తిరుపతి అర్బన్: మున్సిపాలిటీలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది పారిశుద్ధ్య చర్యలు చేపట్టడమేనని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఆయన జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలసి మున్సిపాలిటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లా డుతూ మున్సిపాలిటీల పరిధిలో రోజూ క్రమంతప్పకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సుమారు 40శాతం జనాభా మున్సిపాలిటీల పరిధిలో నివాసం ఉంటున్నారన్నారు. మరోవైపు తాగునీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పైపులైన్లు దెబ్బతిని ఉంటే వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా నీటి శుద్ధి ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. డంపింగ్ యార్డ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. భూ సమస్యలు పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని తెలిపారు. అలాగే తడి, పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు కావాలన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తూకివాకం, ఎస్టీపీ ఫైటోరిడ్ టెక్నాలజీ ప్లాంట్ అంశాలపై చర్చించారు. గూడూరు, వెంకటగిరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అంశాలను వివరించారు. పబ్లిక్ హెల్త్ ఈఈ సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు కమిషనర్లు గిరికుమార్, చిన్నయ్య, షేక్ ఫజురుల్లా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment