కరోనా, ఉక్రెయిన్ యుద్ధం, మణిపూర్ అల్లర్లు, విదేశీ జలాల్లోకి ప్రవేశం, సింధు పుష్కరాలు.. ఒకటా రెండా.. ఆపద వచ్చిన ప్రతిసారీ సీఎం వైఎస్ జగన్ ఆపద్బాంధవుని పాత్ర పోషించారు. జిల్లా వాసులు ఇతర ప్రాంతాల్లో ఇరుక్కున్న ప్రతి సందర్భంలోనూ మానవత్వం చూపించారు. డబ్బుల్లేక కొందరు, పరిచయాలు లేక ఇంకొందరు, బయటకు వెళ్లే దారి తెలీక మరికొందరు.. వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయి ఉంటే సంప్రదింపులతో వారిని స్వస్థలాలకు చేర్చి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన మంచి మనసును చాటుకుంది.
● ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించిన వైఎస్ జగన్ సర్కారు
● బాధితులను క్షేమంగా జిల్లాకు తీసుకువచ్చిన ప్రభుత్వం
● ప్రతి సందర్భంలో మానవత్వం చూపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా పాలన సాగించిన వైఎస్ జగన్ సర్కారు.. ఆపద వేళ ప్రతిస్పందించిన తీరుకు దేశం మొత్తం సలామ్ కొట్టింది. కరోనా కాలం నుంచి టర్కీ భూకంపం విపత్తు వరకు, పాక్ జలాల్లోకి మత్స్యకారుల ప్రవేశం నుంచి ఉక్రెయిన్ యుద్ధం వరకు ఆపద వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం సిక్కోలు బిడ్డలను రక్షించుకుంది. కరోనా సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన వారిని జిల్లాకు తీసుకొచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో, దేశం కాని దేశంలో ఉద్యోగాల కోసం వెళ్లి ఇబ్బంది పడుతుంటే...వారితో వెంటనే టచ్లోకి వెళ్లి, వారి సమస్యలు తీర్చి, సొంతూళ్లకు తీసుకొచ్చారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడ నెలకొన్న అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బంది పడుతుంటే నేనున్నానంటూ అభయమిచ్చి, వారికి భరోసా కల్పించి, ప్రభుత్వ నిధులతో వారిని కన్న ఊరికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే అని చెప్పవచ్చు.
● మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో మన జిల్లాకు చెందిన వారు అక్కడ చాలా మంది చిక్కుకున్నారు. తుపాకులు, బాంబుల మోతలతో నిద్రలేని రాత్రులు గడపడమే కాకుండా తిండి, నీరు లేని పరిస్థితుల్లో భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నిట్లో చదివిన పిల్లలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ గడిపారు. పరిస్థితిని గమనించిన వైఎస్ జగన్ ప్రభుత్వం సకాలంలో స్పందించి, వారి వద్దకు వెళ్లి, వారికి పైసా ఖర్చు కాకుండా విమానాల ద్వారా వారందరినీ జిల్లాకు తీసుకొచ్చింది.
● 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు వీరావల్లో సముద్రవేటలో మన జిల్లాకు చెందిన మత్స్యకారులు పట్టుబడ్డారు. దాదాపు 20మంది పాకిస్తాన్ కరాచీ జైలు లో గడిపారు. వారి విడుదల కోసం అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం పెద్దగా ప్రయత్నించలేదు. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ప్రభు త్వం పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఎంపీలు విజయసాయిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ విదేశాంగ మంత్రితో మాట్లాడి, 2020 జనవరి 6న వారందరినీ విడుదల చేయించి, సొంత ఊళ్లకు తీసుకొచ్చారు.
● ట్రావెల్ ఏజెన్సీ నిర్వాకంతో సింధు నది పుష్కరాలకు జిల్లాలోని సోంపేట, నరసన్నపేట, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల నుంచి వెళ్లి యాత్రీకులు ఇబ్బందులు పడగా.. సీఎంఓ అధికారులు సకాలంలో స్పందించి.. ఇబ్బందులు పడిన వారి ఇక్కట్లను తీర్చారు. సరిపడా డబ్బులు ఇవ్వలేదని ట్రావెల్ ఏజెన్సీ ఒక గదిలో పెట్టి నిర్బంధించగా, బాధితులు సెల్ఫీ వీడియో ద్వారా ఆర్తనాదాలు పెట్టగా, వైఎస్ జగన్ ప్రభుత్వమే వెంటనే స్పందించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో మాట్లాడి నిర్బంధంలో ఉన్న వారందరినీ విడిచి పెట్టేలా చేసింది.
● కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్, చైన్నె, తదితర ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవ తీసుకుని రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 3064మంది మత్స్యకారులను 46బస్సుల ద్వారా వారి సొంత ఊర్లకు తీసుకొచ్చింది.
● వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం, సోంపేట, కంచి లి తదితర ప్రాంతాల నుంచి మలేషియా, గల్ఫ్ దేశాలకు ఉపాధి పనుల కోసం వలస వెళ్లి ఏజెంట్ల చేత మోసపోయి, దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బాధితుల సంగతి తెలుసుకుని మంత్రి సీదిరి అప్పల రాజు సకాలంలో స్పందించారు. సీఎంతో మాట్లా డి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వారందరి నీ క్షేమంగా ఊళ్లకొచ్చేలా చర్యలు తీసుకున్నారు.