అనంతపురం రూరల్: నమ్మి ఇల్లు బాడుగకు ఇస్తే ఖాళీ చేయకుండా తననే బయటికి గెంటేశాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రుద్రంపేటకు చెందిన జమ్మటపాటి శాంతమ్మ తనకు జరిగిన అన్యాయాన్ని ఆదివారం విలేకరులకు వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. రుద్రంపేట గ్రామ సర్వే నెంబర్ 82–3బీలోని 3 సెంట్లలో శాంతమ్మకు రేకుల షెడ్డు ఉంది. 2002లో సూర్యనారాయణరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలసి ఇంటిని బాడుగకు తీసుకున్నాడు. ఇటీవల సూర్యనారాయణరెడ్డి తీరుపై శాంతమ్మ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని కోరారు.
అయితే, ‘ఈ ఇంటికీ మీకు ఎలాంటి సంబంధమూ లేదు, నా పేరు పైనే కరెంట్ మీటర్ ఉంది, ఇంటి పన్ను చెల్లిస్తున్నా, సర్వ హక్కులు నాకే ఉన్నాయి మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి.. ఖాళీ చేసే ప్రసక్తే లేద’ని తెగేసి చెప్పాడు. దీంతో శాంతమ్మ కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. స్థలాల ధరలు పెరగడంతో తమకు తెలియకుండానే నకిలీ పత్రాలు సృష్టించి కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతరులకు సంబంధించిన డోర్ నెంబర్పై పన్ను కడుతున్నాడని శాంతమ్మ ఆరోపించింది. పంచాయతీ అధికారులను సంప్రదిస్తే నకిలీ డోర్ నెంబర్ పై పన్ను చెల్లిస్తున్నాడని వారు తేల్చారంది. స్థలంపై ఆశలు వదులుకోకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని, ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment