతకాన్ని సాధించింది. పాటియాలాలో మంగళవారం జరిగిన మీట్లో ద్యుతీ... 100 మీటర్ల దూరాన్ని 11.57 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచింది. ప్రస్తుతం ద్యుతీచంద్ తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఇదే మీట్లో పురుషుల జావెలిన్ త్రోలో ఆసియా చాంపియన్ నీరజ్ చోప్రా పసిడి పతకం గెలిచాడు. అతను జావెలిన్ను 82.88 మీటర్ల దూరం విసిరాడు. -
ఆడకూడదా?
అధ్యయనం టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉన్న స్త్రీలు క్రీడలలో సాటి స్త్రీల కంటే ఎక్కువ శక్తిని ప్రదర్శించ గలరని నిరూపిస్తున్న తాజా అధ్యయనం ద్యుతీ చంద్ వంటి క్రీడాకారిణుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది! ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న భారత అథ్లెట్ ద్యుతీచంద్కు ఇది నిజంగా షాకింగ్ వార్తే...! గతంలో తాను ఎదుర్కొన్న లింగ నిర్ధారణ కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె శరరీంలోని పురుష హార్మోన్ల మద్దతుతోనే తను ఇతరులకన్నా ఎక్కువ లాభపడుతోందని గతంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఏఏఎఫ్) ద్యుతీని నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలతో క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏసీ)ను ఆశ్రయించాలని ఐఏఏఎఫ్ నిర్ణయించింది. ద్యుతీ చంద్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), ఐఏఏఎఫ్ మధ్య సాగిన ఈ వివాదాస్పద కేసు రెండేళ్ల క్రితం సీఏఎస్ ముందుకు వచ్చింది. అప్పట్లో విచారణ జరిపిన సీఏఎస్ 2015, జూలై 27న ద్యుతీపై ఐఏఏఎఫ్ విధించిన నిషేధాన్ని రెండేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు ఇచ్చే వరకు తను పోటీల్లో పాల్గొనవచ్చని సీఏఎస్ చెప్పడంతో ఊరట చెందిన ద్యుతి... అప్పటి నుంచి యథావిధిగా పోటీల్లో పాల్గొంటోంది. అయితే ఈ నెలలోనే రెండేళ్ల గడువు ముగియనుండడంతో ఐఏఏఎఫ్ మరోసారి ద్యుతిపై పోరాటానికి సిద్ధమవుతోంది. హైపరాండ్రోజెనిక్ హార్మోన్లు కలిగిన మహిళా అథ్లెట్లు మామూలు టెస్టోస్టిరాన్ స్థాయి కలిగిన వారితో పోల్చితే భిన్నంగా ఉంటారని ఐఏఏఎఫ్ తన నివేదికలో పేర్కొననుంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయా అథ్లెట్స్ వివిధ పోటీల్లో 1.8 శాతం నుంచి 4.5 శాతం వరకు ఇతర మహిళా అథ్లెట్లకన్నా ఎక్కువ ఫలితం పొందగలరని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించిన ఆర్టికల్ను ఐఏఏఎఫ్ సాక్ష్యంగా పేర్కొననుంది. గతంలో జరిగిందిదీ... ఉండాల్సిన స్థాయికన్నా అధికంగా పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నట్టు పరీక్షలో తేలడంతో ఐఏఏఎఫ్ హైపరాండ్రోజెనిజమ్ పాలసీ ప్రకారం 2014లో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ద్యుతీచంద్పై వేటు వేసింది. అయితే ఏఎఫ్ఐపై ఆ ఏడాది సెప్టెంబర్లో ఆమె సీఏఎస్లో సవాల్ చేసింది. ఈ విషయంలో ద్యుతికి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థికంగా సహాయం కూడా అందింది. అయితే ఆమెలో పురుష హార్మోన్లు ఇతరులకన్నా అధికంగా ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు 2015 జూలై 27న మధ్యంతర తీర్పునిచ్చి ఊరట కలిగించింది. -
ద్యుతీ 'పరుగు' ముగిసింది!
రియో డీ జనీరో:దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన స్ప్రింటర్ ద్యుతీచంద్.. రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ రేసుకు క్వాలిఫై కావడంలో విఫలమైంది. తొలి రౌండ్ లో భాగంగా భారతకాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల రేసులో ద్యుతీ చంద్ ఏడో స్థానంలో నిలిచి రియో నుంచి నిష్క్రమించింది. హీట్ -5లో జరిగిన ఈ రేసును ద్యుతీచంద్ 11.69 సెకెండ్లలో ముగించి సెమీస్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఒక్కో హీట్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే సెమీస్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో భారత పెట్టుకున్న ఆశలకు ఆదిలోనే బ్రేక్ పడింది. అంతకుముందు పురుషుల 400 మీటర్ల ఈవెంట్లో భారత స్ప్రింటర్ మొహ్మద్ అనాస్ కూడా నిరాశపరిచాడు. ఈ రేసును 45. 95 సెకెండ్లలో పూర్తి చేసి ఆరోస్థానంలో నిలవడం ద్వారా సెమీస్కు అర్హత సాధించడంలో విఫలం చెందాడు. మరోవైపు లాంగ్ జంప్లో అంకిత్ శర్మ సైతం నిరాశపరిచాడు. ఈ ఈవెంట్లో 24వ స్థానంలో నిలిచిన అంకిత్ తదుపరి రౌండ్కు అర్హత సాధించలేకపోయాడు. -
ద్యుతీకి ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహకం
► ద్యుతీచంద్కు రూ. 10 లక్షలు భువనేశ్వర్: స్ప్రింటర్ ద్యుతీ చంద్తో సహా రియో ఒలింపిక్స్కు అర్హత పొందిన తమ అథ్లెట్లకు ఒడిశా ప్రభుత్వం తలా రూ. 10 లక్షల ప్రత్యేక ప్రోత్సహకాన్ని ప్రకటించింది. ఒడిశా నుంచి ఇద్దరు స్ప్రిం టర్లు, నలుగురు హాకీ క్రీడాకారిణిలు రియోకు అర్హత సాధించారు. స్ప్రింటర్ శర్బానీ నందా, హాకీ ప్లేయర్లు దీపా, నమితా, లిలిమా, సునీతా లక్రా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (ఓఎమ్సీ) కూడా తలా రూ. 10 లక్షల పురస్కారాన్ని అందజేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
చివర్లో వేగంపైనే దృష్టి: ద్యుతీ చంద్
బెంగళూరు: రేసు చివర్లో తన వేగాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ చెప్పింది. ముఖ్యంగా ఆఖరి 40 మీటర్లలో వేగం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిసారించానని తెలిపింది. ‘తొలి 60 మీటర్లలో నా వేగం బాగుంది. కానీ చివరికి వచ్చేసరికి వేగం మందగిస్తోంది. ఇప్పుడు ఆ వేగాన్ని కూడా మెరుగుపర్చుకోవాలి. దాని కోసం బాగా శ్రమిస్తున్నా. మా కోచ్ రమేశ్ సర్ కూడా దీనిపై ఎక్కువగా దృష్టిపెట్టారు’ అని ద్యుతీ పేర్కొంది. కాలం మారుతున్న కొద్దీ ఒలింపిక్స్లో పతకం నెగ్గడం అంత సులువు కాదని వెల్లడించింది. అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపడుతున్నా... పోటీ బాగా పెరిగిపోయిందని ఈ ఒడిషా అథ్లెట్ వెల్లడించింది. గతేడాది బీజింగ్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో విక్టోరియా జైబికినా (కజకిస్తాన్)తో పోటీపడటం తనకు బాగా కలిసొచ్చిందని చెప్పింది. మరోవైపు ద్యుతీలో పోరాట స్ఫూర్తి అమోఘమని ఆమె కోచ్ నాగపూరి రమేశ్ అన్నారు. జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చాయన్నారు. తన 20 ఏళ్ల కోచింగ్ కెరీర్లో ద్యుతీలాంటి అథ్లెట్ను చూడలేదని చెప్పిన కోచ్.. శిక్షణ కంటే పోటీల్లో బరిలోకి దిగడాన్నే ద్యుతీ ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పారు. -
ద్యుతీ...మన చిరుత
► 100 మీటర్లలో ద్యుతీ చంద్కు రియో బెర్త్ ► 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ విభాగంలో ► బరిలోకి భారత క్రీడాకారిణి ► పీటీ ఉష తర్వాత మొదటి క్రీడాకారిణి ఒలింపిక్స్కు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక చాలా మంది ఆశీర్వాదాలు ఉన్నాయి. గతేడాది చాలా కష్టాలు పడ్డా. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. నా శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించింది. కోచ్ రమేశ్ అండ లేకపోతే ఇది సాధ్యమయ్యేదికాదు. నాకు మద్దతుగా నిలిచిన సాయ్, క్రీడాశాఖ, అథ్లెటిక్స్ సమాఖ్యలకు కృతజ్ఞతలు. దేశానికి పతకం తెచ్చేందుకు మరింత శ్రమిస్తా. - ద్యుతీ న్యూఢిల్లీ: కష్టాల కడలిని... కన్నీళ్ల సంద్రాన్ని కనురెప్ప దాటనీయకుండా పోరాటం చేసిన భారత అథ్లెట్ ద్యుతీ చంద్... మన అథ్లెటిక్స్లో కొత్త చరిత్ర సృష్టించింది. సౌకర్యాలు కరువైనా... ఆర్థికంగా అండలేకపోయినా... పట్టుదలనే పెట్టుబడిగా పెట్టి ట్రాక్పై సంచలనాలు సృష్టించేలా పరుగెత్తిన ఈ ఒడిషా అమ్మాయి ప్రతిష్టాత్మక ‘రియో ఒలింపిక్స్’కు అర్హత సాధించింది. కజకిస్తాన్లో శనివారం జరిగిన ‘కొసనోవ్ మెమోరియల్’ మీట్లో భాగంగా జరిగిన మహిళల 100 మీటర్ల హీట్స్ను ద్యుతీ 11.30 సెకన్లలో ముగించింది. ఒలింపిక్ కటాఫ్ టైమ్ (11.32 సెకన్లు) కంటే 0.2 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరడంతో రియో టికెట్ ఖాయమైంది. ఫలితంగా దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత 100 మీటర్ల పరుగులో భారత క్రీడాకారిణి ఒలింపిక్స్కు అర్హత సాధించింది. అంచనాలకు మించి రాణించిన ద్యుతీ ఫెడరేషన్ కప్లో తాను నెలకొల్పిన జాతీయ రికార్డు (11.33 సెకన్లు)ను కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టింది. కష్టాలకు ఎదురీదుతూ... ఒడిశాలో గోపాల్పూర్ అనే ఓ చిన్న గ్రామం. అందులో ఓ నిరుపేద చేనేత కుటుంబం.. ఆరుగురు అక్కాచెల్లెళ్లు... ఓ సోదరుడు.. పుట్టినప్పట్నించీ అన్ని కష్టాలే... రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. కనీస వసతులకు కూడా నోచుకోలేని ఆ కుటుంబం నుంచి ద్యుతీ అంచలంచెలుగా ఎదిగింది. అడుగడుగునా వెక్కిరించే కష్టాలను ఓర్పుగా జయిస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్లో చిరుతలా మారింది. పరుగెత్తడానికి మైదానం కూడా లేని పరిస్థితుల్లో కొండలు, కోనలు, సెలయేళ్లు అంటూ ప్రకృతిని ఆసరాగా చేసుకొని నదుల వెంట పరుగు తీసింది. అయితే సాధన ఉన్నా... సరైన శిక్షణ లేకపోవడంతో ఆరంభంలో కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కానీ కోచ్ రమేశ్ అండతో వీటన్నింటిని జయించి ప్రతి రోజూ తనకు తానుగా ఓ కొత్త అథ్లెట్గా రూపాంతరం చెందింది. జాతీయ స్థాయి టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ద్యుతీ... 2013 పుణేలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత అండర్-18 వరల్డ్ యూత్ చాంపియన్షిప్తో పాటు తైపీలో జరిగిన పోటీల్లో 200 మీటర్లలో చాంపియన్గా నిలిచి అంతర్జాతీయ స్టార్గా మారింది. ఇక స్ప్రింట్లో తిరుగులేని క్రీడాకారిణిగా మారుతున్న తరుణంలో 2014లో ద్యుతీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తనలో ‘టెస్టోస్టిరాన్’ (పురుష హార్మోన్) స్థాయి అధికంగా ఉందని, మహిళా అథ్లెట్గా పరిగణించలేమని ఐఏఏఎఫ్ నిషేధం విధించింది. దీంతో ‘కామన్వెల్త్ గేమ్స్’లో పతకం సాధించాలన్న ఆమె ఆశలకు గండిపడింది. ఈ పరిణామంతో నిరాశకు లోనైన ద్యుతీ ఓ ఏడాది పాటు శిక్షణకు, పోటీలకు దూరమైంది. అయితే సన్నిహితులు ఇచ్చిన స్ఫూర్తితో తనపై విధించిన నిషేధాన్ని... స్విట్జర్లాండ్లోని ‘కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)’లో అప్పీల్ చేసింది. సుదీర్ఘ విచారణ, రిపోర్టుల పరిశీలన, వాదనలు విన్న తర్వాత గతేడాది జూలైలో పాక్షికంగా నిషేధాన్ని ఎత్తివేస్తూ కాస్ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో మళ్లీ అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించిన ద్యుతీ కఠిన శిక్షణ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ట్రాక్పై సంచలనం సృష్టించింది. ఫలితంగా రియో బెర్త్ ఆమె ముంగిటకు చేరింది. - సాక్షి క్రీడావిభాగం భారత్ నుంచి ఐదో క్రీడాకారిణి ఓవరాల్గా భారత్ నుంచి 100 మీటర్ల రేసులో ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన ఐదో క్రీడాకారిణిగా ద్యుతీ రికార్డులకెక్కింది. 1952 హెల్సింకీ పోటీల్లో నీలిమా ఘోష్, మేరీ డిసౌజాలు భారత్కు ప్రాతినిధ్యం వహించినా... ఈ ఇద్దరూ హీట్స్ (1, 9)లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మెల్బోర్న్ (1956) ఒలింపిక్స్లో మేరీ లీలా రావు మళ్లీ దేశం తరఫున బరిలోకి దిగింది. కానీ రేసును పూర్తి చేయలేకపోయింది. ఎలాంటి అర్హత పోటీ లేకుండా మాస్కో (1980) ఒలింపిక్స్లో పాల్గొన్న పీటీ ఉష... హీట్స్తోనే సంతృప్తిపడింది. బరిలోకి దిగిన తొలి హీట్స్లో ఆమె ఆరో స్థానంతో సంతృప్తిపడింది. ఇక అప్పటి నుంచి 100 మీటర్లలో ఇంకెవ్వరూ భారత్కు ప్రాతినిధ్యం వహించలేదు. అయితే ఏథెన్స్ (2004) ఒలింపిక్స్లో సరస్వతి దేవ్ సాహా 200 మీటర్ల రేసులో పాల్గొంది. అండగా తెలుగు వ్యక్తులు కష్టాలను జయిస్తూ.. కెరీర్ను కొనసాగించిన ద్యుతీకి అడుగడుగునా తెలుగు వ్యక్తులు ముగ్గురు అండగా నిలిచారు. ఆరంభంలో అన్నీ తానై నిలబడ్డ కోచ్ నాగ్పూరి రమేశ్... ద్యుతీని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్గా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎన్నో త్యాగాలు చేశారు. ఉన్న వసతుల్లోనే అత్యుత్తమ శిక్షణను రమేశ్ ఇస్తే... అందుకు తగ్గ ఫలితాలను ద్యుతీ చూపెట్టింది. ఇక ప్రతి రోజూ శిక్షణ కోసం గోపీ చంద్ తన అకాడమీలో సౌకర్యాలు ఇచ్చారు. ద్యుతీ అక్కడే దాదాపు ఆరు గంటల పాటు శ్రమిస్తుంది. అయితే వసతుల పరంగా ఇబ్బందిలేకున్నా.. టోర్నీలకు, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం తప్పనిసరి కావడంతో ద్యుతీని మళ్లీ కష్టాలు వెంటాడాయి. సాయ్ నుంచి కొద్దోగొప్పో సాయం అందినా అది ఏమూలకు సరిపోకపోయేది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ అండగా నిలిచారు. ద్యుతీకి లక్ష రూపాయలు ఆర్థికసాయం చేసి... ఒలింపిక్స్కు అర్హత సాధిస్తే మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఇప్పుడు ద్యుతీకి ఆ డబ్బు ఇస్తున్నట్లు చెప్పారు. ద్యుతీయే కాకుండా తెలంగాణ క్రీడాకారులు ఎవ రు ఒలింపిక్స్లో ఏ పతకం సాధించినా వారికి బీఎండబ్ల్యూ కారు ఇస్తానని చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. -
'నన్ను ప్రభుత్వాలు పట్టించుకోలేదు'
న్యూఢిల్లీ: తనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటూ ఇటీవల జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో జాతీయ రికార్డు నెలకొల్పిన స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన శిక్షణ సమయంలో ప్రభుత్వం కల్పిస్తామన్న హామీలను గాలికొదిలేశారని మండిపడింది. గత సెప్టెంబర్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చి ఆ తరువాత పట్టించుకోలేదని ద్యుతీ విమర్శించింది. 'గతంలో ప్రభుత్వం నాకు చాలా హామీలిచ్చింది. విదేశాల్లో శిక్షణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం అన్నారు. ఆ శిక్షణలో ఒంటరిగానే పాల్గొన్నా. నేను తాజాగా నెలకొల్పిన రికార్డుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం అభినందనలు తెలపలేదు. నాకు ఉద్యోగం కల్పిస్తామన్న హామీ కూడా మరచిపోయారు' అంటూ ద్యుతీ చంద్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా టాప్ ఒలింపిక్ పోడియంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహకారం కూడా తనకు అందలేదని ద్యుతీచంద్ ఆరోపించింది. ఈ మేరకు డిసెంబర్ 18వ తేదీన క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి తాను ఈ-మెయిల్ ద్వారా పొందిన హామీపై ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా రాలేదని విమర్శించింది. ఇలా అథ్లెటిక్స్ ను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలకు ధన్యవాదాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన న ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ జాతీయ రికార్డు నెలకొల్పింది. ద్యుతీ 11.33 సెకన్ల టైమింగ్తో స్వర్ణం సాధించింది. అయినప్పటికీ ఒకే ఒక్క సెకను తేడాతో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ బెర్తును చేజార్చుకుంది. -
ద్యుతీ చంద్ రికార్డు
దోహా (ఖతార్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఒడిషాకు చెందిన ద్యుతీ 60 మీటర్ల విభాగంలో ఈ రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్లో ద్యుతీ 7.28 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో 7.81 సెకన్లతో అర్జిన ఖాతూన్ (భారత్) పేరిట ఉన్న జాతీయ రికార్డును ద్యుతీ సవరించింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్న ద్యుతీ తన టైమింగ్తో చాంపియన్షిప్ రికార్డును కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.33 సెకన్లతో విక్టోరియా (కజక్స్తాన్) పేరిట ఉండేది. -
రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తా!
కోల్ కతా: ఇటీవల జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ తాను తప్పకుండా రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని అంటోంది. అయితే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే తనకు విదేశాల్లో శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. తనను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ క్రమంలోనే విదేశాల్లో శిక్షణ అవసరమని పేర్కొంది. అథ్లెటిక్స్ కు సంబంధించి ఇక్కడే శిక్షణ తీసుకుంటే కష్టమని తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ శిక్షణ తనకు అవసరమని పేర్కొంది. తాను ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ సాధన చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. గత శనివారం జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో భాగంగా రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్తో సత్తా చాటుకుంది. అనంతరం జరిగిన 200 మీ, 4/100 విభాగాల్లో కూడా ద్యుతీ స్వర్ణాలు గెలిచి ఉత్తమ స్ప్రింటర్ గా నిలిచింది. గతంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా ఈ ఒడిషా స్ప్రింటర్ కొంతకాలం నిషేధం ఎదుర్కొంది. అయితే గత జూలైలో ఆమెపై నిషేధాన్ని స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఎత్తేసింది. -
ద్యుతీ చంద్కు స్వర్ణం
కోల్కతా : వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్తో సత్తా చాటుకుంది. పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా నిషేధం ఎదుర్కొన్న 19 ఏళ్ల ఈ ఒడిషా స్ప్రింటర్పై స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గత జూలైలో వేటును ఎత్తేసింది. అలాగే లలితా బాబర్ (3000మీ. స్టీపుల్చేజ్), ఇందర్జీత్ సింగ్ (షాట్పుట్) తమ విభాగాల్లో మీట్ రికార్డులు నెలకొల్పుతూ స్వర్ణాలు సాధించారు. ఇప్పటిదాకా ఈ చాంపియన్షిప్లో తొమ్మిది స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, రెండు కాం స్యాలతో ఓఎన్జీసీ అగ్రస్థానంలో ఉంది.