సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు.. ఇలాంటి వెంటనే ఆపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు.
కాగా, వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న ఘటన జరిగితే.. మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?. ఒక్క పిన్నెల్లిపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలానే దాడులు కొనసాగుతున్నాయి. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ.. దౌర్జన్యం కాదు.
టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. దాడుల రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు. లెక్క జమ చేసి ప్రజలు బాబుకు గట్టిగా జవాబిస్తారు. ప్రతీ గ్రామం, మండల పరిధిలో రెడ్ బుక్ల పేరుతో దాడులు చేస్తున్నారు. టీడీపీ వాళ్లే కొట్టి.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. దాడుల రాజకీయాలు మంచిది కాదు.. దగ్గరుండి దాడులను పోత్సహించడం దుర్మార్గం. ఇలాంటివి వెంటనే ఆపాలని హెచ్చరిస్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రజల్లో వ్యతిరేకతతో వైఎస్సార్సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10 శాతం ఓట్లతో చంద్రబాబు గెలిచారు. కులమతాలు చూడకుండా మేము సంక్షేమం అందించాం. ప్రజలు ఇప్పటికీ మా వెంటే ఉన్నారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి. టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా, అమ్మ ఒడి అందలేదు. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా డబ్బులు అందలేదు. రైతు భరోసా రూ.20వేల హామీ ఏమైందో తెలియదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment