విశాఖ సిటీ: విద్యార్థులు సానుకూల దృక్ఫథం, ఆలోచనలతో ముందుకు సాగాలని ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా శనివారం ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి వీసీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. నాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఏయూ మెరుగైన స్థానం సాధించిందని, రానున్న కాలంలో దేశంలోని అత్యుత్తమ 10 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఏయూను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్ట్స్(విశాఖ) చీఫ్ ఇంజినీర్ బ్రిగేడియర్ సురేష్ రామనాథన్ మాట్లాడుతూ సిక్కిం, కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో గతంలో చేసిన నిర్మాణాలు, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులను వివరించారు. జీఐఎస్, రిమోట్ సెన్సింగ్ రంగాల్లో నిష్ణాతులుగా మారాలని సూచించారు. విభాగాధిపతి ఆచార్య కె.రాంబాబు మాట్లాడుతూ ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం బోధన, పరిశోధన, కన్సల్టెన్సీ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఆరు ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. బీఐఎస్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ డి.అఖిల్, విభాగ ఆచార్యులు కె.శ్రీనివాసరావు, సి.ఎన్.వి.సత్యనారాయణరెడ్డి, సదస్సు కన్వీనర్ ఆచార్య ఐ.శివపార్వతి, స్టూడెంట్ కన్వీనర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment