womens cricket team
-
భారత ‘ఎ’ జట్టులో షబ్నమ్, యశశ్రీ
ముంబై: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో సిరీస్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత ‘ఎ’ జట్టుకు కేరళకు చెందిన ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్, హైదరాబాద్ అమ్మాయి సొప్పదండి యశశ్రీలకు కూడా భారత ‘ఎ’ జట్టులో చోటు లభించింది. ఆగస్టు 7 నుంచి 25 వరకు జరిగే ఈ సిరీస్లో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో టీమిండియా మూడు టి20లు, మూడు వన్డేలు, ఒక నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతుంది. భారత ‘ఎ’ జట్టు: మిన్న మణి (కెప్టెన్ ), శ్వేత సెహ్రావత్ (వైస్ కెప్టెన్ ), ప్రియా పూనియా, శుభ సతీశ్, తేజల్ హసబీ్నస్, కిరణ్ నవ్గిరే, సజన, ఉమా చెత్రి, శిప్రా గిరి, రాఘవి బిష్త్, సైకా ఇషాక్, మన్నత్ కశ్యప్, తనుజా కన్వర్, ప్రియా మిశ్రా, మేఘన సింగ్, సయాలీ సట్గరే, షబ్నమ్ షకీల్, యశశ్రీ. -
భారత మహిళల క్రికెట్ జట్టులో షబ్నమ్
విశాఖ స్పోర్ట్స్: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న క్రికెట్ సిరీస్లో పాల్గొంటున్న భారత జట్టులో అదనంగా మరో ప్లేయర్ను చేర్చారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మీడియం పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్ను తొలిసారి భారత సీనియర్ జట్టులోకి ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్లలోని (వన్డే, టెస్టు, టి20) టీమిండియాలో షబ్నమ్కు చోటు దక్కడం విశేషం.విశాఖపట్నంకు చెందిన షబ్నమ్ గత ఏడాది జనవరిలో జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) గుజరాత్ జెయింట్స్ తరఫున నాలుగు మ్యాచ్లు ఆడిన షబ్నమ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న సిరీస్లో బెంగళూరు వేదికగా జరిగిన తొలి రెండు వన్డేల్లో భారత జట్టు గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం బెంగళూరులోనే జరుగుతుంది. -
న్యూజిలాండ్పై పాక్ తొలిసారి సిరీస్ సొంతం
సమష్టి ప్రదర్శనతో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారి న్యూజిలాండ్ జట్టుపై టి20 సిరీస్ను సొంతం చేసుకుంది. డ్యూనెడిన్లో జరిగిన రెండో మ్యాచ్లో పాక్ పది పరుగులతో నెగ్గి మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో దక్కించుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలియా రియాజ్ (32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), మునీబా అలీ (35; 6 ఫోర్లు) రాణించడంతో... పాక్ 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 7 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. -
India vs Sri Lanka Womens 2nd T20: భారత్దే సిరీస్
దంబుల్లా: సమష్టి ఆటతీరుతో రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్లో ఐదు వికెట్లతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. పూజా వస్త్రకర్ బౌలింగ్లో ఆటపట్టు అవుటయ్యాక లంక పతనం మొదలైంది. చివరి ఆరు ఓవర్లలో లంక 38 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 39; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్ప్రీత్ కౌర్ (32 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) చివరిదాకా నిలిచి భారత్ను విజయతీరానికి చేర్చింది. చివరిదైన మూడో టి20 సోమవారం జరుగుతుంది. -
‘శభాష్’ అనిపించుకోగలిగాను!
2005... మెదక్ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్లో సరిగా చూస్తే మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమె భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు... బయోపిక్... బయోగ్రఫీ... రిటైర్మెంట్ తర్వాతి కెరీర్పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది. లోటుగా భావించడం లేదు ప్రపంచకప్ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్లోనూ చూస్తే ప్రపంచకప్ గెలిచిన టీమ్లో భాగం కాకపోయినా, క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్లలో జట్టును ఫైనల్కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు. సుదీర్ఘ కెరీర్కు అదే కారణం చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్ టేబుల్’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. అలా అనుకోలేదు ఎన్నో గంటల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను. అన్ని చోట్లా ఆడాను కెరీర్ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్ టోర్నమెంట్’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్ మైదానాల్లో జరిగిన మ్యాచ్లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్ వికెట్, మ్యాట్ వికెట్ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి. టి20లు కలిసి రాలేదు నేను అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్ పట్టింది. ఓపెనర్గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్ రమేశ్ పొవార్తో వివాదంతో నా కెరీర్ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్ టీవీలో లైవ్గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా! స్మృతి మంధాన, హర్మన్ప్రీత్లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. -
అంధుల క్రికెట్ కాంతిరేఖ
తెనాలి: బెంగళూరులో ఈనెల 28 నుంచి జరగనున్న జాతీయ అంధ మహిళల క్రికెట్ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించనుంది. గుంటూరు జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ దీనికి మార్గం సుగమం చేసింది. తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్–2019 ఢిల్లీలో జరిగింది. టీ–20 ఫార్మట్లో జరిగిన ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి క్రీడాకారుల ప్రాతినిథ్యం ఉన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి జట్టు పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవడమే దీనికి కారణం. ఇప్పటికే మెన్ బ్లైండ్ క్రికెట్లో ఏపీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టు వరల్డ్ కప్నూ సాధించింది. ముందుకొచ్చిన జహరాబేగం అంధ మహిళల విభాగంలో క్రికెట్ పోటీల ఆరంభంతో గత రెండేళ్లుగా సాధన చేసేవారి సంఖ్య పెరిగింది. అయినా మహిళల జట్టు ఎంపిక లేక నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తాహెరా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ఎన్నారై జహరాబేగంకు క్రీడాకారులు సమాచారం పంపారు. గతంలో బ్లైండ్ మెన్ వరల్డ్ కప్ టోర్నమెంటులో హైదరాబాద్, మూలపాడుల్లో జరిగిన రెండు మ్యాచ్లకు తాహెరా ట్రస్ట్ స్పాన్సర్ చేసింది. గతేడాది జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏపీ మెన్ బ్లైండ్ టీమ్కు స్పాన్సర్గానూ వ్యవహరించింది. ఈ క్రమంలో ఏపీ నుంచి అంధ మహిళల జట్టును జాతీయ పోటీలకు పంపేందుకు తోడ్పడాలని క్రీడాకారుల నుంచి వచ్చిన వినతులను జహరాబేగం పరిగణనలోకి తీసుకున్నారు. ఏపీ జట్టుకు స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నారు. సీఏబీఏపీ చురుగ్గా ఏర్పాట్లు తాహెరా ట్రస్ట్ గ్రీన్ సిగ్నల్తో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ) చురుగ్గా ఏర్పాట్లు చేసింది. అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్లో క్రీడాకారులకు సన్నాహక శిబిరం చేపట్టింది. ఈనెల 15 నుంచి ఇది ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. జహరా బేగం సన్నాహక శిబిరానికి హాజరై, క్రీడాకారిణులకు వసతి, భోజనం, యూనిఫాం, కిట్ను సమకూర్చారు. వీరి నుంచి 14 మంది జట్టును ఈనెల 17న ఎంపిక చేశారు. మళ్లీ వీరికి పూర్తిస్థాయి శిక్షణ నడుస్తోంది. క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా కార్యదర్శి, ఏపీ అధ్యక్షుడు జాన్ డేవిడ్ నేతృత్వంలో జాతీయ క్రీడాకారుడు జి.వెంకటేష్ వీరికి శిక్షణనిస్తున్నారు. రాయలసీమ కో–ఆర్డినేటర్ ఫర్ బ్లైండ్ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. త్వరలో సీఎం వద్దకు.. అంధ క్రీడాకారుల్లో క్రీడాపరంగా అపూర్వమైన సామర్థ్యం ఉందని జహరాబేగం చెప్పారు. క్రికెట్ సాధనకు క్రీడాకారులకు తగిన ఆటస్థలం, వసతిగృహం అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని త్వరలోనే కలవనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. -
న్యూజిలాండ్తో ఏకైక టీ20.. భారత జట్టు ఓటమి
క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో భారత్పై న్యూజిలాండ్ మహిళల జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో సబ్భినేని మేఘన(37), యస్తికా భాటియా(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కేర్, అమేలియా కెర్, జాన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజీ బేట్స్(36), డివైన్( 31) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్కు బారత జట్టు సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన దూరమైంది. ఇక న్యూజిలాండ్తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. చదవండి: MS Dhoni Gym Video: అదీ ధోని భాయ్ అంటే.. ఎంతో ఓపికగా జిమ్లో.. వీడియో వైరల్ -
పాక్ జట్టులో కరోనా కలకలం..ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ
Three Pakistan Women Cricketers Tested For Covid Positive: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. స్వదేశంలో విండీస్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో జట్టు సభ్యులుండగా రొటీన్ చెకప్లో భాగంగా జరిపిన పరీక్షల్లో విషయం వెలుగు చూసినట్లు పేర్కొంది. అయితే, కోవిడ్ బారిన పడిన ఆటగాళ్ల వివరాలను మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించలేదు. బాధితులను 10 రోజుల క్వారంటైన్కు తరలించామని.. మిగతా జట్టు సభ్యులను వారి నుంచి వేరుగా ఉంచామని తెలిపింది. కాగా, పాక్ మహిళా జట్టు కరాచీ వేదికగా నవంబర్ 8, 11, 14 తేదీల్లో విండీస్తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాక్ జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ సిరీస్పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. చదవండి: బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా -
ఏడాది దాటిపోయింది.. ఇంతవరకు ప్రైజ్మనీ చెల్లించలేదు
ముంబై: టీమిండియా మహిళల జట్టుపై బీసీసీఐ వివక్ష చూపించిందంటూ వారం క్రితం సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్కు పర్యటనకు టీమిండియా పురుషులు జట్టు, మహిళల జట్టు ఏకకాలంలో బయల్దేరాల్సి ఉంది. అయితే ఇరు జట్లు ఒకే ఫ్లైట్లో వెళ్లరని.. మహిళల జట్టుకోసం మరో చార్టడ్ ఫ్లైట్ సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇక కరోనా టెస్టుల విషయంలోనూ వివక్ష చూపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఖండించిన బీసీసీఐ మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ లాంటి సీనియర్ క్రికెటర్లతో మాట్లాడించింది. బీసీసీఐ మాపై ఎలాంటి వివక్ష చూపించలేదని.. మాకు చార్టడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందంటూ చెప్పుకొచ్చారు. తాజాగా జీతాల చెల్లింపు విషయంలో బీసీసీఐ మరోసారి వివక్ష చూపిస్తుందంటూ కొత్త అంశం తెరమీదకు వచ్చింది. పురుషుల జట్టులో ఆటగాళ్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు చెల్లించలేదని సమాచారం. విషయంలోకి వెళితే.. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన ఇండియా రన్నరప్తో సరిపెట్టుకుంది. మెగా టోర్నీలో రన్నరప్గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ 5లక్షల డాలర్లు( భారత కరెన్సీలో రూ.36 కోట్లు) ప్రైజ్మనీ ఇచ్చింది. అయితే ఇంతవరకు బీసీసీఐ ఆ ప్రైజ్మనీని మహిళా క్రికెటర్లకు డిస్ట్రిబ్యూట్ చేయలేదని సమాచారం. టీ 20 ప్రపంచకప్లో పాల్గొన్న 15 మంది జట్టులో ఒక్కో ప్లేయర్కి 33వేల డాలర్లు అందుతుంది( ఇండియన్ కరెన్సీలో రూ. 24లక్షలు). దీనివల్ల మహిళ క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అదే పురుష క్రికెటర్లు ఒక సిరీస్ ఆడిన వారానికే వారి ఖాతాల్లో డబ్బులు వచ్చి చేరతాయి.. కానీ మహిళల జట్టు విషయానికి వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది. ఇదే విషయమై ఫిమేల్ క్రికెట్ ఫెడరేషన్ సభ్యులు స్పందించారు. ''బీసీసీఐకి పురుష క్రికెటర్లపై ఉన్న ప్రేమ మహిళల క్రికెటర్లపై ఎందుకు లేదు. ఏడాది క్రితం ఐసీసీ ఇచ్చిన ప్రైజ్మనీని ఇప్పటివరకు ఆటగాళ్లకు చెల్లించలేదు. దీనికి వివక్ష అనకుండా ఇంకేం అంటారో మీరే చెప్పిండి. సమయానికి ఆ డబ్బు అందించి ఉంటే కరోనా, లాక్డౌన్ సమయాల్లో వారికి ఎంతగానో ఉపయోగపడేవి. కాగా ఈ వార్తలపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చదవండి: షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన కోహ్లి పెద్ద మనసు.. మాజీ క్రికెటర్ తల్లికి సాయం టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
టాప్–6లో నిలిచే జట్లు, ఇంగ్లండ్ నేరుగా అర్హత
దుబాయ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్కు సంబంధించిన క్వాలిఫయింగ్ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేశాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టి20 టీమ్ ర్యాంకింగ్స్లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్లో ఉంది. చివరిదైన ఎనిమిదో బెర్త్ను ‘కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ టోర్నీ’లో విజేత జట్టుతో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఓవరాల్గా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే. 1998 కౌలాలంపూర్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్కు ఈ అవకాశం దక్కింది. అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
ఇంగ్లండ్ మహిళలకు నాలుగో విజయం
డెర్బీ: ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో టి20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసేందుకు విజయం దూరంలో ఉంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో టి20 మ్యాచ్లో ఇంగ్లండ్ 44 పరుగుల ఆధిక్యంతో గెలిచి సిరీస్లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు సాధించింది. అమీ జోన్స్ (37 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్లు), హీథర్నైట్ (30 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అలెన్ రెండు వికెట్లు తీసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి ఓడిపోయింది. షెడిన్ నేషన్ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్, సారా గ్లెన్ రెండేసి వికెట్లు తీశారు. సిరీస్లో చివరిదైన ఐదో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. -
ఆసీస్దే టి20 సిరీస్
బ్రిస్బేన్: పొదుపైన బౌలింగ్, అద్భుత బ్యాటింగ్, రికార్డు వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆస్ట్రేలియా మహిళల జట్టు మ్యాచ్తో పాటు సిరీస్ విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆమీ శాటర్వైట్ (30; 5 ఫోర్లు) రాణించింది. ఈ మ్యాచ్లో శాటర్వైట్ను స్టంపౌట్ చేయడం ద్వారా ఆసీస్ వికెట్ కీపర్ అలీసా హీలీ... టి20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని (97 ఇన్నింగ్స్లో 91)తో సమానంగా నిలిచింది. అనంతరం లారెన్ డౌన్ (12) క్యాచ్ తీసుకొని ధోనిని అధిగమించింది. 129 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలీసా హీలీ (17 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), రాచెల్ (40; 5 ఫోర్లు) సత్తా చాటారు. -
ఇంగ్లండ్ మహిళల జోరు
డెర్బీ: వెస్టిండీస్ మహిళలతో జరుగుతోన్న ఐదు టి20 మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య ఇంగ్లండ్ మహిళల జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బుధవారం అర్ధరాత్రి ముగిసిన రెండో టి20 మ్యాచ్లో ఇంగ్లండ్ 47 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సారా గ్లెన్ (26; 4 ఫోర్లు), ఆమీ జోన్స్ (25; 1 ఫోర్, 1 సిక్స్), టామ్సిన్ బ్యూమోంట్ (21; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో షకీరా సెల్మన్, స్టెఫానీ టేలర్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం సాధారణ లక్ష్యఛేదనలో వెస్టిండీస్ తడబడింది. బౌలర్లు సోఫీ ఎకెల్స్టోన్ (2/19), సారా గ్లెన్ (2/24), మ్యాడీ విలియర్స్ (2/10) కట్టుదిట్టంగా బంతులేయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులే చేసి పరాజయం పాలైంది. డాటిన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (31 బంతుల్లో 28; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ శనివారం జరుగనుంది. ఆరు నెలల తర్వాత ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్తో అంతర్జాతీయ మహిళల క్రికెట్ పునః ప్రారంభమైంది. -
ఇంగ్లండ్ మహిళలదే తొలి టి20
డెర్బీ: ఆరు నెలల తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టి20 సిరీస్తో అంతర్జాతీయ మహిళల క్రికెట్ పునః ప్రారంభమైంది. ఐదు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 47 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. టామ్సిన్ బ్యూమోంట్ (49 బంతుల్లో 62; 9 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచింది. విండీస్ బౌలర్లలో షకీరా కసాండ్రా మూడు వికెట్లు తీయగా... హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి ఓడిపోయింది. విండీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ డీండ్రా డాటిన్ (59 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేరకపోవడం గమనార్హం. -
అమ్మాయిలు ఇంగ్లండ్కు వెళ్లరు
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి ఇంగ్లండ్ మహిళల జట్టుతో నాలుగు వన్డేలు, రెండు టి20 మ్యాచ్ల సిరీస్ల్లో భారత్ తలపడాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో తమ దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రొఫెషనల్ క్రికెట్ను జూలై 1 వరకు వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ప్రకటించింది. దీంతో అక్కడ భారత పర్యటన వాయిదా పడింది. దేశవాళీ క్రికెట్ సీజన్లోనూ తొమ్మిది రౌండ్ల మ్యాచ్ల్ని కోల్పోతున్నట్లు ఈసీబీ తెలిపింది. ‘ఈ వేసవిలో కొంత వరకైనా క్రికెట్ కార్యకలాపాల్ని నిర్వహించగలమని మేం నమ్ముతున్నాం. వాయిదా పడిన అంతర్జాతీయ టోర్నీలను రీ షెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహిస్తాం. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆటగాళ్లు, సిబ్బంది ఆరోగ్యమే మాకు ముఖ్యం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిస్థితులు సద్దుమణిగాకే ప్రొఫెషనల్ క్రికెట్ను నిర్వహిస్తాం’ అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ పేర్కొన్నారు. -
వైద్య సహాయకురాలిగా హెథర్ నైట్
లండన్: ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోన్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హెథర్ నైట్ మరో అడుగు ముందుకు వేసి సేవ మార్గాన్ని ఎంచుకుంది. తమ దేశ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ’ (ఎన్హెచ్ఎస్)లో వలంటీర్గా సేవలందించేందుకు తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ప్రాణాంతక వైరస్ను అరికట్టేందుకు నిరంతం శ్రమిస్తోన్న వైద్య వ్యవస్థకు తన సహాయాన్ని అందించనున్నట్లు 29 ఏళ్ల హెథర్ నైట్ పేర్కొంది. ఇందులో భాగంగా ఆమె చికిత్సకు అవసరమైన మందుల రవాణా చేయడంతోపాటు కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ‘ఎన్హెచ్ఎస్ వలంటీర్ పథకంలో నేను చేరాను. ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నాను. నా దగ్గర బోలెడంత ఖాళీ సమయం ఉంది. సాధ్యమైనంత వరకు సేవ చేస్తా. నా సోదరుడు, అతని భార్య ఇద్దరూ డాక్టర్లే. ఇంకా నాకు ఎన్హెచ్ఎస్లో పనిచేసే స్నేహితులు కూడా ఉన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో రోగుల కోసం వైద్యులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. అందుకే వారికి సహాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న హెథర్ నైట్ వివరించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్లో ఇంగ్లండ్ సెమీస్లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అనంతరం హెథర్ యూకే నిబంధనల ప్రకారం ఐసోలేషన్లోకి వెళ్లింది. ప్రస్తుతం యూకేలో 14,543కి పైగా కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం వలంటీర్ పథకాన్ని ప్రవేశపెట్టగా... 5 లక్షల మంది ఇందులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
మన వనిత... పరాజిత
మరో ప్రపంచ కప్ ఫైనల్... మళ్లీ అదే ఓటమి వ్యథ... విశ్వ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు వేదన పునరావృతమైంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడి పరాజయం వైపు ఉండిపోయిన మన బృందం ఈసారి టి20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. రికార్డు సంఖ్యలో మైదానంలో 86,174 మంది ప్రేక్షకులు, అటు ప్రత్యర్థిగా ఆతిథ్య జట్టు, భారీ లక్ష్యం... అన్నీ కలగలిసి తీవ్ర ఒత్తిడిలో హర్మన్ బృందం కుప్పకూలింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా... అసలు పోరులో ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. లోపాలు సరిదిద్దుకొని సరైన వ్యూహంతో బరిలోకి దిగి భారత్ను దెబ్బ కొట్టింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో ఐదోసారి పొట్టి ప్రపంచ కప్ను తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు హీలీ, మూనీ ఇచ్చిన ఆరంభం భారీ స్కోరుకు బాటలు వేయగా, బౌలింగ్లో మెగాన్ షూట్, జొనాసెన్ చెలరేగి ప్రత్యర్థి ఆటకట్టించారు. టోర్నీలో ప్రయాణం తడబడుతూనే సాగినా ... చివరకు తమ స్థాయిని ప్రదర్శించి ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలిచింది. మెల్బోర్న్: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! టి20 వరల్డ్ కప్లో తొలిసారి ఫైనల్ చేరి అరుదుగా లభించిన అవకాశాన్ని అందుకోవడంలో విఫలమైన మన జట్టు మళ్లీ రన్నరప్గానే ముగించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ బెత్ మూనీ (54 బంతుల్లో 78 నా టౌట్; 10 ఫోర్లు) తొలి వికెట్కు 70 బంతుల్లోనే 115 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (35 బంతుల్లో 33; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. షూట్ (4/18), జొనాసెన్ (3/20) భారత ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. హీలీ విధ్వంసం... స్పిన్ బలాన్ని నమ్ముకున్న భారత్... దీప్తి శర్మతో తొలి ఓవర్ వేయించింది. అయితే మొదటి బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడి బౌండరీగా మలచిన హీలీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ... శిఖా వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. పవర్ప్లే తర్వాత కూడా హీలీ దూకుడు తగ్గలేదు. రాజేశ్వరి వేసిన ఓవర్లో ఆమె వరుసగా రెండు సిక్సర్లు కొట్టింది. ఇందులో మొదటిది ఏకంగా 83 మీటర్ల దూరంలో పడింది! అనంతరం 30 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత శిఖా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హీలీ పండగ చేసుకుంది. వరుసగా మూడు బంతుల్లో ఆమె 6, 6, 6 బాదింది. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి వికెట్ భాగస్వామ్యం సెంచరీ దాటిన తర్వాత ఎట్టకేలకు రాధ యాదవ్ బౌలింగ్లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హీలీ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. హీలీకి జతగా మరోవైపు మూనీ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఆమె 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరి తర్వాత వచ్చిన ఇతర బ్యాటర్లను నిలువరించడంలో భారత్ సఫలమైంది. ఫలితంగా చేతిలో 9 వికెట్లు ఉన్నా... చివరి 5 ఓవర్లలో ఆసీస్ 42 పరుగులే చేయగలిగింది. దీప్తి మినహా... ఈ టోర్నీ తొలి మ్యాచ్లో షూట్ వేసిన మొదటి ఓవర్లో షఫాలీ 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టింది. కానీ ఈసారి షూట్ వంతు! తొలి ఓవర్ మూడో బంతికే హీలీ అద్భుత క్యాచ్కు షఫాలీ (2) వెనుదిరిగింది. జొనాసెన్ వేసిన రెండో ఓవర్లో మెడకు బంతి తగలడంతో తానియా (2) రిటైర్డ్హర్ట్గా నిష్క్రమించగా, జెమీమా (0) పేలవ షాట్తో వెనుదిరిగింది. ఆ తర్వాత మాలినెక్స్ కూడా తన మొదటి ఓవర్లోనే స్మృతి (11) పని పట్టింది. జొనాసెన్ తర్వాతి ఓవర్లో డీప్లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ హర్మన్ కౌర్ (4) అవుట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. వేద (24 బంతుల్లో 19; 1 ఫోర్), తానియా స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన రిచా ఘోష్ (18; 2 ఫోర్లు)తో కలిసి దీప్తి కొద్దిసేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆ రెండు క్యాచ్లు... ఆసీస్లాంటి జట్టుకు ‘లైఫ్’ ఇస్తే ఎలా ఉంటుందో ఫైనల్ మ్యాచ్ మళ్లీ చూపించింది. రెండుసార్లు తమకు వచ్చిన అవకాశాలను భారత్ జారవిడుచుకొని మూల్యం చెల్లించింది. తొలి ఓవర్ ఐదో బంతికి హీలీ వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్ను కవర్స్లో షఫాలీ వర్మ వదిలేయగా... రాజేశ్వరి తన మొదటి ఓవర్లోనే మూనీ తన వ్యక్తిగత స్కోరు 8 వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను నేలపాలు చేసింది. వీరిద్దరే ఆ తర్వాత చెలరేగి భారత్ కథ ముగించారు. ►5 ఆస్ట్రేలియాకు ఇది 5వ ప్రపంచకప్ టైటిల్. 7 సార్లు టోర్నీ జరిగితే ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి నెగ్గాయి. ►30 అలీసా హీలీ అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. ఏ ఐసీసీ టోర్నీ ఫైనల్లోనైనా (పురుషులతో సహా) ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ►184 ఫైనల్లో ఆసీస్ స్కోరు. ఏ టి20 ప్రపంచకప్లోనైనా (పురుషులతో సహా) ఇదే అత్యధిక స్కోరు. ►85 భారత్కు ఇది రెండో (85 పరుగులు) అతి పెద్ద పరాజయం. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 105 పరుగులతో ఓడింది. ►52 శిఖా పాండే ఇచ్చిన పరుగులు. ప్రపంచ కప్ మ్యాచ్లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. 86, 174 ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య. ఒక మహిళల క్రికెట్ మ్యాచ్కు ఎక్కడైనా హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది కాగా... ఆస్ట్రేలియా గడ్డపై ఏ క్రీడాంశంలోనైనా మహిళల మ్యాచ్కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య కూడా ఇదే. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) వేద (బి) రాధ 75; బెత్ మూనీ (నాటౌట్) 78; మెగ్ లానింగ్ (సి) శిఖా పాండే (బి) దీప్తి శర్మ 16; గార్డ్నర్ (స్టంప్డ్) తానియా (బి) దీప్తి శర్మ 2; హేన్స్ (బి) పూనమ్ 4; క్యారీ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–115; 2–154; 3–156; 4–176. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–38–2; శిఖా పాండే 4–0–52–0; రాజేశ్వరి 4–0–29–0; పూనమ్ యాదవ్ 4–0–30–1; రాధ యాదవ్ 4–0–34–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా హీలీ (బి) షూట్ 2; స్మృతి మంధాన (సి) క్యారీ (బి) మాలినెక్స్ 11; తానియా (రిటైర్డ్హర్ట్) 2; జెమీమా రోడ్రిగ్స్ (సి) క్యారీ (బి) జొనాసెన్ 0; హర్మన్ప్రీత్ కౌర్ (సి) గార్డ్నర్ (బి) జొనాసెన్ 4; దీప్తి శర్మ (సి) మూనీ (బి) క్యారీ 33; వేద కృష్ణమూర్తి (సి) జొనాసెన్ (బి) కిమిన్స్ 19; రిచా ఘోష్ (సి) క్యారీ (బి) షూట్ 18; శిఖా పాండే (సి) మూనీ (బి) షూట్ 2; రాధ (సి) మూనీ (బి) జొనాసెన్ 1; పూనమ్ (సి) గార్డ్నర్ (బి) షూట్ 1; రాజేశ్వరి (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–2; 1–5 (రిటైర్డ్హర్ట్), 2–8; 3–18; 4–30; 5–58; 6–88; 7–92; 8–96; 9–97; 10–99. బౌలింగ్: మెగాన్ షూట్ 3.1–0–18–4; జొనాసెన్ 4–0–20–3; మాలినెక్స్ 4–0–21–1; కిమిన్స్ 4–0–17–1; క్యారీ 4–0–23–1. -
మెల్బోర్న్లో.... మహరాణులు ఎవరో?
లక్ష మంది ప్రేక్షకులు... దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్–2020 ఫైనల్ వేదికను మెల్బోర్న్గా ప్రకటించినప్పుడు ఆశించిన సంఖ్య! మహిళా దినోత్సవం రోజున ఈ పోరును నిర్వహిస్తే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచవచ్చని భావించిన నిర్వాహకుల ఆలోచన ఇప్పుడు సరిగ్గా కార్యరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో అభిమానుల హాజరయ్యే అవకాశం ఉన్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో (ఎంసీజీ) రెండు అత్యుత్తమ జట్లు తుది పోరులో తలపడుతుండటంతో మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని క్రేజ్ ఈ ఫైనల్కు వచ్చేసింది. ఇక సమరం హోరాహోరీగా సాగడమే తరువాయి. మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన జట్టు ఒకవైపు... నాలుగు సార్లు ఇప్పటికే చాంపియన్గా నిలిచిన టీమ్ మరోవైపు. సమష్టితత్వంతో వరుస విజయాలు సాధించి భారత్ తుది పోరుకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్ ఓటమిని దాటి తమదైన ప్రొఫెషనలిజంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది. తొలి టైటిల్ సాధించే లక్ష్యంతో హర్మన్ సేనపై కాస్త ఒత్తిడి ఉండగా, ఇప్పటికే ఇలాంటి ఫైనల్స్ ఆడిన అనుభవంతో రాటుదేలిన ఆడ కంగారూలు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల ముందే కాదు... ఎంసీజీలో కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యే భారత అభిమానుల ప్రపంచకప్ కల నెరవేరుతుందా! మెల్బోర్న్: క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న జట్టుకు, ప్రపంచ నంబర్వన్ జట్టుకు మధ్య విశ్వ వేదికపై తుది సమరానికి సమయం వచ్చేసింది. నేడు ఇక్కడి ఎంసీజీలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలవగా, భారత్ మొదటిసారి ఫైనల్ బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ గెలిచింది. గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్లలో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. ఇదే గ్రూప్లో భారత్ చేతిలో ఓడిన అనంతరం ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచ్లలో నెగ్గింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ ముందంజ వేయగా...సెమీస్లో దక్షిణాఫ్రికాను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్కు అర్హత సాధించింది. గత కొన్నేళ్లుగా టి20ల్లో ఆసీస్ ఆధిపత్యం బాగా సాగింది. అయితే వారిని నిలవరించగలిగిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. గత ఐదేళ్లలో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్లు జరిగితే భారత్ 5 గెలిచి, 5 ఓడింది. ఓడిన మ్యాచ్లతో సమాన సంఖ్యలో మరే జట్టు ఆసీస్పై గెలవలేకపోయింది. ఇటీవలి ముక్కోణపు టోర్నీతో కలిపి చూస్తే ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్లో భారత్ 3 గెలిచి ఆధిక్యంలో ఉంది. అందుకే సొంత మైదానంలో ఆడుతున్నా సరే... తమకు విజయం అంత సులువు కాదని ఆసీస్కూ బాగా తెలుసు. కీలకమైన మ్యాచ్కు ముందు తమ స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ గాయంతో దూరం కావడం ఆసీస్కు పెద్ద దెబ్బ. అయితే కెప్టెన్ లానింగ్, బెత్ మూనీ, అలీసా హీలీలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో ఆ జట్టు ప్రధానంగా జెస్ జొనాసన్, మెగాన్ షూట్లపై ఆధారపడుతోంది. భారత జట్టుకు మరోసారి సంచలన ఓపెనర్ షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. ఆమె తనదైన శైలిలో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. షఫాలీని నిలువరించేందుకు ఆసీస్ అన్ని ప్రయత్నాలు చేయడం ఖాయం. అయితే మిగతా బ్యాటర్ల ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. తుది పోరులోనైనా తమ స్థాయికి తగినట్లు కెప్టెన్ హర్మన్, స్మృతి, జెమీమా చెలరేగాల్సి ఉంది. లేదంటే గెలుపు ఆశలు నెరవేరడం కష్టం. బౌలింగ్లో మరోసారి భారత్ స్పిన్నే నమ్ముకుంది. తమ స్పిన్నర్లు ఈ టోర్నీలో కెప్టెన్ హర్మన్ ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా పూనమ్ యాదవ్ తొలి మ్యాచ్లో ఆసీస్కు భారీ షాక్ ఇచ్చింది. కాబట్టి ఈసారి ఆమె కోసం వారు మరింత మెరుగ్గా సిద్ధమై రావడం ఖాయం. ఇతర స్పిన్నర్లు కూడా ఒత్తిడి పెంచగలిగితే ప్రత్యర్థిని నిలువరించవచ్చు. వర్షం లేదు! సెమీస్లో పోలిస్తే సంతోషకర విషయం ఆదివారం మెల్బోర్న్లో ఎలాంటి వర్ష సూచన లేదు. మ్యాచ్కు ఏ సమయంలోనా ఇబ్బంది ఉండకపోవచ్చు. అనూహ్యంగా వర్షం పడినా ఫైనల్కు రిజర్వ్ డే ఉంది. పిచ్ కూడా సాధారణ బ్యాటింగ్ వికెట్. మంచి స్కోరింగ్కు అవకాశం ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఒత్తిడి ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. ఫైనల్ చేరారిలా (భారత్) లీగ్ దశలో... ►ఆస్ట్రేలియాపై 17 పరుగులతో విజయం ►బంగ్లాదేశ్పై 18 పరుగులతో గెలుపు ►న్యూజిలాండ్పై 3 పరుగులతో విజయం ►శ్రీలంకపై ఏడు వికెట్లతో గెలుపు సెమీఫైనల్... ►ఇంగ్లండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు భారత్ ఫైనల్ చేరింది. (ఆస్ట్రేలియా) లీగ్ దశలో... ►భారత్ చేతిలో 17 పరుగులతో ఓటమి ►శ్రీలంకపై 5 వికెట్లతో గెలుపు ►బంగ్లాదేశ్పై 86 పరుగులతో విజయం ►న్యూజిలాండ్పై 4 పరుగులతో గెలుపు సెమీఫైనల్... దక్షిణాఫ్రికాపై 5 పరుగులతో విజయం టోర్నీలో భారత్ టాప్–3 బ్యాటర్లు 1. షఫాలీ వర్మ (161 పరుగులు) 2. జెమీమా (85) 3. దీప్తి శర్మ (84) టాప్–3 బౌలర్లు 1. పూనమ్ యాదవ్ (9 వికెట్లు) 2. శిఖా పాండే (7) 3. రాధా యాదవ్, రాజేశ్వరి (5) టోర్నీలో ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్లు 1. మూనీ (181 పరుగులు) 2. హీలీ (161) 3. లానింగ్ (116) టాప్–3 బౌలర్లు 1. షూట్ (9 వికెట్లు) 2. జొనాసన్ (7) 3. వేర్హామ్, క్యారీ (3) -
ఆమె కోసం అతడు తిరుగుముఖం
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ జట్టులో స్టార్క్ సతీమణి అలీసా హీలీ వికెట్ కీపర్, బ్యాటర్. మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా వన్డే జట్టు తరఫున సిరీస్లో బిజీగా ఉన్నాడు. అయినా సరే... తన భార్య ఆడే ఫైనల్ పోరును ప్రత్యక్షంగా తిలకించాలనుకున్న స్టార్క్ అంతే ఠంచనుగా తిరుగుముఖం పట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పురుషుల జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి వన్డేకు స్టార్క్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ సంతోషంగానే అతనికి అనుమతిచ్చింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఎవరికో ఒకరికి చాలా అరుదుగా వస్తుంది. స్టార్క్కు ఇప్పుడా చాన్స్ వచ్చింది. కాబట్టి తన శ్రీమతి ఆడే మ్యాచ్కు ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచేందుకు సమ్మతించాం’ అని ఆస్ట్రేలియా పురుషుల జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ 0–2తో కోల్పోయింది. ఇక అమ్మాయిల మెగా ఫైనల్ విషయానికొస్తే... భారత్ ఈ పొట్టి ఫార్మాట్లో తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సంపాదించగా... ఆసీస్ ఈ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అన్నట్లు ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్ కూడా! కానీ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడింది. -
మేమే ఫేవరెట్...
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా నాలుగుసార్లు విశ్వ విజేత అయినప్పటికీ ఈసారి ఫైనల్లో తమ జట్టే ఫేవరెట్గా అనిపిస్తోందని భారత సీనియర్ బ్యాటర్ వేద కృష్ణమూర్తి తెలిపింది. ఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని తనకు గట్టి నమ్మకముందని ఆమె చెప్పింది. ‘ఇదంతా విధి రాత. నేను దీన్ని బాగా నమ్ముతాను. ట్రోఫీ గెలుస్తామనే విశ్వాసం ఉంది. అయితే ఈ ప్రపంచకప్ భారత్కు అనుకూలంగానే రూపొందించారనడం హాస్యాస్పదం. వికెట్లు, వాతావరణం సంగతెలా ఉన్నా మేం బాగా ఆడామన్నది నిర్వివాదాంశం. నిజానికి మేం ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. అలా మొదటి దశను పూర్తి చేశాం. ఇప్పుడు అంతిమ దశ మిగిలుంది. ఆఖరి పోరులో ఏం చేయాలో కచ్చితంగా అదే చేస్తాం’ అని వేద పేర్కొంది. భారత్ 2017లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడి చివరకు రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ జట్టులో వేద కూడా ఉంది. అయితే ఫైనల్ దాకా వచ్చి ట్రోఫీని చేజార్చుకోవడం జీర్ణించుకోలేని బాధను మిగులుస్తుందని ఆమె గత పరాజయం తాలుకు జ్ఞాపకాలను వెల్లడించింది. ‘వ్యక్తిగతంగా నా పాత్రను నేను చక్కగా పోషించాను. జట్టు లో అందరిని కలుపుకొని వెళ్లాను. ఏదో ఒకరిద్దరని కాకుండా... ప్రతీ ఒక్కరిని ఉత్సాహపరుస్తూనే ఉన్నాను’ అని 27 ఏళ్ల వేద తెలిపింది. ఈ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్లో ఆసీస్ను ఓడించే... ఈ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం. అమ్మో... పవర్ప్లేలో వాళ్లిద్దరికి బౌలింగా? భారత్తో తలపడటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్న ఆసీస్ బౌలర్ మేగన్ షూట్ పవర్ ప్లేలో భారత స్టార్ బ్యాటర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలకు బౌలింగ్ చేయలేనని చెప్పింది. షూట్ వేసిన టోర్నీ ఓపెనింగ్ ఓవర్లో నాలుగు బౌండరీలు బాదిన షఫాలీ ఈ మెగా ఈవెంట్కే మెరుపు ఆరంభాన్నిచ్చింది. ‘స్మృతి, షఫాలీ నన్ను అలవోకగా ఎదుర్కొంటారు. ముక్కోణపు సిరీస్లో షఫాలీ కొట్టిన సిక్సర్ ఇప్పటికీ మర్చిపోలేదు. నేను చూసిన భారీ సిక్సర్లలో అది ఒకటి. అందుకే పవర్ప్లేలో వారికి ఎదురుపడటం నాకిష్టం లేదు’ అని షూట్ చెప్పింది. ఏదేమైనా మా వ్యూహాలు మాకుంటాయని తప్పకుండా వాటిని ఆచరణలో పెడతామని చెప్పింది. ‘ఫైనల్’ ఫీల్డ్ అంపైర్లు వీరే... ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే అంతిమ పోరాటంలో న్యూజిలాండ్కు చెందిన కిమ్ కాటన్, పాకిస్తానీ అహ్సాన్ రజా ఫీల్డు అంపైర్లు గా వ్యవహరిస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. గ్రెగరీ బ్రాత్వైట్ (వెస్టిండీస్) మూడో అంపైర్గా ఉంటారు. అహ్సాన్ రజా 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించింది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తలపడే జట్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ను భారత్... రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ స్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ‘ఢీ’కొంటాయి. ఈ రెండు మ్యాచ్లు కూడా ఒకే రోజు (గురువారం) జరుగుతాయి. వర్షం కారణంగా గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండు మ్యాచ్ల్లో కూడా ఫలితం రాలేదు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దాంతో మొత్తం 7 పాయింట్లతో దక్షిణాఫ్రికా గ్రూప్ ‘బి’ టాపర్గా నిలిచింది. రెండో స్థానం సాధించిన ఇంగ్లండ్ జట్టు హర్మన్ప్రీత్ సేనతో సవాల్కు సన్నద్ధమైంది. మరోవైపు ఇదే గ్రూప్లో పాకిస్తాన్, థాయ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా రద్దయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన థాయ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షంతో పాకిస్తాన్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఎలీస్ పెర్రీ అవుట్...: కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రీడాకారిణి ఎలీస్ పెర్రీ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ నంబర్వన్ ఆల్రౌండర్ అయిన ఎలీస్ లేకపోవడం ఆ జట్టు అవకాశాలను ప్రభావితం చేయవచ్చు. 2009లో మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 36 మ్యాచ్లు ఆడితే అన్నింటిలోనూ పెర్రీ భాగం కావడం విశేషం. -
చివరి బెర్త్ ఆసీస్దే
మెల్బోర్న్: సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చోట ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో వరుసగా ఏడోసారి టి20 ప్రపంచ కప్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (50 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెకు మెగ్ ల్యానింగ్ (21; 4 ఫోర్లు), గార్డ్నెర్ (20; 2 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (21; 2 ఫోర్లు) సహాయపడగా... చివర్లో రాచెల్ హైనస్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. అనంతరం ఛేదనలో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వారెమ్ (3/17), మేఘాన్ షూట్ (3/28) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, సిక్స్), సుజీ బేట్స్ (14; 2 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్లు)లను వారెమ్ పెవిలియన్కు చేర్చి మ్యాచ్ను ఆసీస్ వైపుకు తిప్పింది. మార్టిన్ (18 బంతుల్లో 37; 4 ఫోర్లు, సిక్స్) కివీస్ విజయం కోసం తుది వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 20 పరుగులు చేయాల్సి ఉండగా... కివీస్ 15 పరుగులను మాత్రమే రాబట్టగలిగింది. ఇదే గ్రూప్లో నామమాత్రంగా జరిగిన మరో మ్యాచ్లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 91 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా (39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. శశికళ సిరివర్దనే 4 వికెట్లతో రాణించింది. శ్రీలంక 15.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసి విజయంతో టోర్నీని ముగించింది. -
అంజలి అద్భుతం
సాక్షి, మంగళగిరి: బీసీసీఐ జాతీయ మహిళల అండర్ –23 వన్డే ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఒడిశాను ఆంధ్ర బౌలర్లు అంజలి శర్వాణి (6/11), సింధూజ (3/7) హడలెత్తించారు. ఫలితంగా ఒడిశా 34.1 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆంధ్ర 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి గెలిచింది. శిరీష (20 నాటౌట్), అంజలి (10 నాటౌట్) రాణించారు. -
టీ20 వరల్డ్ కప్ టీమిండియా కెప్టెన్గా..
ముంబై : ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్కు టీమిండియా కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ ఎంపికైంది. కౌర్ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ టీంలో రిచా ఘోష్ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్ టీ20 టీంలో హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్) సహా స్మృతి మంధానా, అరుంధతి రెడ్డి, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్లకు చోటు దక్కింది. -
భారత మహిళల జట్లలో ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు
ముంబై: నాలుగు జట్ల అంతర్జాతీయ టి20 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత ‘ఎ’, ‘బి’ జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు జట్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు క్రికెటర్లు రావి కల్పన, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి ఎంపికయ్యారు. పట్నాలో ఈనెల 16 నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ ‘ఎ’... ‘బి’ జట్లతోపాటు బంగ్లాదేశ్, థాయ్లాండ్ జట్లు బరిలోకి దిగుతాయి. దేశవాళీ టోర్నీల్లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) తరఫున ఆడే కల్పన భారత ‘ఎ’ జట్టులో... మేఘన, అంజలి భారత ‘బి’ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత ‘ఎ’ జట్టుకు దేవిక వైద్య... భారత ‘బి’ జట్టుకు స్నేహ రాణే కెప్టెన్గా వ్యవహరిస్తారు. -
టి20ల్లో థాయ్ అమ్మాయిల ప్రపంచ రికార్డు
దుబాయ్: థాయ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ టి20ల్లో కొత్త రికార్డు సృష్టించింది. వరుసగా 17వ విజయంతో ఆసీస్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. నెదర్లాండ్స్లో జరుగుతున్న నాలుగు దేశాల టి20 టోర్నీలో థాయ్ జట్టు ఆతిథ్య జట్టును 54 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం స్వల్పలక్ష్యాన్ని కేవలం 8 ఓవర్లలోనే ఛేదించింది. ఇది థాయ్లాండ్ అమ్మాయిలకు వరుసగా 17వ విజయం. ఈ నాలుగు దేశాల టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్ మిగతా జట్లు... కాగా గత ఏడాది జూలైలో యూఏఈని ఓడించడం ద్వారా థాయ్లాండ్ జైత్రయాత్ర మొదలైంది. ఇప్పటి వరకు ఆసీస్ మహిళలు 2014–15 సీజన్లో 16 వరుస విజయాలతో రికార్డు సృష్టించగా ఇప్పుడు థాయ్ జట్టు ఆ రికార్డును చెరిపేసింది. అత్యధిక వరుస విజయాల జాబితాలో థాయ్, ఆసీస్ తర్వాత ఇంగ్లండ్, జింబాబ్వే మహిళల జట్లు 14 విజయాలతో నిలువగా, న్యూజిలాండ్ 12 విజయాలతో టాప్–5లో ఉంది. -
మహిళలు చేజేతులా...
భారత మహిళల విజయలక్ష్యం 160 పరుగులు... స్మృతి మంధాన జోరు మీదుండగా ఒక దశలో స్కోరు 102/1... మరో 52 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి పటిష్ట స్థితిలో ఉండి కూడా మన జట్టు కుప్పకూలింది. 34 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ముందు తలవంచింది. ఈ పోరుకు ముందు భారత్ తమ చివరి టి20 మ్యాచ్ను దాదాపు రెండున్నర నెలల క్రితం ప్రపంచ కప్ సెమీస్లో ఆడింది. నాడు 23 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయిన తీరును తాజా ఫలితం మళ్లీ గుర్తు చేసింది. సరిగ్గా అప్పటిలాగే స్మృతి, జెమీమా మినహా అంతా విఫలం కావడంతో హర్మన్ బృందం కుదేలైంది. వెల్లింగ్టన్: స్మృతి మంధాన సూపర్ హిట్... భారత్ అట్టర్ ఫ్లాప్... న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్ ఫలితంపై సంక్షిప్త వ్యాఖ్య ఇది! అద్భుతమైన ఆరంభం లభించినా దానిని కొనసాగించలేక మన అమ్మాయిలు చతికిల పడ్డారు. చివరకు 23 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. స్మృతి భారత్ తరఫున టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) నమోదు చేసినా జట్టును మాత్రం గెలిపించలేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. సోఫీ డెవిన్ (62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ సాటర్వైట్ (33; 4 ఫోర్లు) అండగా నిలిచింది. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (34 బంతుల్లో 58; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో పాటు జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 39; 6 ఫోర్లు) కూడా రాణించింది. వీరిద్దరు రెండో వికెట్కు 98 పరుగులు జత చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (17) విఫలం కాగా... మిగతా ఎనిమిది మంది ఒక్కో అంకె స్కోరుకే పరిమితయ్యారు. లీ మేరీ తహుహు (3/30) భారత్ను దెబ్బ తీసింది. రెండో టి20 మ్యాచ్ రేపు ఆక్లాండ్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సుజీ బేట్స్ (7)ను ఔట్ చేసి పూనమ్ యాదవ్ భారత్కు శుభారంభం అందించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే గర్రీ (15)ని కూడా పూనమ్ బౌల్డ్ చేసింది. ఈ దశలో డెవిన్, సాటర్వైట్ కలిసి జట్టును ఆదుకున్నారు. 69 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని హైదరాబాద్ బౌలర్ అరుంధతి రెడ్డి విడగొట్టింది. అరుంధతి ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీ దాటించిన డెవిన్ తర్వాతి బంతికి వెనుదిరిగింది. తర్వాతి ఓవర్లోనే సాటర్వైట్ను దీప్తి ఔట్ చేసింది. పూనమ్ వేసిన ఆఖరి ఓవర్లో మార్టిన్ రెండు సిక్సర్లు బాదడంతో కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. టపటపా... వన్డేల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన స్మృతి అదే ఫామ్ను టి20ల్లోనూ కొనసాగించింది. అయితే కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడిన మరో ఓపెనర్ ప్రియా పూనియా (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి అలవోకగా పరుగులు సాధించారు. రోజ్మేరీ వేసిన ఆరో ఓవర్లో స్మృతి 2 సిక్సర్లు, ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. కాస్పరెక్ వేసిన తర్వాతి ఓవర్లో జెమీమా వరుసగా 3 ఫోర్లు కొట్టింది. డెవిన్ బౌలింగ్లో భారీ సిక్స్తో స్మృతి రికార్డు అర్ధసెంచరీ నమోదైంది. వీరిద్దరు జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. కెర్ బౌలింగ్లో డీప్ ఎక్స్ట్రా కవర్లో రోవ్ అద్భుత క్యాచ్ పట్టడంతో స్మృతి ఇన్నింగ్స్ ముగిసింది. మరో నాలుగు బంతులకే జెమీమాను తహుహు ఔట్ చేసింది. ఆమె తర్వాతి ఓవర్లో భారత్ 2 వికెట్లు కోల్పోయింది. గెలుపు కోసం 17 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో భారీ సిక్సర్ కొట్టిన హర్మన్...తర్వాతి బంతికే ఔటవ్వడంతో భారత్ ఆశలు కోల్పోయింది. మిథాలీకి చోటు లేదు... ఊహించినట్లుగానే తుది జట్టులో వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్కు అవకాశం దక్కలేదు. వరల్డ్ కప్ సెమీస్ వివాదం తర్వాత ఆమె టి20 టీమ్లో కొనసాగినా... పొట్టి ఫార్మాట్ నుంచి మిథాలీ రిటైర్మెంట్పై వార్తలు వస్తున్న నేపథ్యంలో మ్యాచ్లో ఆడించడం సందేహంగానే కనిపించింది. చివరకు అదే జరిగింది. కొత్త అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మిథాలీని ఆడించలేదని ఈసారి కెప్టెన్ హర్మన్ ముక్తసరి సమాధానంతో ముగించింది. నాతో పాటు జెమీమా కూడా వెంట వెంటనే ఔట్ కావడం ఫలితాన్ని మార్చింది. ఇలా జరిగినప్పుడు కోలుకోవడం చాలా కష్టం. ఈ రోజు మా ప్రణాళిక ఫలించలేదు. వచ్చే సారి మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. మేం మ్యాచ్ గెలవాలంటే నేను 20వ ఓవర్ వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. మిడిలార్డర్ కుప్పకూలిపోకుండా ఉండాలంటే అదొక్కటే సరైన మార్గం. కనీసం 18వ ఓవర్ వరకైనా క్రీజ్లో ఉంటే మిగతా వారికి సమస్య ఉండదు. తర్వాతి మ్యాచ్లో అలా చేసేందుకు ప్రయత్నిస్తాను. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. నిజానికి మేం లక్ష్యాన్ని ఛేదించాల్సింది. –స్మృతి మంధాన, భారత వైస్ కెప్టెన్ -
కిర్స్టెన్ మళ్లీ వస్తున్నాడా?
ముంబై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ మరోసారి టీమిండియా కోచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సారి పురుషుల జట్టుకు కాకుండా మహిళల జట్టుకు కోచ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. భారత మహిళల జట్టుకు నూతన కోచ్ నియామకంలో భాగంగా గురువారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇప్పుటికే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి పది మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారిని బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ ఇంటర్వ్యూ చేయనుంది. అందుబాటులో లేని వారు స్కైప్ ద్వారా కూడా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని బీసీసీఐ తెలిపింది. (కోచ్గా పొవార్నే కొనసాగించండి: హర్మన్ లేఖ) ఇంటర్వ్యూ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్తోపాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్, తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్, రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్, బ్రాడ్ హాగ్, డిమిట్రి మస్కరెన్హాస్లు ఇంటర్వ్యూకు హాజరవనున్నారు. కోచ్ పదవి కోసం ఏర్పాటు చేసిన బీసీసీఐ సెలక్షన్ ప్యానల్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. (పొవార్ కోచింగ్ ముగిసింది...) మొదటి నుంచి టీమిండియాకు నూతన కోచ్ అవసరం లేదంటూ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో సభ్యురాలైన డియానా ఎడుల్జీ వాదిస్తున్నా.. చైర్మన్ వినోద్ రాయ్ మాత్రం పొవార్ కోచింగ్పై సుముఖత వ్యక్తం చేయటం లేదు. దీంతో భారత మహిళల క్రికెట్ నూతన కోచ్ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ) కిర్స్టెన్కే అవకాశం? మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు గ్యారీ కిర్స్టెన్ ప్రధాన కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. వివాదరహితుడిగా పేరొందడం, నైపుణ్యం, కోచింగ్లో అనుభవరీత్యా కోచ్ పదవి కిర్స్టెన్నే వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతడిని మరలా కోచ్గా నియమించే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. అయితే టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మద్దతు ఉండటం పొవార్కు కలిసొచ్చే అంశం. సఫారీ మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్కు కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. స్వదేశీ కోచ్నే తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్) -
సెమీస్కు..ఒక్క అడుగు
వరుసగా రెండు విజయాల ఊపు. సమష్టిగా రాణిస్తున్న జట్టు. మరొక్క గెలుపు చాలు... సెమీఫైనల్స్ చేరినట్లే! ప్రత్యర్థి బలహీన ఐర్లాండ్! పరాజ యాలతో ఇప్పటికే ఇంటి బాటలో ఉంది! టీమిండియా చేయాల్సిందల్లా మరోసారి చెలరేగడమే. గయానా: పటిష్ట న్యూజిలాండ్ను మట్టికరిపించి... దాయాది పాకిస్తాన్ను చిత్తుచేసిన టీమిండియా మహిళల టి20 ప్రపంచ కప్ మూడో లీగ్ మ్యాచ్లో గురువారం ఐర్లాండ్తో తలపడనుంది. దీంట్లోనూ ప్రత్యర్థిని ఓడిస్తే వరుసగా మూడో గెలుపుతో టీమిండియా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. అన్ని రంగాల్లో అదరగొడుతూ, దూకుడు మీదున్న హర్మన్ప్రీత్ కౌర్ బృందానికి ఇదేమంత పెద్ద పనేం కాదు. అయితే, పోరాటపటిమ చూపే ఐర్లాండ్ను తక్కువ అంచనా వేయకపోవడం మంచిది. ఆ ఇద్దరూ రాణిస్తే... కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎంతటి విధ్వంసకరంగా ఆడుతుందో, యువ జెమీమా రోడ్రిగ్స్ ధాటి ఏమిటో కివీస్పై వారి ఇన్నింగ్స్లు చాటాయి. ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగని వెటరన్ మిథాలీ రాజ్... పాక్పై చక్కటి అర్ధ శతకంతో ఫామ్ను చూపింది. మిగిలింది స్మృతి మంధాన, వేద కృష్ణమూర్తి. వీరిద్దరూ ఐర్లాండ్పై చెలరేగితే భారత్ బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. తద్వారా గ్రూప్ ‘బి’ టాపర్ స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్కు సంసిద్ధం అయినట్లుంటుంది. నెమ్మదైన విండీస్ పిచ్లను టీమిండియా స్పిన్ చతుష్టయం హేమలత, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ సమర్థంగా ఉపయోగించుకుంటూ, పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. హేమలత, పూనమ్ రెండు మ్యాచ్ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్పైనా ఏకైక పేసర్గా తెలుగమ్మాయి అరుంధతి రెడ్డినే కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్లో తేలిపోయింది. వంద పరుగులైనా చేయలేకపోతోంది. ఛేదనలోనూ చేతులెత్తేస్తోంది. ఒకరిద్దరు తప్ప బౌలర్లూ ప్రభావవంతంగా లేరు. భారత్తో మ్యాచ్ వారికి చావోరేవోలాంటిది. గెలిస్తేనే ప్రపంచ కప్ ప్రయాణంపై ఎంతోకొంత ఆశలుంటాయి. హ్యాట్రిక్ గెలుపుతో సెమీస్లో ఆసీస్ వరుసగా మూడో విజయంతో మహిళల టి20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరింది. మూడో లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 33 పరుగులతో న్యూజిలాండ్ను ఓడించింది. తొలుత ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 53; 8 ఫోర్లు) వరుసగా రెండో అర్ధశతకంతో చెలరేగింది. ఓపెనర్ బెథాని మూనీ (26; 4 ఫోర్లు)తో పాటు రాచెల్ హేన్స్ (29; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మేఘన్ (3/25) మూడు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో మెగాన్ షట్ (3/12), సోఫీ (2/20), డెలిస్సా కిమ్మిన్స్ (2/24) ధాటికి న్యూజిలాండ్ 17.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ను ఓడించిన పాక్ మరో మ్యాచ్లో ఐర్లాండ్పై పాకిస్తాన్ 38 పరుగులతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ జవేరియా ఖాన్ (52 బంతుల్లో 74; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకం, ఓపెనర్ అయేషా జాఫర్ (22) తోడ్పాటుతో పాక్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లూసీ ఓరియల్ (3/19) కట్టడి చేసింది. అయితే, ఐర్లాండ్ బ్యాట్స్మెన్ స్వల్ప లక్ష్యాన్నీ ఛేదించలేకపోయారు. పాక్ బౌలర్లు సనా మిర్ (2/20), ఐమన్ అన్వర్ (2/25), నష్రా సంధు (2/8), అలియా రియాజ్ (2/16) ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు పరుగులు చేసే అవకాశమివ్వలేదు. ఓపెనర్ క్లేర్ షిల్లింగ్టన్ (25 బంతుల్లో 27; 5 ఫోర్లు), ఇసొబెల్ జాయ్సె (31 బంతుల్లో 30; 4 ఫోర్లు) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
రేసులో సునీల్ జోషి, రమేశ్ పవార్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ స్పిన్నర్లు సునీల్ జోషి, రమేశ్ పవార్లు పోటీపడుతున్నారు. 2017 ప్రపంచకప్లో జట్టును ఫైనల్కు చేర్చిన కోచ్ తుషార్ అరోథె... సీనియర్ క్రీడాకారిణులతో వచ్చిన విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేసింది. దీనికి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా, విజయ్ యాదవ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మమత మాబెన్, సుమన్ శర్మ, న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ మారియా ఫహే తదితరులు ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం సునీల్ జోషి, రమేశ్ పవార్ల మధ్య ఉండనుంది. జోషి టీమిండియా తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడగా... పవార్ 2 టెస్టులు, 31 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పవార్ ప్రస్తుతం మహిళా జట్టుకు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తుండగా... జోషి మొన్నటి వరకు బంగ్లాందేశ్కు కోచ్గా పనిచేశాడు. శుక్రవారం ముంబైలో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీమ్, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. -
భారత్ మరో ఘనవిజయం
కౌలాలంపూర్: మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత్ మరో ఘనవిజయాన్ని సాధించింది. ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్లో 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న హర్మన్ప్రీత్ కౌర్ గ్యాంగ్.. సోమవారం థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 66 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు సాధించారు. భారత ఓపెనర్లు మోనా మెష్రామ్(32), స్మృతీ మంధాన(29) శుభారంభాన్నివ్వగా, అనుజా పటేల్(22), హర్మన్ప్రీత్ కౌర్(27 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. దాంతో భారత జట్టు 133 పరుగుల లక్ష్యాన్ని థాయ్లాండ్కు నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో థాయ్లాండ్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 66 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. థాయ్లాండ్ క్రీడాకారిణుల్లో నటయా బూచాథామ్(21)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆ తర్వాత చాయ్వాయ్(14), సుధిరువాంగ్(12)లే రెండంకెల స్కోరును దాటారు. భారత బౌలర్లలో హర్మన్ప్రీత్ కౌర్ మూడు వికెట్లతో రాణించగా, దీప్తిశర్మ రెండు వికెట్లు సాధించారు. పూనమ్ యాదవ్, పూజా వస్త్రాకర్లకు తలో వికెట్ దక్కింది. -
టీమిండియాతో మ్యాచ్; 27 పరుగులకు ఆలౌట్
కౌలాలంపూర్:మహిళల ఆసియా కప్లో భాగంగా మలేసియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా భారీ విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ కిన్రారా అకాడమీ ఓవల్ మైదానంలో ఆతిథ్య మలేసియాతో జరిగిన టీ20లో భారత మహిళలు 142 పరుగుల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ గ్యాంగ్ నిర్ణీతో 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మంధాన(2) నిరాశపరిచినా, మరో ఓపెనర్ మిథాలీ రాజ్(97 నాటౌట్; 69 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఇక హర్మన్ప్రీత్ కౌర్(32; 23 బంతుల్లో 4 ఫోర్లు), దీప్తి శర్మ(18 నాటౌట్;12 బంతుల్లో 2ఫోర్లు)లు బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మలేసియా జట్టు 13.4 ఓవర్లలో 27 పరుగులకే చాపచుట్టేసింది. భారత మహిళలు చెలరేగి బౌలింగ్ చేయడంతో మలేసియా ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకుండా వరుస వికెట్లను చేజార్చుకుని ఘోర ఓటమిని చవిచూసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ మూడు వికెట్లతో రాణించగా, అనుజా పటేల్, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లతో మెరిశారు. శిఖా పాండేకు వికెట్కు వికెట్ దక్కింది. మలేసియా మహిళల్లో సషా ఆజ్మీ(9)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆరుగురు డకౌట్లగా నిష్క్రమించారు. -
సౌత్జోన్ చాంప్ ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: జోనల్ లీగ్ అండర్–23 మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. సౌత్జోన్ గ్రూప్లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్గా అవతరించింది. గ్రూప్లో భాగంగా ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింటిలో విజయం సాధించిన ఆంధ్ర ఒక మ్యాచ్లో పరాజయం పాలైంది. లీగ్ దశలో ఆకట్టుకున్న ఎన్. అనూష, కె. అంజలి శర్వాణి, ఇ.పద్మజ నాకౌట్ పోరులో పాల్గొనే సౌత్జోన్ అండర్–23 మహిళా జట్టుకు ఎంపికయ్యారు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సహాయంతో 279 పరుగులు సాధించిన అనూష టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో గురువారం గోవాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 181 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి కేరళతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా ఆంధ్ర అగ్రస్థానాన్ని దక్కించుకోగా, కేరళ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జీవీకే రంగరాజు, కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ శుక్రవారం క్రీడాకారులను అభినందించారు. -
మహిళల సీనియర్ క్రికెట్ జట్టులో జెమీమా
న్యూఢిల్లీ: దేశవాళీ మహిళల క్రికెట్లో దుమ్మురేపుతున్న యువ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారి ఎంపికైంది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా సిరీస్లో పాల్గొననున్న మహిళల జట్టులో 17 ఏళ్ల ఈ ముంబై అమ్మాయి చోటు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. 13 ఏళ్ల వయసులోనే అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జెమీమా రోడ్రిగ్స్ అక్కడ సత్తా చాటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు టోర్నీల్లో సెంచరీలు, డబుల్ సెంచరీలతో ఆకట్టుకుంటున్న జెమీమాను ఇటీవలే బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగిన సిరీస్కు ఎంపిక చేశారు. ఆ సిరీస్లోనూ ఆమె రాణించడంతో సీనియర్ వన్డే జట్టులో స్థానం కల్పించారు. గతేడాది ప్రపంచకప్లో భారత్ను రన్నరప్గా నిలబెట్టిన హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. భారత మహిళల జట్టు ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలతో పాటు 5 టి20 మ్యాచ్లు ఆడనుంది. కాగా ప్రస్తుతం వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. -
మహిళల క్రికెట్లోనూ భారత్ ‘ఎ’ పర్యటనలు
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు బీసీసీఐ నడుం బిగించనుంది. ఇటీవలి వన్డే ప్రపంచకప్లో భారత జట్టు అద్వితీయ పోరాటం దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో పురుషుల జట్టుకు దీటుగా మహిళా క్రికెటర్లను కూడా తీర్చిదిద్దాలని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల జట్టును కూడా భారత్ ‘ఎ’ పర్యటనలకు పంపాలని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అండర్–16 దేశవాళీ జోనల్ టోర్నమెంట్లను విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటిదాకా ఆలిండియా జూనియర్ టోర్నీలు కేవలం అండర్–19, అండర్–23కి మాత్రమే పరిమితమయ్యాయి. బుధవారం జరిగే సమావేశంలో మహిళల క్రికెట్ అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యల గురించి డయానా ఎడుల్జీ సారథ్యంలోని మహిళల క్రికెట్ కమిటీ చర్చించనుంది. ఇందులో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి సభ్యులుగా ఉన్నారు. ‘మహిళల జట్టుకు కూడా భారత్ ‘ఎ’ పర్యటనలు ఉండాలని అనుకున్నాం. అలాగే దేశవాళీ టోర్నీల నిర్వహణను కూడా సమీక్షిస్తాం. మహిళల జట్టు రిజర్వ్ బెంచ్ను కూడా పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. మన దేశవాళీ క్రికెట్కు అంతర్జాతీయ క్రికెట్కు చాలా తేడా ఉందని కెప్టెన్ మిథాలీ అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా జట్టుకు ఈ ఏడాది ఎలాంటి అంతర్జాతీయ షెడ్యూల్ లేదు. కాబట్టి ఇప్పటికే అన్ని దేశాల బోర్డులకు మేం ద్వైపాక్షిక, ట్రై సిరీస్ల కోసం లేఖలు రాశాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
మహిళా క్రికెటర్లకు ఘనస్వాగతం..
ముంబై: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడి తిరిగి స్వదేశం చేరుకున్న మిథాలీ సేనకు ఘనస్వాగతం లభించింది. బుధవారం తెల్లవారుజామున ఇంగ్లండ్ నుంచి ముంబై చేరుకున్న జట్టుకు బీసీసీఐ సిబ్బంది, అభిమానులు ఇండియా.. ఇండియా అంటూ హర్షాతిరేకల మధ్య ఘనంగా ఆహ్వానించారు. జులై 23న ఇంగ్లండ్తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 9పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్ని ఆసాంతం భారత మహిళల ప్రదర్శన భారత అభిమానుల మనసులను గెలుచుకొంది. కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్కౌర్, జులన్ గోస్వామితో పాటు పలువురు క్రికెటర్లకు ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానంలో ఘనస్వాగతం లభించింది. ఈ స్వాగతం అంచనా వేయలేదు.. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. ‘స్వదేశంలో ఇంతటి ఘనస్వాగతం లభిస్తోందని ఏ ఒక్కరమూ అంచనా వేయలేదు. ప్రస్తుతం క్రీడల్లో అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారు. వారంతా వేడుకలు చేసుకోవాలి. గతంలో మహిళా క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు. ప్రపంచకప్లో మా ప్రదర్శనతో ఇప్పుడు అందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరం’ అని మిథాలీ తెలిపారు. త్వరలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మిథాలీ సేనను సత్కరించనుంది. ఈ కార్యక్రమంలోనే గతంలో ప్రకటించిన నజరానా(ఒక్కొక్క మహిళా క్రికెటర్కు రూ.50లక్షలు)ను అందజేయనుంది. త్వరలో ప్రధాని మోదీని మిథాలీ సేన కలిసే అవకాశం ఉంది. -
పురుషుల జట్టుతో సమానంగా చూడాలి
లండన్: భారత పురుషుల జట్టుతో పాటు మహిళల క్రికెట్ జట్టుకు సమాన గౌరవం, పారితోషికాలు ఇవ్వాలని మిథాలీ రాజ్ కోరింది. ఇంగ్లండ్లో భారత హైకమిషనర్ వై.కె.సిన్హా సోమవారం రాత్రి భారత మహిళల జట్టు గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల సారథి మిథాలీ మాట్లాడుతూ ‘ఇప్పుడు అందరు మా వైపు చూస్తున్నారు. మా సహచరులకు బ్రాండింగ్ హక్కులు కూడా దక్కవచ్చు. మంచి భవిష్యత్తు కనిపిస్తుండటంతో బాలికలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకునేందుకు అవకాశాలు ఏర్పడతాయి’ అని చెప్పింది. ఇంగ్లండ్తో పరాజయాన్ని జీర్ణించుకునేందుకు మాకు కొంత సమయం పడుతుందని చెప్పింది. తదుపరి జరిగే టి20 ప్రపంచ కప్లో భారత మహిళలు దేశం గర్వించే విధంగా ట్రోఫీ సాధిస్తారని చెప్పింది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన భారత వికెట్ కీపర్ సుష్మ వర్మకు డీఎస్పీ ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించింది. టాప్–10లో హర్మన్ప్రీత్ భారత హిట్టర్ హర్మన్ప్రీత్ ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్–10లోకి దూసుకొచ్చింది. ఏడు స్థానాల్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకులో నిలిచింది. మిథాలీ రెండో స్థానంలో... పూనమ్ రౌత్ 14వ, వేద కృష్ణమూర్తి 26వ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్లో జులన్ గోస్వామి రెండో ర్యాంకుకు ఎగబాకింది. -
అదే నా కోరిక : సానియా మీర్జా
హైదరాబాద్సిటీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కోరికను వెలిబుచ్చారు. సొంత టెన్నిస్ అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది తన కోరిక అని సానియా అన్నారు. నగరంలో బాలీవుడ్ హీరోయిన్ నేహ దూపియా, సానియా మీర్జా సందడి చేశారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో బాలీవుడ్ పాటలపై అదరగొట్టే స్టెప్పులు వేశారు. వరల్డ్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహించే టోర్నమెంట్ ప్రమోషన్లో భాగంగా సానియా పిల్లలతో కలిసి టెన్నిస్ ఆడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళల ప్రపంచకప్ క్రికెట్లో భారత మహిళల జట్టు చాలా మంచి ప్రదర్శన కనపరిచిందని.. కాకపోతే ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం కొంత నిరాశ పరిచిందన్నారు. కానీ వారి పోరాటం స్పూర్తినిస్తుందన్నారు. ఇక దేశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఆటలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని, భవిష్యత్తులో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందరిని ఒకే రకంగా చూసే రోజులు రావాలన్నదే తన కోరిక అన్నారు. -
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు
కొలంబో: జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడానికి ప్రతిభే కొలమానం కావచ్చు కానీ బంధుప్రీతి, ప్రాంతీయాభిమానం, సిఫారసులు.. ఇలా ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. అయితే జాతీయ జట్టులో స్థానం కావాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనని మహిళా క్రికెటర్లను వేధించారు. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచే ఈ ఘటన శ్రీలంకలో జరిగింది. గత నవంబరులో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. అధికారులు మహిళా క్రికెటర్లను వేధించడం నిజమేనని దర్యాప్తులో తేలినట్టు లంక క్రీడల శాఖ పేర్కొంది. సుప్రీం కోర్టు రిటైర్ట్ జడ్జి నిమల్ దిస్సానాయకే సారథ్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ నివేదికను క్రీడల శాఖకు అందజేసింది. శ్రీలంక మహిళల మేనేజ్మెంట్ టీమ్ సభ్యులు పలువురు మహిళ క్రికెటర్లను లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయని విచారణలో తేలినట్టు లంక క్రీడ శాఖ తెలిపింది. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. మహిళా క్రికెటర్లను వేధించిన అధికారుల పేర్లను బయటపెట్టలేదు. -
మిథాలీ రాజ్కే పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు నాయకురాలిగా హైదరాబాదీ మిథాలీ రాజ్ మరోసారి బాధ్యతలు చేపట్టనుంది. శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ల కోసం భారత కెప్టెన్గా మిథాలీని సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గత ఏడాది సొంతగడ్డపై బంగ్లాదేశ్లో జరిగిన వన్డే, టి20లలో జూనియర్ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు మిథాలీకి విశ్రాంతినిచ్చారు. ఆ సిరీస్లో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరించింది. వన్డే జట్టులో హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాకు స్థానం లభించగా... శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడే ఇండియా ‘ఎ’ టీమ్లో హైదరాబాద్ నుంచి స్నేహ మోరె, ఆంధ్ర క్రికెటర్ ఎస్.మేఘన ఉన్నారు. ఈ సిరీస్కు పూర్తిగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఆతిథ్యమివ్వనుంది. 3 వన్డేలు, 1 టి20 మ్యాచ్కు విశాఖపట్నం వేదిక కాగా... 2 టి20 మ్యాచ్లు విజయనగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరగనున్నాయి. ఈ నెల 19నుంచి 28 వరకు సిరీస్ జరుగుతుంది. జట్ల వివరాలు వన్డే: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), కరుణ జైన్, అనఘా దేశ్పాండే, స్మృతి, పూనమ్ రౌత్, అమితా శర్మ, స్నేహ రాణా, వనిత వీఆర్, జులన్ గోస్వామి, నిరంజన నాగరాజన్, శుభలక్ష్మి శర్మ, గౌహర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్. టి20: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), కరుణ జైన్, స్మృతి, పూనమ్ రౌత్, అమితా శర్మ, జులన్ గోస్వామి, నిరంజన నాగరాజన్, శుభలక్ష్మి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, వేదా కృష్ణమూర్తి, ఏక్తా బిస్త్, సోనియా దబీర్, అనఘా దేశ్పాండే, వనిత వీఆర్.