![మాట్లాడుతున్న జిల్లా ప్రజా రవాణా అధికారి టీవీఎస్ సుధాకర్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/12/11ppm106a-370059_mr_0.jpg.webp?itok=2EIBz0SJ)
మాట్లాడుతున్న జిల్లా ప్రజా రవాణా అధికారి టీవీఎస్ సుధాకర్
పార్వతీపురం టౌన్: ప్రయాణికులే మా దేవుళ్లని, వారికి నాణ్యమైన సేవలందించడంలో భాగంగా సమస్యలు తెలుసుకునేందుకు, సలహాలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు జిల్లా ప్రజారవాణా అధికారి టీవీఎస్ సుధాకర్ శనివారం తెలిపారు. డీపీటీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 23 మంది ప్రయాణికులు ఫోన్చేసి సూచనలు, తమ సమస్యలు చెప్పారన్నారు. 13 మంది పార్వతీపురం నుంచి పెదబుడ్డిడి వయా రావివలస ఎన్/ఓ బస్సును పునరుద్ధరించాలని కోరినట్టు వెల్లడించారు. కండక్టర్ దురుసు ప్రవర్తనపై ఒకరు ఫిర్యాదు చేశారన్నారు. పార్వతీపురం నుంచి బత్తిలి, మసిమండ ఎన్/ఓ, కూనేరు ఎన్/ఓ సరవపాడు, రాజ్యలక్ష్మీపురం, కళ్లికోట, సంగంవలస గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మరికొందరు కోరారన్నారు. గుచ్చిమి, మరిపివలస, సీతానగరం, కోటవానివలస వద్ద బస్సులు ఆగేలా చూడాలని కొందరు ప్రయాణికులు విజ్ఞప్తిచేశారని తెలిపారు. పార్వతీపురం పట్టణ శివారులో సురేష్ స్కూల్కి, నర్సిపురం మధ్యలో ఉన్న పద్మ పేరంటాలు గుడివద్ద రిక్వెస్ట్ స్టాప్ బోర్డు ఏర్పాటుచేయాలని, వైకేఎం కాలనీ, వెంకంపేట గోరీల వద్ద టాల్ట్రా డీలక్స్ బస్సులకు స్టాప్ సదుపాయం కల్పించాలని కొందరు విజ్ఞప్తిచేశారన్నారు.
పార్వతీపురం నుంచి తాడికొండకు అదనపు ట్రిప్లు ఏర్పాటు చేయాలని మరొకరు కోరారన్నారు. అర్జీలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి వాటి వరిష్కారదిశగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment