జిల్లా జడ్జి అరుణ సారిక
మొవ్వ: యువత మద్యం, మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలు పాడుచేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి అరుణసారిక సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మెలిగి, వారిని కాపాడుకోవాలని పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృష్ణాజిల్లా, జిల్లా పరిపాలన యంత్రాంగాలు సంయుక్తంగా మాదకద్రవ్య బాధితులకు న్యాయ సేవలు, మాదకద్రవ్యాల ముప్పు నిర్మూలన (నల్సా 2015), వయోవృద్ధుల న్యాయ సేవలు(నల్సా 2016) తదితర అంశాలపై నూతన తరహా న్యాయ సేవల శిబిరాన్ని శనివారం మొవ్వలోని మండవ జానకి రామయ్య కల్యాణ మండపంలో నిర్వహించారు. తొలుత జిల్లా జడ్జి అరుణ సారిక, మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, డీఎల్ఎస్ కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, మొవ్వ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పి.రాజన్ ఉదయ్ ప్రకాష్, ఎస్పీ గంగాధరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలు, వృద్ధుల సంక్షేమానికి అమలవుతున్న చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ కామరాజు, అదనపు డీఎంహెచ్ఓ ఎ.వెంకట్రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మౌనిష, ఉయ్యూరు ఆర్డీఓ షారోన్, తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీఓ జె.విమాదేవి పాల్గొన్నారు. అనంతరం వివిధ శాఖల స్టాల్స్ను అధికారులు సందర్శించారు. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులకు సీమంతాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment