జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళాశక్తి పథకం కింద యూనిట్ల గుర్తింపును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. అలాగే పట్టణ ప్రాంత మహిళా సంఘాలు ఇంకా బాగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోనీ మీటింగ్హాల్లో మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రాంత మహిళా సంఘాల కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని విషయాలపై మహిళా సంఘాలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అంతర్గత రుణాలు, పొదుపు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. సంఘాల్లో కొత్తవారిని సభ్యులుగా చేర్పించడం, ఎక్కువ గ్రూపులు ఏర్పాటు చేయడం వంటి వాటిపై సీఓలు, ఆర్పీలు శిక్షణ ఇవ్వాలన్నారు. మహిళా సంఘాలు ప్రత్యేకించి ఆర్పీలు పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. మహిళాశక్తి పథకం కింద ఎక్కువ యూనిట్లను గుర్తించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళాశక్తి పథకం కింద యూనిట్లు గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. తరచూ సమావేశాలు నిర్వహించుకోవడమే కాకుండా కొత్తకొత్త విషయాలను సభ్యులకు తెలియజేయాలని, కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తే పట్టణ ప్రాంత మహిళా సంఘాలు బలోపేతం అవుతాయని తెలిపారు. అనంతరం మెప్మా పీడీ సురేందర్ రెడ్డి పట్టణ ప్రాంత మహిళా సంఘాలు, సభ్యులు, గ్రూపులు, తదితర అంశాలను వివరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాజయ్య, సురేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment