బాపట్ల: భూ సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాస్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ భూమి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్యాలయాలకు వచ్చే వారి పట్ల నిర్లిప్తంగా ఉండరాదని అన్నారు. బాధితుల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి, వారు సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది డెప్యూటేషన్ కావాలని సిఫార్సులు చేస్తే సీసీఎల్ఏకు సరెండర్ చేస్తామని స్పష్టం చేశారు. చౌక దుకాణాలలో ఖాళీలను షెడ్యూల్ ప్రకారం భర్తీ చేయాలన్నా రు. ఖరీఫ్ సీజన్లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం కాగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు మంచి ధర కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. నీటి సంఘాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా సిద్ధం చేయాలన్నారు. జాతీయ రహదారుల భూసేకరణలో నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో పరిహారం అందేలా చూడాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు భూసేకరణ చేయాలని, జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమి సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment