No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Aug 24 2024 1:00 AM | Last Updated on Sat, Aug 24 2024 1:00 AM

-

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ ఎన్నిక శుక్రవారం లాంఛనంగా జరగగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పాన్‌గల్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీ పరిధిలో మొత్తం 77 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు (పీఏసీఎస్‌) ఉండగా.. 15 డైరెక్టర్‌ స్థానాలు ఉన్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 19న డీసీసీబీ ఎన్నికలు నిర్వహించగా.. చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన మక్తల్‌ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నిజాంపాషాను ఎన్నికయ్యారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో నూతన చైర్మన్‌ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్‌, ఎన్నికల అధికారి టైటస్‌పాల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఒక్కరే మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియలో విష్ణువర్ధన్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇద్దరు డైరెక్టర్లు చిట్యాల నిజాంపాషా, మంజులారెడ్డి గైర్హాజరయ్యారు.

అనేక ప్రయత్నాలు చేసి..

ఎన్నో సంవత్సరాలుగా రైతు సేవలో ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి రెండుసార్లు కొల్లాపూర్‌ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత డీసీసీబీ చైర్మన్‌ పదవి కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఇక్కడి చైర్మన్‌ నిజాంపాషా రాజీనామా చేయడంతో నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి ద్వారా చైర్మన్‌ పదవికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 మంది డైరెక్టర్లు ఉండగా.. 13 మంది ఎన్నికకు హాజరయ్యారు. మెజారిటీ డైరెక్టర్లు విష్ణువర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌ ఎన్నిక విషయంలో రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సహకరించినట్లు కాాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్లు రాజకీయంలో ఉంటూ తాను ఆశించిన చైర్మన్‌ పదవి ఎట్టకేలకు దక్కడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కల నెరవేరినట్లు అయింది. చైర్మన్‌గా ఎన్నికై న విష్ణువర్ధన్‌రెడ్డిని ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పర్ణికారెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సహకార బ్యాంకు పాలక మండలి గడువు మరో ఆరు నెలల్లో ముగియనుంది. ఈ సందర్భంగా చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, డీసీసీబీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement