బాల్కొండ: మండలంలోని జలాల్పూర్కు చెందిన గాండ్ల రాజేశ్వర్(52) డెంగీ వ్యాధితో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి వెళ్లిన రాజేశ్వర్ తీవ్ర జ్వరానికి గురి కావడంతో పది రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. దీంతో నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్వర్ శనివారం అర్థరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
పిట్లం: భార్య కాపురానికి రావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కంభపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై నీరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంబదాస్(30)కు రెండేళ్ల క్రితం రజితతో వివాహమైంది. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. డ్రైవర్గా పనిచేసే అంబదాస్ మద్యానికి అలవాటుపడి పని మానేశాడు. దీంతో ఇంట్లో గొడవలు కావడంతో మూడు నెలల క్రితం భార్య రజిత తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అంబదాస్ ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
సుభాష్గార్డెన్లో పర్యాటకులపై దాడి
● నలుగురికి గాయాలు
మాక్లూర్: మండలంలోని మదన్పల్లి శివారులో ఉన్న సుభాస్గార్డెన్లో ఆదివారం పర్యాటకులు, గార్డెన్ యాజమాన్యం మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబం సుభాష్గార్డెన్కు వెళ్లింది. సదరు కుటుంబంలోని యజమాని స్విమ్మింగ్పూల్కు ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో గార్డెన్ నిర్వాహకులు, పర్యాటకుల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో సుభాష్గార్డెన్కు చెందిన వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేయడంతో నలుగురు పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని చికిత్స జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సుభాష్గార్డెన్ యజమాని బాధితులపైనే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.