సాక్షి, విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి తానే పోటీదారునంటూ వెళ్లడమెందుకు, అభ్యర్థిత్వం ఖరారు కానప్పుడు అలా చెప్పుకోవడం ఎందుకు ? అని చంద్రబాబు ప్రశ్నించడంతో ఖంగుతినడం నాయకుల వంతయ్యింది. రెండు జిల్లాల్లోని ముఖ్యులతో మాట్లాడకుండానే అభ్యర్థిని నిర్ణయించేద్దామా అని స్వరం పెంచడంతో ఎవరికీ మాట పెగల్లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీకి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ సిద్ధమయ్యారని, ఆయన పేరును ప్రకటిస్తే సరిపోతుందని శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో తనను కలిసిన ఒకరిద్దరు నాయకులు ప్రస్తావించడంతో చంద్రబాబు పైవిధంగా స్పందించారని విశ్వసనీయ సమాచారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ నుంచి తాను పోటీలో ఉన్నట్లు ఆలపాటి ప్రచారాన్ని వేగవంతం చేయడం స్వపక్షంతో పాటు కూటమిలోని పలువురు ముఖ్య నాయకులకు నచ్చడం లేదు. పట్టభద్రుల ఓటర్లను చేర్పించే మిషతో ఆలపాటి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. కూటమిలో చర్చకు దారి తీసిన ఈ అంశంపై స్పష్టత ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు వద్ద ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించిన తీరు గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్గా మారిందని సమాచారం.
మారు మాట్లాడని నాయకులు
ఎన్నికల్లో పోటీ ఎవరు చేస్తారనేది అటుంచితే ఓటర్లను నమోదు చేయించాల్సిన బాధ్యత పార్టీలోని నాయకులు అందరిదీ. ప్రతి నియోజకవర్గంలోని వారు చొరవ తీసుకుని ఆ పని చేయాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకోవడమో, ఓ నాయకుడికి మద్దతుగా మాట్లాడటమో ఏమాత్రం సరికాదని బాబు అనడంతో ఆయన ఎదుట ఉన్న నాయకులు మారు మాటాడలేదని తెలిసింది. అభ్యర్థిత్వం ప్రకటించాలంటే రెండు జిల్లాల్లోని ముఖ్యులతో పాటు ఇతర వర్గాల ద్వారా అభిప్రాయాలు సేకరించాలి. సానుకూలత ఏమేరకు ఉందనేది అంచనా వేసుకోవాలి. పైగా కూటమిలోని ముఖ్యులతో సంప్రదింపులు జరపాలి. ఓ అభిప్రాయానికి రావాలి. ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అన్నీ సర్దుబాటు చేసుకున్నాక నిర్ణయం తీసుకుందామని బాబు అనడం రెండు జిల్లాల నాయకులను ఆలోచనల్లో పడేసినట్లయింది.
ఓటర్ల నమోదు ..
పార్టీ నాయకుల బాధ్యత కాదా ?
అభ్యర్థిత్వం ప్రకటనకు
అభిప్రాయాలు అవసరం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
అభ్యర్థిపై చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment