కొత్తగూడెం మెడికల్ కళాశాల
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో వైద్య సేవలు మెరుగుపడ్డాయి. 2022 సంవత్సరంలో కొత్తగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయగా, గత నవంబర్ 15 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించారు. 150 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కలిపి 64 మంది పని చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించగా, ఇక్కడికి మరో 43 మంది రానున్నారు. కళాశాలకు అనుసంధానంగా 350 బెడ్లతో సర్వజన, మాతా శిశు ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిల్లో గర్భిణులు, బాలింతలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. గర్భిణులకు సిజేరియన్ చేయకుండా నార్మల్ డెలివరీలు చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. దీంతో ఆస్పత్రికి గర్భిణులు, బాలింతలు అధిక సంఖ్యలో వస్తున్నారు. పుట్టిన శిశువులకు కూడా అత్యాధునిక పరికరాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో సిటీ స్కానింగ్, కేన్సర్కు సంబంధించిన స్కానింగ్లు, రక్త పరీక్షలు, అరుదైన ఆపరేషన్ల సంఖ్య కూడా పెరిగింది. మొత్తంగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
ఆస్పతుల అప్గ్రేడేషన్..
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు, బూర్గంపాడు, అశ్వారావుపేట ఆస్పత్రులను అప్గ్రేడ్ చేసింది. దీంతో సదుపాయాలు, వైద్య సేవలు మెరుగుపడ్డాయి. అత్యవసర వైద్యం సైతం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా స్థానికంగానే అందుతోంది. ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయల ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండాపోయింది. రోడ్డు ప్రమాదాలు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు తల్తెతినప్పడు ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మెడికల్ కళాశాల, మాతాశిశు సంక్షేమ ఆస్పత్రి ఏర్పాటుతో ఇక్కడే వైద్యం అందుతోంది.
మరికొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు..
కొత్తగూడెం మెడికల్ కళాశాలకు 43 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వివిధ మెడికల్ కళాశాలలకు బోధనా సిబ్బందిని కేటాయించింది. ప్రస్తుతం కళాశాలలో 64 మంది టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఎంబీబీస్ విద్యార్థులు ఎటువంటి అసౌకర్యం లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. –లక్ష్మణ్రావు,
కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
నర్సింగ్ కళాశాల ప్రారంభం
కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాల సైతం ప్రారంభమైంది. 2022–23లో 58 మంది నర్సింగ్ విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున అందిస్తున్నారు. గతంలో రూ.వెయ్యి మాత్రమే ఉండేది. టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ 30 మంది వరకు పని చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఏడాది నూతన బ్యాచ్ కళాశాలకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment