విజయవాడస్పోర్ట్స్: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ టీడీసీ అధికారులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. విజయవాడ ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కార్యాలయంలో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక అభివృద్ధి కోసం భవిష్యత్ ప్రణాళికల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాఖాపరమైన సమస్యలపై ఆరా తీశారు. ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తానని, అధికారులంతా ఐకమత్యంతో పని చేసి పర్యాటక సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఈ సంద ర్భంగా సూచించారు. రాష్ట్రం పర్యాటకుల స్వర్గ ధామమని, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం, అగ్రి టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షిస్తానని, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ వహించాలని కోరారు. సినిమా థియేటర్లలో పర్యాటకంపై లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న కెనాల్ అభివృద్ధికి చర్యలు తీసుకొని బోటింగ్, రిసార్ట్లు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానన్నారు. సినీ నిర్మాతలతో త్వరలో సమావేశమవుతానన్నారు.విశాఖ, భీమిలి ఉత్సవ్, ఫ్లెమింగ్ ఫెస్టివల్, అరకు బెలూన్ ఫెస్టివల్, నాగాయలంక బోట్ రేస్, గండికోట ఫెస్టి వల్, ఎఫ్–1 హెచ్ 20 ఫార్ములా రేస్, కాకినాడ బీచ్ ఫెస్టివల్, నేచురల్ హెరిటేజ్ ఫెస్టివల్, లేపాక్షి ఫెస్టివల్ ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రికి అధికారులు సూచించారు. ఈ సమావేశంలో ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎ.ఎ.ఎల్.పద్మావతి పాల్గొన్నారు.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
Comments
Please login to add a commentAdd a comment