నీలకంఠేశ్వరా.. నీళ్లు తాగేదెట్టా.. | - | Sakshi
Sakshi News home page

నీలకంఠేశ్వరా.. నీళ్లు తాగేదెట్టా..

Published Tue, Feb 4 2025 1:30 AM | Last Updated on Tue, Feb 4 2025 1:30 AM

నీలకం

నీలకంఠేశ్వరా.. నీళ్లు తాగేదెట్టా..

ప్రత్యామ్నాయంగా ఇలా చేస్తే మేలు..

● ప్లాస్టిక్‌ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా బయో డిస్పోజబుల్‌ బాటిళ్లను అనుమతించాలి.

● ఈ బాటిళ్లు అన్ని దుకాణాల్లో లభ్యమయ్యేలా, సామాన్యులకు సైతం అందుబాటులో ధర ఉండేలా అధికారులు చూడాలి

● ప్లాస్టిక్‌ బాటిళ్లను వన్యప్రాణులు, జంతువులు తినకుండా అటవీమార్గంలో ప్లాస్టిక్‌ బాటిళ్ల సేకరణకు గతం కంటే ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని నియమించాలి.

● సేకరించిన వాటిని ఎప్పటికప్పుడు సున్నిపెంటలోని ప్రాసెసింగ్‌ మిషన్‌ ద్వారా క్రస్‌ చేయాలి.

పర్యావరణ పరిరక్షణ పేరుతో

ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ నిషేధించిన

అటవీశాఖ

శ్రీశైలం, సున్నిపెంటతో పాటు

పెచ్చెర్వులోనూ విక్రయించరాదు

ఇప్పటికే వ్యాపారులు,

దుకాణ దారులకు నోటీసుల జారీ

నిషేధంతో పాదయాత్ర భక్తుల

తాగునీటికి ఇబ్బందులు

శ్రీశైలంలో గాజు సీసాతో

లీటర్‌ నీళ్లు రూ.60

భారమవుతుందంటున్న

సామాన్య భక్తులు

లీటర్‌ నీళ్లు కొనాలంటే రూ.60 వెచ్చించాల్సిందే

శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనునిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీశైలం, సున్నిపెంట గ్రామంలో భక్తులు, యాత్రికులు, స్థానికులు నీళ్ల బాటిల్‌ కొనాలంటే గాజు సీసానే తీసుకోవాలి. ఇందులో లీటర్‌ నీళ్లు తాగి ఆ సీసను దుకాణదారుడికి ఇస్తే రూ.30, వెంట తీసుకెళ్తే రూ.60 చెల్లించాలి. శ్రీశైలానికి ఎక్కువగా సామాన్య భక్తులు వస్తారు. ప్రతి ఒక్కరూ లీటర్‌ తాగునీటికి రూ.60 వెచ్చించి బాటిల్‌ కొనుగోలు చేయాలంటే భారమవుతుంది.

శ్రీశైలంటెంపుల్‌: పర్యావరణ పరిరక్షణ పేరుతో అటవీశాఖ శ్రీశైలంలో ప్లాస్టిక్‌ బాటిళ్లను నిషేధించింది. అటవీ పరిధిలోని పెచ్చెర్వు ప్రాంతంలోనూ వాటిని విక్రయించకూడదని నోటీసులు జారీ చేసింది. దీంతో శ్రీగిరిలో లీటర్‌, రెండు లీటర్ల ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.రెండువారాల్లో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. చాలా మంది నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్రగా వస్తుంటారు. మధ్యమధ్యలో దాహం వేస్తే తీర్చుకునేందుకు వెంట లీటర్‌, రెండు లీటర్ల ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు తెచ్చుకుంటారు. అటవీశాఖ వాటిని నిషేధించడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

వన్యప్రాణులు మృత్యువాత

పడుతున్నాయని నిషేధం

నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ముఖ్యమైన ప్రదేశం శ్రీశైలం. ఈ ప్రాంతంలో పెద్దపులి, చిరుతపులులు, అనేక వన్యప్రాణులు, అటవీజంతువులు సంచరిస్తుంటాయి. పాదయాత్రగా వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను వాడి పారవేస్తారు. వాటిని వన్యప్రాణులు తిని మృత్యువాత పడుతున్నాయని అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కొద్ది నెలలుగా శ్రీశైలం, సున్నిపెంటతో పాటు పెచ్చెర్వు ప్రాంతంలో ఎవరైనా ప్లాస్టిక్‌ బాటిళ్లు అమ్మితే దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. రానున్న మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు వాటర్‌బాటిళ్లతో పాటు కూల్‌ డ్రింక్‌, వాటర్‌ ప్యాకెట్లు, బ్యాగులు, కవర్లు, గ్లాసులు, ప్లేట్స్‌, ప్లాస్టిక్‌ కవర్‌తో కూడిన ఏ వస్తువులను విక్రయించరాదని శ్రీశైలం రేంజ్‌ అటవీశాఖ అధికారి నోటీసులు సైతం జారీ చేశారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొనడంతో వ్యాపారులతో పాటు సామాన్య భక్తులు ఆందోళన చెందుతున్నారు.

ఈసారి పాదయాత్రికులకు ఇబ్బందే

మునుపెన్నడూ లేనివిధంగా మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాలకు ప్లాస్టిక్‌ లీటర్‌, రెండు లీటర్ల బాటిళ్లపై నిషేధం విధించడంతో పాదయాత్రగా వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నల్లమల అటవీప్రాంతంలో సుమారు 46 కిలోమీటర్ల నడిచి శ్రీశైలానికి చేరుకోవాల్సి ఉంటుంది. బైర్లూటీ. పెచ్చెర్వు ప్రాంతంలో మాత్రమే తాగునీటి సౌకర్యం ఉంటుంది. పెచ్చెర్వు నుంచి భీమునికొలను వరకు ఎటువంటి తాగునీటి వసతి ఉండదు. నల్లమల అడవిలో భక్తులు నడవడమే కష్టం. లీటర్‌, రెండు లీటర్ల వాటర్‌ బాటిళ్ల నిషేధంతో వెంట ఐదు లీటర్ల వాటర్‌ క్యాన్‌ తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ఉత్సవాల సమయంలో మినహాయింపు ఇవ్వాలని, లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నీలకంఠేశ్వరా.. నీళ్లు తాగేదెట్టా..1
1/1

నీలకంఠేశ్వరా.. నీళ్లు తాగేదెట్టా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement