బెళుగుప్ప: అతనికి తన భార్య అంటే ఎంతో ఇష్టం. ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఆమె ఇటీవల గర్భం దాల్చగా.. సీమంతం ఘనంగా నిర్వహించాలని స్వగ్రామానికి తీసుకొచ్చాడు. బంధువులు, తెలిసిన వారందరికీ కబురు పంపాడు. చాలామంది ఇప్పటికే వారింటికి చేరుకోగా.. అంతా సందడిగా మారింది. అందరితో తన ఆనందం పంచుకున్న అతను.. వంట సరుకుల కోసం నగరానికి వచ్చాడు. వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తీవ్ర విషాదం నింపింది. పెన్నానది వంతెనను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కాలువపల్లి గ్రామం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన గంగప్ప, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు గంగాధర్ (35) తన భార్య శిల్పతో కలసి అనంతపురంలో నివాసముంటున్నాడు. ఇటీవల భార్య గర్భం దాల్చగా, ఆమెను సొంతూరికి తీసుకొచ్చాడు. శనివారం సాయంత్రం సీమంతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఆదివారం మాంసాహారం చేయిద్దామని తలచి పొట్టేళ్ల కొనుగోలుకు బైకుపై అనంతపురం మార్కెట్కు వెళ్లాడు. వాటిని కొనుగోలు చేసిన అనంతరం ఓ వాహనం బాడుగకు మాట్లాడుకుని స్వగ్రామం పంపే ఏర్పాట్లు చేశాడు. తాను బైకుపై వెనకే వస్తూ వాహనాన్ని ముందు పంపించాడు. ఈ క్రమంలోనే కాలువపల్లి వద్దకు రాగానే వేగాన్ని అదుపు చేయలేక పెన్నానది వంతెనను బలంగా ఢీకొని ఎగిరి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని బెళుగుప్ప ఎస్ఐ శివ పరిశీలించారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గంగాధర్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు. తనకు దిక్కెవరంటూ శిల్ప విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పెన్నానది వంతెనను ఢీకొని యువకుడి మృతి
గుండెలవిసేలా రోదించిన కుటుంబీకులు
కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లిలో విషాదం
Comments
Please login to add a commentAdd a comment