కాన్పులెందుకు చేయలేదు?
డక్కిలి: పీహెచ్సీలో కాన్పులు ఎందుకు చేయలేదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యులను ప్రశ్నించారు. డక్కిలి పీహెచ్సీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రిలో అన్ని వైద్య సేవలు అందించే గదులు, రోగులు ఉండే వార్డులు, కాన్పుల గదులను పరిశీలించారు. మండలంలో గర్భిణుల వివరాలు నమోదు చేసిన రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందితో బాలింతలకు ఫోన్ చేయించి, ఎక్కడ ఉన్నారు.. ఎలా ఉన్నారు.. క్షేమంగా కాన్పులు జరిగాయా? అని ఆరా తీశారు. వారి పనితీరును పరిశీలించిన కలెక్టర్ ఇలా అయితే పేదలకు ఎలా వైద్య సేవలు అందిస్తారని ప్రశ్నించారు. గర్భిణులకు కాన్పులు నిర్వహించే గది ఉన్నా, ఆ గదిని కూడా పరిశుభ్రంగా ఉంచాలన్న ఆలోచన లేకుండా మీరేమి విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
పీహెచ్సీ వైద్యులపై కలెక్టర్ ఆగ్రహం
పనితీరు మార్చుకోవాలి
డక్కిలి పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్యులు పనితీరు పూర్థి స్థాయిలో మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. పీహెచ్సీని పూర్తిగా పరిశీలించిన ఆయన అక్కడ పనిచేస్తున్న ముగ్గురు వైద్యులకు మెమో జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మెమోలుతోనే సరి పెడుతున్నామనుకుని పనితీరు మార్చుకోక పోతే మాత్రం తగు చర్యలు తీసుకుంటామన్నారు. డక్కిలి పీహెచ్సీకి తన భార్యను కాన్పు కోసం తీసుకు వస్తే ఇక్కడ పని చేస్తున్న వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఆమె చనిపోయిందని డక్కిలి గ్రామానికి చెందిన యలకచర్ల శ్రీనివాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో విచరాణ కమిటీ వేసినా వైద్యులు ఆ కమిటీని తప్పుదోవ పట్టించి తమకు అన్యాయం చేశారని వాపోయారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోపూరు శ్రీనివాసులు, వైద్యాధికారి శ్రీహరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment