మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈ–కుబేర్ వ్యవస్థను రద్దు చేసి.. ట్రెజరీ ద్వారానే అన్ని రకాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని టీఎన్యూఎస్ జిల్లా అధ్యక్షుడు మావిళ్ల లక్ష్మణ్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండేళ్లుగా ఉపాధ్యాయుల భవిష్య నిధి, సరెండర్ లీవు, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇంత వరకు విడుదల కాలేదన్నారు. వీటన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు ఇవ్వాలన్నారు. మిగిలిపోయిన పండిట్, పీఈటీల సర్వీస్ను అప్గ్రెడేషన్ చేయాలన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి షాహెదా సుల్తానాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్యూఎస్ టీఎస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, కోశాధికారి నర్సింహులు, నాయకులు శ్రీనివాస్గౌడ్, కృష్ణయ్య, ఆవుల శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని మిల్లీమహాజ్ మహబూబ్నగర్ చీఫ్ ప్యాట్రన్ ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్పాష, కన్వీనర్ తఖీ హుస్సేన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రపాలకులు ముస్లింలతోపాటు అన్ని వర్గాల ప్రజల పట్ల వివక్ష చూపించారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింలలో కొంత ఆశలు పెరిగాయని, కానీ, గత ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారని, ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ముస్లిం మైనార్టీలు కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. ముస్లింలు ఈ నెల 17న డిమాండ్ డేగా జరుపుకోవాలని కోరారు. ముస్లింలకు 8శాతం రిజర్వేషన్లు కల్పించాలని, సబ్ప్లాన్ అమలు చేసి విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఉపాధి రంగాల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, మైనార్టీలకు సమాన అవకాశాల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఈనెల 17న జిల్లాకేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో కోకన్వీనర్ ఖుద్దూస్బేగ్, ప్రతినిధులు అహ్మద్ సనా, అబ్దుల్లా సున్నీ, నూరుల్లా, ఆబిద్ మోహియొద్దీన్, అబ్దుల్ సమీ, ఉస్మాన్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment