మైసూరు : రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్.. ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అశ్వత్థ నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మైసూరులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని, ప్రజలకు భద్రత కొరవడిందన్నారు. సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల కావడం లేదన్నారు. అయినా ఎమ్మెల్యేలు మంత్రులు నోరు మెదపడం లేదన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్నారు.
మాజీ మంత్రి ఇంటిలో
దొంగలు పడ్డారు
మైసూరు: మాజీ మంత్రి ఇంటిలో దొంగలు చొరబడి నగదు చోరీ చేశారు. ఈఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల పట్టణంలో జరిగింది. ఇక్కడి ఆదర్శ నగరలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.మహేష్ నివాసం ఉంటన్నారు. ఆయన ఇంటిలో లేడని తెలుసుకున్న దుండగులు చుట్టు పక్కలున్న ఇళ్లకు బయటి నుంచి గడియ వేశారు. అనంతరం మాజీ మంత్రి ఇంటిలోకి చోరబడ్డారు. బీరువాలోఉన్న రూ. 50 వేలు దోచుకొని ఉడాయించారు. చోరీఘటనపై మాజీ మంత్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. సీసీకెమెరాల్లో నిందితుల ఆనవాళ్లు లభించాయి. చోరీ దృశ్యాలు సీసీకెమెరాలో కనిపించాయి. కేసు దర్యాప్తులో ఉంది.
విశ్రాంత ఉపాధ్యాయుడి హత్య
దొడ్డబళ్లాపురం: సమాజంలో అనుబంధాలు, ఆప్యాయతలకు స్థానం లేకుండా పోతోంది. ఆస్తుల కోసం సొంతవారిని కడతేర్చుతున్నారు. ఇదే కోవలో అల్లుడు, మనవడు కలిసి విశ్రాంత ఉపాధ్యాయుడిని అంతమొందించారు. ఈ దారుణ ఉదంతం దక్షిణ కన్నడ జిల్లా బెళాలిలో చోటుచేసుకుంది. బాలకృష్ణభట్(83) ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసి బెళ్లాలిలో ఉంటున్నారు. ఈయన వద్ద భారీగా నగలు, ఆస్తులు ఉన్నాయి. వాటిపై అల్లుడు రాఘవేంద్ర కెథాలియ(53) కన్నేశాడు. కుమారుడు మురళికృష్ణ(20) సహకారంతో బాలకృష్ణభట్ను హత్య చేశారు. ధర్మస్థలం పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలీంచారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా రాఘవేంద్ర కెథాలియ, మురళికృష్ణలను నిందితులగా గుర్తించి కాసరగోడులో అరెస్టు చేశారు. బాలకృష్ణభట్ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, ఆస్తి కోసమే హత్య చేసినట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment