గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంలో చతికిలపడిన టీడీపీ.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఏదైనా చేసేందుకు వెనుకాడటంలేదు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్మోహన్రెడ్డికి ఉన్న అశేష ఆదరణతో ఏమి చేయాలో పాలుపోక వినూత్న పోకడలను సైకిల్ పార్టీ తెరపైకి తెస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పాతరేసేలా డబ్బులను విచ్చలవిడిగా పారిస్తోంది. ఓటుకు ఇంత మొత్తమని నిర్దేశించి.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు శ్రీకారం చుట్టింది. పెత్తందారుల పక్షాన నిలిచే ఆ పార్టీ తరఫున నెల్లూరు లోక్సభ, కోవూరు, సిటీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి, నారాయణ వేల కోట్లను ఖర్చు చేస్తుంటంతో ముక్కున వేలేసుకోవడం జిల్లా ప్రజల వంతవుతోంది.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ప్రాంతాలను బట్టి ఓటుకు ఇంత మొత్తాన్ని పంపిణీ చేయాలనే అంశంపై నారాయణ తన టీమ్కు శిక్షణ ఇప్పించారని సమాచారం. స్లమ్ అయితే రూ.ఐదు వేలు, ఇతర ప్రాంతాల్లో రూ.రెండు వేల చొప్పున పంపిణీ చేయించాలనే స్కెచ్ వేసి.. ఆ మేరకు నోట్ల కట్టలను సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మా దారి అడ్డదారి.. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’ అనే రీతిలో జిల్లాలో టీడీపీ రాజకీయాలు సాగిస్తోంది. డబ్బులను నీళ్లలా పారిస్తూ ఓట్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ స్కెచ్ వేసింది. ఇప్పటికే నగదు ప్రలోభాలకు గురిచేసి నేతలను ఇష్టానుసారంగా ఆ పార్టీ కొనుగోలు చేసింది. అయితే వీరితో ఓట్లు రాలడంలేదనే సత్యాన్ని గ్రహించిన ఆ పార్టీ అభ్యర్థులు తాజాగా ఓట్లను నోట్లతో లాక్కునే దుష్ట సంప్రదాయానికి తెరలేపారు.
ప్రజాబలాన్ని అడ్డుకోవడమే అజెండా
గత ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ ఓటమిపాలయ్యారు. అనంతరం నెల్లూరు నుంచి మాయమై.. తాజాగా ఎన్నికల సమయంలో ప్రత్యక్షమైన ఆయకు ఓటమి భయం పట్టుకుంది. ఈ తరుణంలో నియోజకవర్గానికే రూ.200 కోట్లను కేటాయించారనే టాక్ నడుస్తోంది. రెండు వేల మందికి రెండు నెలలుగా జీతాలిచ్చి పోషిస్తున్నారు. మరోవైపు ఎన్నికల కార్యకలాపాలను తన ఉద్యోగుల ద్వారా ఆయన సాగిస్తున్నారు. వీరికి నెల జీతాల కోసమే కోట్లల్లో ఖర్చు చేస్తున్నారంటే గెలుపుపై ఆయనకెంత భయమో అర్థమవుతోంది.
ఏమయ్యా.. వేమిరెడ్డి..?
టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి డబ్బు మూటలను భారీగా డంప్ చేశారనే ప్రచారం గుప్పుమంది. తన సతీమణి, కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ఖర్చు కోసం రూ.400 కోట్ల వరకు డబ్బు మూటలను సిద్ధం చేశారని సమాచారం. క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటం.. టీడీపీ గ్రాఫ్ పడిపోతుండటంతో డబ్బు మూటలతోనైనా ఆ పార్టీ కేడర్లో జోష్ పెంచేందుకు నెల రోజులుగా నోట్ల కట్టలకే పనిచెప్తున్నారు.
నన్ను డబ్బు మూటగా చూస్తున్నారు భయ్యా
ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, కావలి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రత్యేక మూటలు పంపి వలస నేతల కోసం అంగళ్లు తెరిచారు. ఇలా రాజకీయ దుకాణాల కోసమే రూ.150 కోట్ల వరకు ఆయన వెచ్చించారనే ప్రచారం ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే.. లోక్సభ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు సైతం ఖర్చులకు డబ్బులు అడుగుతుండటం వేమిరెడ్డికి ఇబ్బందిగా మారింది. వీరు తనను డబ్బు మూటగా చూస్తున్నారంటూ తన ఆంతరంగీకుల వద్ద ఆయన వాపోయారని సమాచారం.
అదనపు నగదూ సిద్ధమే
తన సతీమణి పోటీ చేసే కోవూరుకు అదనంగా రూ.150 కోట్లను వేమిరెడ్డి కేటాయించారనే ప్రచారం ఉంది. ఓటును రూ.ఐదు వేలకు కొల్లగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సైతం ప్యాకేజీలను ప్రకటించారని సమాచారం. పొదుపు గ్రూపుల వీఓఏలకు నగదును నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో పంపిణీ చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
ఔరా..!
ఏకమైన కోటీశ్వరులు
ప్రజాస్వామ్య వ్యవస్థను
అపహాస్యం చేస్తున్న టీడీపీ
ఓటమి భయంతో ప్రలోభాలు షురూ..
హోమ్ ఓటుకు రూ.రెండు వేలు
ఇస్తామన్న నారాయణ గ్యాంగ్
పోస్టల్ బ్యాలెట్లకు రూ.ఐదు వేలు
పార్టీ ఫండ్ కోసమే
రూ.900 కోట్లు సేకరించిన వైనం
రూ.400 కోట్లు వెదజల్లుతున్న వేమిరెడ్డి దంపతులు
అపర కుబేరులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సారథ్యంలో నోట్ల కట్టలు రాజ్యమేలుతున్నాయి. ఈ ఇద్దరి పుణ్యమానని అత్యంత ఖరీదైన ఎన్నికలకు నెల్లూరు వేదికగా మారిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ఫండ్ కోసం నారాయణ తన వైద్య కళాశాలలోనే వడ్డీ దుకాణాన్ని ప్రారంభించి దాదాపు రూ.900 కోట్లను సేకరించి పంపారనే ఆరోపణలున్నాయి.
నెల్లూరులోని విజయమహల్ గేట్ సమీపంలో ఓ వృద్ధుడు హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నారాయణ గ్యాంగ్ సభ్యులు ఆయన ఇంటికొచ్చి ఓటు కోసం రూ.రెండు వేలిచ్చేందుకు యత్నించారు. అయితే వారిది సంపన్న కుటుంబం. ఓటును విక్రయించే ప్రసక్తే లేదని.. అసలెందుకు మీరొచ్చి ఇలా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఈ పరిణామాలతో సదరు గ్యాంగ్ పలాయనం చిత్తగించింది.