ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆ దివారం జరిగిన చూర్ణోత్సవం, వసంతోత్సవం, శ్రీపుష్పయాగోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉదయం ఆలయ కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు, పండితులు విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలు జరిపారు. ఆ తరువాత శ్రీవారు, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, హారతులిచ్చారు. చూర్ణోత్సవంలో భాగంగా శ్రీవారిని కీర్తిస్తూ అర్చకులు, పండితులు, అలాగే పలువురు మహిళా భక్తులు వడ్లను దంచారు. ఆ తరువాత అర్చకులు భక్తులపై వసంతాలను చల్లారు.
ద్వాదశ కోవెల ప్రదక్షిణలు
ఉభయ దేవేరులతో శ్రీవారికి ఆలయ ప్రాంగణంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో రాత్రి నివేదన కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. అర్చకులు, పండితులు ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అలాగే ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో పిండి వంటను ఆరగింపుచేసి స్వామికి హారతులిచ్చారు. అనంతరం స్వామివారి పవళింపుసేవా మందిరాన్ని సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించి శ్రీపుష్ప యాగోత్సవాన్ని జరిపించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
శయన మహావిష్ణువుగా..
శయన మహావిష్ణువు అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. శేషపాన్పుపై పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీదేవి, భూదేవిలు సేవలు చేస్తున్నట్టు ఉన్న స్వామివారి అలంకారాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి, పరవశించారు.
ఆర్జిత సేవల పునరుద్ధరణ
బ్రహ్మోత్సవాలు ముగియడంతో సోమవారం నుంచి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు.
చూర్ణోత్సవం, పుష్పయాగోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ
Comments
Please login to add a commentAdd a comment