సీఎం జగనన్న సభను విజయవంతం చేద్దాం
వైఎస్సార్ సీపీ ‘పురం’అసెంబ్లీ అభ్యర్థి దీపిక పిలుపు
హిందూపురం: జనరంజక పాలనతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం హిందూపురం వస్తున్నారని హిందూపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి టీఎన్ దీపిక తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. జగనన్నకు అపూర్వ స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని వర్గాల సంఘాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దీపిక పిలుపునిచ్చారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టో సైతం విడుదల చేశారని, ఈ సారి కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు. ‘జగనన్న చెప్పారంటే చేస్తారంతే’ అని జనమే చెబుతున్నారన్నారు. ఇన్నాళ్లు హిందూపురం నుంచి టీడీపీ గెలుస్తూ వచ్చినా... నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హిందూపురం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, 2024 ఎన్నికలతో హిందూపురం నియోజకవర్గ దశ తప్పకుండా మారుతుందన్నారు. ఇందుకు నాంది పలకడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హిందూపురం నడిబొడ్డున అడుగిడుతున్నారన్నారు.