అనకాపల్లి: పరమేశ్వరి త్రిశక్తి స్వరూపిణి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. అమ్మవారిని ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని తెలిపారు. మెయిన్రోడ్డులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట శతజయంతి వేడుకల్లో భాగంగా పరమేశ్వరి వైభవంపై ఆయన అనుగ్రహ భాషణం చేశారు. పార్వతీ పరమేశ్వరులు ఈ విశ్వానికి తల్లిదండ్రులని పేర్కొన్నారు. బిడ్డలు తప్పు చేస్తే అమ్మ మాత్రమే క్షమిస్తుందని, సీ్త్రలను దేవతలుగా పూజించే సంస్కారం భారతదేశంలో ఉందని అన్నారు. ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలని తెలిపారు. లలితా సహస్రనామం పఠిస్తే అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తారన్నారు. అమ్మవారు దుర్గాదేవిగా శక్తిని, లక్ష్మీదేవిగా ఐశ్వర్యాన్ని, సరస్వతీదేవిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తారని తెలియజేశారు. ఈ ముగ్గురమ్మలు కలిసి పరమేశ్వరి దేవిగా శక్తి స్వరూపిణియై లోకాన్ని కాపాడతారని, భక్తులను అనుగ్రహిస్తారని తెలియజేశారు. భగవంతుడిని మనం పట్టించుకోకపోయినా, భగవంతుడు మనల్ని పట్టించుకుంటారని వివరించారు. అమ్మవారిని పూజించి, అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ శతజయంతి ఉత్సవాల కమిటీ కో–చైర్మన్ గ్రంథి శేషుకుమార్, ఆలయ అధ్యక్షుడు బిళ్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖశర్మ ముందుగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు పూర్ణకుంభంతో స్వాగతించారు. ఆది, సోమవారాల్లోనూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరమేశ్వరి అమ్మవారి ప్రవచనాలు ఉంటాయని బుచ్చిరాజు తెలిపారు.
● ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ
Comments
Please login to add a commentAdd a comment