నెల్లిమర్ల రూరల్: ప్రసిద్ధ విష్ణు క్షేత్రం తెలంగాణలోని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ స్వామిపై జరిగిన దాడిని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి ఖండించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో భజన బృందాలతో కలిసి రామనామ సంకీర్తనతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్యం పేరుతో కొంత మంది వ్యక్తులు రాముడి స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శ్రీరాముడు ఎప్పుడూ రాజ్యం కోసం తాపత్రయ పడలేదని గుర్తు చేశారు. రంగరాజన్ స్వామిపై జరిగిన దాడి సాక్షాత్తు శ్రీరాముడిపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు గ్రామ గ్రామాన రామనామం చేస్తూ తిరిగే భజన బృందాలే నిజమైన రామభక్తులన్నారు. శ్రీరాముడి పేరుతో హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక వ్యవస్థలపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్మ పరిరక్షణకు రంగరాజన్ స్వామి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, దేశ వ్యాప్తంగా విశిష్టత కలిగిన వ్యక్తిపై జరిగిన దాడిని అన్ని ధార్మిక సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. కార్యక్రమంలో కళాక్షేత్రం విజయనగరం జిల్లా కన్వీనర్ పతివాడ సత్యనారాయణ, జై భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, జైహో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్రిమూర్తులు పాల్గొన్నారు.
అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి
భజన బృందాలతో కలిసి రామనామ సంకీర్తనతో నిరసన
Comments
Please login to add a commentAdd a comment