● ప్రజలు, కార్యకర్తల సంక్షేమం కోసం ఎందాకై నా! ● విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన నాయకుడిగా గుర్తింపు ● వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన నియామకం ● అధికార పార్టీలో గుబులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పోరాట యోధుడుగా భూమన కరుణాకరరెడ్డికి పేరుంది. అధికారపక్షం తప్పులను ఎత్తిచూపుతూ.. ఇటు ప్రజలు.. అటు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతారనే గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఆయన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోమన్రెడ్డి దృష్టిలో పడ్డారు. భూమన కరుణాకరరెడ్డిని చిత్తూరు, తిరుపతి జిల్లాల (తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు) అధ్యక్షుడిగా నియమించారు. భూమన నియామకం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికాపక్షంలో భూమన నియామకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. విద్యార్థి దశ నుంచే పోరాటాల్లో రాటుదేలిన వ్యక్తిగా గుర్తింపు పొందడాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ప్రజలు.. పార్టీ కార్యకర్తల పక్షాన పోరాటం చేసే విషయంలో వెనుకాడే వ్యక్తి కాదని చర్చించుకుంటున్నారు. విద్యార్థి దశలో.. ఆర్ట్ కళాశాల చైర్మన్గా ఉన్న సమయంలో అశ్లీల చిత్రాల ప్రదర్శన, పోస్టర్లు అంటించడంపై భూమన కరుణాకరరెడ్డి ఉద్యమించారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన వారిలో అతిచిన్న వయస్కులు భూమన కరుణాకరరెడ్డి. ఆ సమయంలో అరెస్టయ్యి 21 నెలల పాటు జైల్లో గడిపారు. ఆ సమయంలో ఎన్నో అనుభవాలు.. పలువురు మేధావులతో పరిచయాలు.. ప్రజాశ్రేయస్సు కోసం మరింతగా పోరాటం చేసేలా ప్రభావితం చేశాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తరువాత జనస్రవంతిలోకి వచ్చాక దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధం నాయకుడిగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడిందని పలు సందర్భాల్లో ఆయన వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేసిన నాయకుల్లో భూమన కరుణాకరరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
రాజకీయాల్లోకి వచ్చాక..
యాభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న భూమన కరుణాకరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ సెక్రటరీగా నియమితులయ్యారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తి గత కార్యదర్శిగా మన్ననలు పొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తుడా చైర్మన్, టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఎన్నో చారిత్రాత్మకమైన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తనేంటో నిరూపించుకున్నారు. 2012, 2019లో తిరుపతి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గవర్నింగ్ బాడీ, పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో 2023లో టీటీడీ చైర్మన్గా మరోమారు బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శగా నియమితులయ్యారు. తాజాగా చిత్తూరు, తిరుపతి జిల్లాల (తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు) అధ్యక్షులుగా నియమించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment