తక్కెళ్లపాడులో దారుణహత్య | Sakshi
Sakshi News home page

తక్కెళ్లపాడులో దారుణహత్య

Published Tue, May 7 2024 11:20 AM

తక్కెళ్లపాడులో దారుణహత్య

పెదకాకాని: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను రోకలిబండతో కొట్టి హతమార్చిన ఘటన సోమవారం తక్కెళ్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు ఎస్సీ కాలనీకి చెందిన పెనుమాల ఏడుకొండలుకు నరసరావుపేట రూరల్‌ మండలం పాలపాడుకు చెందిన అంజమ్మతో సుమారు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఏడుకొండలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఏడుకొండలుకు అంజమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానం. ఈ కారణంగా తరచూ భార్యతో గొడవ పడటం, అసభ్యంగా మాట్లాడటం చేస్తూ ఉండేవాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. నాకు తెలియకుండా మీ అన్నయ్య వద్ద డబ్బులు దాచావు తీసుకురావాలంటూ మొదలైన గొడవ వివాదానికి దారితీసింది. సోమవారం భార్యతో గొడవకు దిగిన ఏడుకొండలు మజ్జిగ చేసుకుంటున్న ఆమైపె రోకలి బండతో దాడి చేశాడు. నిందితుడి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని వెంటపెట్టుకుని పోలీసులు తక్కెళ్లపాడు గాంధీనగర్‌కు చేరుకున్నారు. అప్పటికే ఇంటికి వచ్చిన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి ఆటోలో తీసుకుని చికిత్స నిమిత్తం గుంటూరు తీసుకెళ్తుండగా మార్గమద్యంలో తల్లిని పలుకరించే ప్రయత్నం చేశాడు. సమీపంలో ఉన్న మెడికల్‌ షాపులో గాయాలకు కట్టే గుడ్డ తీసుకుని తలచుట్టూ చుట్టాడు. అప్పటికే తల్లి అంజమ్మ(46) చనిపోయిందని నిర్ధారించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. కుమారుడు విజయ్‌ప్రకాష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వీరాస్వామి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

అనుమానం.. పెనుభూతమై భార్యను రోకలి బండతో కొట్టి హతమార్చిన భర్త

Advertisement

తప్పక చదవండి

Advertisement