నిడదవోలు : అక్టోబర్ చివరినాటికి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు ఆదేశించారు. స్థానిక రైస్మిల్లర్స్ అసోసియేషన్ హాలులో గురువారం కొవ్వూరు డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బందికి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు మాట్లాడుతూ కొవ్వూరు డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో నిడదవోలు నియోజకవర్గంలో 46, గోపాలపురం నియోజకవర్గంలో 38, కొవ్వూరు నియోజకవర్గంలో 42 ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సేవా కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 126 మంది టెక్నికల్ సహాయకులు, 126 మంది డేటాఎంట్రీ ఆపరేటర్లను నియమించామన్నారు. అక్టోబర్ చివరి నాటికి ధాన్యం కొనుగోలు చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, ఈ మేరకు సాంకేతికపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వారీగా అవసరమైన గన్ని బ్యాగులను సిద్ధం చేసుకోవాలని, మాయిశ్చర్ మెషీన్, ఇతర అనుబంధ మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా మేనేజర్ (ిసీఎస్) టి.రాధిక, జిల్లా సహకార అధికారి ఆర్. శ్రీరాములునాయుడు, ఇన్చార్జి డీఎస్వో ఎం.నాగంజనేయులు, జిల్లా వ్యవసాయాదికారి ఎస్. మాధవరావు, ఏఎస్వో జి.త్రినాథ్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment