రైతు బంధు కోసం పెట్టిన రూ. 7 వేల కోట్లు ఏమయ్యాయి: కేటీఆర్‌ | KTR Aggressive Comments On Revanth Congress Govt Over Water issue | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతుతో సమానం: కేటీఆర్‌ ధ్వజం

Published Sat, Apr 6 2024 3:22 PM | Last Updated on Sat, Apr 6 2024 3:55 PM

KTR Aggressive Comments On Revanth Congress Govt Over Water issue - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్.. ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌ ప్రభుత్వం దున్నపోతుతో సమానమని విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయిన నాలుగు నెల‌ల్లోనే వ్యవసాయం సంక్షోభం వస్తుందని ఊహించలేదని.. ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారే అని మండిపడ్డారు. 

ఈ మేరకు రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన రైతుదీక్ష‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. కాంగ్రెస్ హామీలు న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోయారని అన్నారు. పాలిచ్చే బ‌ర్రెను పంపించి దున్న‌పోతును తెచ్చుకున్నామ‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారని తెలిపారు. ఎన్నిక‌ల ముందు రైతుబంధు కోసం రూ. 7 వేల కోట్లు సిద్ధంగా పెట్టామని అయితే రైతుబంధు ఇవ్వొద్ద‌ంటూ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ ఆపిందని గుర్తు చేశారు. రైతు బంధు కోసం పెట్టిన డ‌బ్బులు ఏమ‌య్యాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈసీకి రేవంత్‌ లేఖ రాయాలి
రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని సీఎం, మంత్రులు చెబుతున్నారని.. పాలన త‌న చేతుల్లో లేద‌ని సీఎం రేవంత్ అన‌డం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంట‌ల‌కు బోన‌స్ ఇస్తామ‌ని ఈసీకి రేవంత్ లేఖ రాయాలని అన్నారు. ఇందుకు తాము కూడా మద్ద‌తిస్తామన్నారు. 
చదవండి: నేడు కాంగ్రెస్‌ జనజాతర సభ.. తుక్కుగూడ నుంచే సమర శంఖం

కాంగ్రెస్ తెచ్చిన క‌రువు
కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని కాంగ్రెస్‌ మంత్రులు అంటున్నారు. 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణ‌కు నీళ్లు రావాలంటే ఎత్తిపోత‌లే మార్గం. అందుకే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల‌, ఎల్లంప‌ల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావ‌రి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావ‌రిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయ్. ఎర్ర‌టి ఎండ‌ల్లో కూడా చెరువులు మ‌త్త‌ళ్లు దూకినాయి.  ఇది కాలం తెచ్చిన క‌రువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన క‌రువని అన్నారు.

కేసీఆర్‌ వస్తున్నారని నీళ్లు వదిలారు
‘300 పిల్ల‌ర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్ల‌ర్లు కుంగాయి. కేసీఆర్‌ను బ‌ద్నాం చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తుంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింద‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నారు. యూట్యూబ్‌లో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌లు చూసి ఆగం కావొద్దు. కేసీఆర్ వస్తున్నార‌ని అన్నారం, సుందిళ్ల నీళ్లు వ‌దిలారు. హ‌రీశ్‌రావు హెచ్చ‌రిస్తే కూడ‌వెళ్లి వాగుకు నీళ్లు ఇచ్చారు. ఇన్నాళ్లు నీళ్లు ఉన్నా కూడా ఇవ్వ‌లేద‌ని అర్థ‌మైంది క‌దా..

కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింది. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని మోసం చేశారు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామ‌ని మోసం చేసింది. రూ. వ‌రికి క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇస్తామ‌ని ఇవ్వ‌డం లేదు. ఎర్ర‌టి ఎండ‌ల్లో కేసీఆర్ రైతుల ద‌గ్గ‌రికి వెళ్లి భ‌రోసా ఇచ్చారు. రైతుల హక్కుల తరుపున కొట్లడుదాం. రేపటి నుంచి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్‌పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం.  మిష‌న్ భ‌గీర‌థ అప్ప‌గించినా నీళ్లిచ్చే తెలివి కాంగ్రెస్‌కు లేదు. వండిన అన్నం వ‌డ్డించే తెలివి కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేదని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి.’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement