నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా మోపిదేవి
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా మోపిదేవి ఉదయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం జీజీహెచ్లోని లెక్చర్ గ్యాలరీలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కో ఆపరేటివ్ శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బీసీ మాలకొండయ్య వ్యవహరించారు. జిల్లాలోని 324 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా కె.సుజాత, కార్యదర్శిగా కొత్తపల్లి మంజేష్, కోశాధికారిగా మండవ సుజాతలతో పాటుగా ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డి.నాగరాజా కుమారి, బి.వి.రామలక్ష్మి, యం.మహేష్, షేక్ జానీబాష, ఎస్కె మహబూబ్ బీబీ ఎన్నికయ్యారు.
31 లోపు దరఖాస్తులు అందజేయాలి
ఒంగోలు సిటీ: ఒంగోలు డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా పనిచేసేందుకు అర్హత కలిగిన జిల్లా ప్రభుత్వ/జిల్లా పరిషత్/ మునిసిపల్ యాజమాన్యంలో పనిచేసేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ నెల 31 వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు వారి సర్వీస్ వివరాలతో పాటుగా టెక్నికల్ సర్టిఫికేట్ను జతపరచి సంబంధిత ప్రధానోపాధ్యాయులు/మండల, జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా కార్యాలయానికి ఈ నెల 31వ తేదీ లోపల అందజేయాలని డీఈఓ కోరారు. ఎస్జీటీ తోపాటు కంప్యూటర్ అనుభవం కలిగి ఉండి, పీజీడీసీఏ కోర్సు చేసి ఉండాలన్నారు.
ప్రభుత్వం నుంచి రాగానే నష్టపరిహారం ఇస్తాం
మార్కాపురం: అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేల ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే రైతుల ఖాతాల్లో జమవుతాయని మార్కాపురం వ్యవసాయాధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. బుధవారం సాక్షిలో శ్రీసేద్యం గగనంశ్రీ శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామని చెప్పిందని, ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదని చెప్పారు. కరువు, భారీ వర్షాల వలన నష్టపోయిన రైతుల జాబితాను ఎప్పటికప్పుడు తయారుచేసి నివేదికలను అధికారులకు పంపుతున్నామని అన్నారు. ఈ పథకాలకు, నష్టపరిహారం సంబంధించిన నిధులు ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ఈ విషయాలను అధికారులకు తెలిపి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పూర్వపు డీపీవోపై విచారణ పూర్తి
● బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు
● కలెక్టర్ కు నివేదిక అందజేసిన త్రిసభ్య కమిటీ
ఒంగోలు అర్బన్: జిల్లా పంచాయతీ కార్యాలయంలో గ్రేడ్ 5, 6 సెక్రటరీల (సచివాలయ ఉద్యోగుల) సాధారణ బదిలీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి లోకేశ్వరరావు చైర్మన్గా మరో ఇద్దరు అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ పూర్తి చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను కలెక్టర్కు అందజేశారు. సాధారణ బదిలీల్లో నిబంధనలకు విరుద్ధంగా పూర్వపు డీపీవో, పలువురు ఉద్యోగులు అవినీతికి పాల్పడి బదిలీలు నిర్వహించినట్లు ఫిర్యాదు వచ్చాయి. ఇప్పటికే డీపీవో కార్యాలయం ఏవోతో పాటు మరో జూనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పూర్వపు డీపీవో ఉషారాణితో పాటు సచివాలయ ఉద్యోగులను త్రిసభ్య కమిటీ క్షుణ్ణంగా విచారించింది. విచారణలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డబ్బును ఆన్లైన్ పేమెంట్ విధానంలో ఇచ్చినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా డీపీవో కార్యాలయం ఉద్యోగులు డీపీవో చెప్పినట్లు చేశామని తెలిపినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలను కమిటీ పరిశీలించింది. మొత్తం మీద విచారణ పూర్తి చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక కలెక్టర్ చేతికి వెళ్లింది. నివేదిక ఆధారంగా ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment