మైసూరు: ప్రకృతి వైపరీత్యాలతో జరిగే పంటల నష్టాలకు ప్రత్యేక ప్యాకేజీని రైతులకు అందించాలని, అదే విధంగా గోశాల ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్ణాటక రైతు సంఘం జాతీయ రహదారిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర రైతు సంఘం ఆద్యుడు హళ్ళికెరెహుండి భాగ్యరాజ్ మాట్లాడుతూ... మైసూరు, చామరాజనగర జిల్లాలో తీవ్రమైన కరువు నేపథ్యంలో నీరు, ఆహారం లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే గోశాలలు ఏర్పాటు చేయాలని అన్నారు.
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే నాగారెడ్డి మృతి
దొడ్డబళ్లాపురం: సేడం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డా.నాగారెడ్డి పాటీల్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున సేడం పట్టణంలోని ఆయన నివాసంలో నాగారెడ్డికి గుండెపోటు వచ్చింది. మధ్యాహ్నం సేడంలోని సొంత పొలంలో అంత్యక్రియలు జరిపారు.1983–85 మధ్య నాగారెడ్డి రెండున్నరేళ్లు సేడం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో
అత్యాధునిక వసతులు
తుమకూరు: వైద్య రంగంలో పోటీ తత్వం పెరిగిందని, ఇలాంటి సమయంలో నాణ్యతతో కూడిన వైద్యం అందివ్వాలని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. సోమవారం తుమకూరు నగరంలో సిద్దార్థ వైద్యకళాశాల, ఆస్పత్రిలో ఓపీ విభాగం, నవజాత శిశువుల కోసం ఎన్సీయూ, పీఐసీయూ, లేబర్ గది, పరిశోధన ల్యాబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు.
మేత బ్యాంకులు ప్రారంభం
తుమకూరు: తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా క్యామెనహళ్లి, మధుగిరి తాలూకాలోని ఐడిహళ్లి, చిక్కనాయకనహళ్లి తాలూకాలోని హులియూరు సమీపంలో ఉన్న కారెనహళ్లితో పాటు మొత్తం మూడు గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాడి రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుపాలన, పశువైద్య విద్య సమితి శాఖ డైరెక్టర్ డాక్టర్ గిరీశ్ బాబు రెడ్డి అన్నారు. కొరటిగెరె తాలూకా క్యామెనహళ్లిలో మధుగిరిలో ఐడిహళ్లిలో గడ్డి కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
జపానంద సేవలు అమోఘం
పావగడ: స్థానిక స్వామి వివేకానంద గ్రామీణ సంఘటిత ఆస్పత్రి నిర్వాహకులు స్వామి జపానంద చేస్తున్న ఆరోగ్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర ఐజీపీ బిఆర్ రవి కాంతేగౌడ ప్రశంసించారు. స్థానిక స్వామి వివేకానంద ఆస్పత్రిని ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన జీవితంలో ఒక అనిర్వచనీయ, అద్భుతమైన, అత్యంత ఉపయుక్తమైన రోజును నేను గడిపానని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రిలో నిర్మించిన వైద్యుల అతిథి గృహాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిలోని అన్ని వైద్య విభాగాలను పరిశీలించారు. పశుగ్రాస కేంద్రాన్ని పరిశీలించి రైతులకు పశు గ్రాసాన్ని అందచేశారు. రైతులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవి అశోక్ తదితర పోలీసు అధికారులు, వైద్యలు ఉన్నారు.
దర్శకుడిపై ఫిర్యాదు
యశవంతపుర: కన్నడ దర్శకుడు సూర్యపై నటి అమూల్య గౌడ బెంగళూరు ఆర్ఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో గడిపితే సినిమాలలో అవకాశం కల్పిస్తామంటూ దర్శకుడు సూర్య తనను వేధించాడని, తన వాట్సాప్కు అశ్లీల వీడియోలు పోస్టు చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.