ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సోమశిల ఎకో పార్క్
సాక్షి, నాగర్కర్నూల్: పచ్చని నల్లమల కొండల నుంచి నీలం రంగులో ప్రవహించే కృష్ణానది పరవళ్లు చూపరులను మంత్రముగ్దులను చేస్తాయి. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లోని కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణాతీరంలోని సోమశిల ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వీకెండ్ రోజుల్లో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్టూడెంట్స్, ఫ్రెండ్స్ గ్రూపులుగా ఏర్పడి ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోమశిలకు వస్తున్న పర్యాటకుల సౌకర్యం కోసం ప్రభుత్వం కృష్ణానది తీరంలో కాటేజీలను ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ కాటేజీల్లో వసతి, భోజనం, స్విమ్మింగ్ పూల్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు సోమశిల గ్రామంలో పదుల సంఖ్యలో ప్రైవేటు రిసార్ట్లు, కాటేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం శని, ఆదివారాల్లో ఇవన్నీ పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. కృష్ణానదిలో విహరించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లాంచీ నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి 200 కి.మీ. దూరంలో సోమశిల ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో సోమశిల సమీపంలో ఎకో పార్కును నిర్మించగా, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. నల్లమల అడవి, సఫారీ, కృష్ణాతీరంలోని అందాలను ఒకేసారి ఆస్వాదించేలా సరికొత్త ఎకోటూరిజం టూర్ ప్లాన్ను అటవీశాఖ రూపొందించింది. త్వరలోనే ఈ తరహా టూర్ ప్లాన్ను అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment